• facebook
  • whatsapp
  • telegram

అధ్యాపక నియామక అర్హతల్లో అస్పష్టత

* ఏఐసీటీఈ-2019 నిబంధనల అమలుకు ఉత్తర్వులివ్వకుండా నిర్ణయం
 


 

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో ఇంజినీరింగ్‌, ఫార్మసీ అధ్యాపకుల నియామక అర్హతల్లో అస్పష్టత నెలకొంది. త్వరలో అధ్యాపకులను నియమిస్తామంటూ ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తప్పులపై తప్పులు చేస్తూ, ప్రక్రియను న్యాయ వివాదాల్లోకి నెట్టేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల అధ్యాపకుల నియామకాలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) 2019లో కొత్త నిబంధనలు జారీ చేసింది. వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు అవసరమైన ఉత్తర్వులు ఇవ్వకుండానే.. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు నిర్ణయించింది. రాజ్యాంగంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అవలంబించాల్సి ఉంటుంది. దీని ప్రకారం.. ఏఐసీటీఈ-2019 నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా ఎడాప్ట్‌ చేసుకోవాలి. తర్వాత విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల ఆమోదం పొందాలి. ఇవి కాదని వర్సిటీల అధ్యాపకుల నియామకాలకు అర్హతలు నిర్ణయించటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మధురై కామరాజ్‌ వర్సిటీ ఉపకులపతి కల్యాణి మతివనన్‌ కేసులో యూజీసీ నూతన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించకపోతే, పాత మార్గదర్శకాలే వర్తిస్తాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏఐసీటీఈ-2019 నిబంధనల అమలుకు అవసరమైన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం నేటికీ చేపట్టలేదు. దీంతో అంతకు ముందున్న యూజీసీ-2010లో పేర్కొన్న కనీస విద్యార్హతలే ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌, ఎంబీఏ, ఎంసీఏలకు వర్తిస్తాయి.


అభ్యర్థుల్లో గుబులు: యూజీసీ 2010లో ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏలకు సంబంధించి సహాయ, అసోసియేట్‌ ఆచార్యుల నియామకాలకు కావాల్సిన కనీస అర్హతలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి అమలుకు 2010లో రాష్ట్ర ప్రభుత్వం జీవో-14 జారీ చేసింది. దీనిప్రకారం ఇంజినీరింగ్‌లో సహాయ ఆచార్యుడి నియామకానికి ఎంటెక్‌లో మొదటి శ్రేణి(ఫస్ట్‌ క్లాస్‌) ఉండాలి. 2018లో యూజీసీ సవరించిన మార్గదర్శకాల్లో కేవలం ఆర్ట్స్‌, సైన్సు కోర్సుల అధ్యాపకుల నియామకాలకు మాత్రమే కనీస అర్హతలు వెల్లడించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో-14 ద్వారా ఎడాప్ట్‌ చేసుకుంది. తర్వాత 2019 మార్చిలో అధ్యాపకుల నియామకాలకు సంబంధించి ఏఐసీటీఈ కనీస విద్యార్హతలను విడుదల చేసింది. వీటి ప్రకారం ఇంజినీరింగ్‌లో సహాయ ఆచార్యుడికి బీటెక్‌లోగానీ, ఎంటెక్‌లోగానీ మొదటి శ్రేణి ఉంటే సరిపోతుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలు అమలు చేసేందుకు అవసరమైన ప్రక్రియను ఇప్పటికీ చేపట్టలేదు. ఏఐసీటీఈ నిబంధనలను ఎడాప్ట్‌ చేసుకోకుండా అర్హతలు నిర్ణయిస్తే న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ నేరాల గుట్టు పట్టే కోర్సులు

‣ సందేహాలా?.. ఐఐటియన్ల సలహాలివిగో..!

‣ దిల్లీ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు

‣ సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం

‣ యువత ఉపాధికి దారి.. రియల్‌ ఎస్టేట్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.