2025-26 నుంచి ఎన్ఎంసీ కొత్త ఆంక్షల అమలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి కొత్తగా ప్రతిపాదించిన ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ప్రకటించిన తాజా నిర్ణయం అశనిపాతంలా మారింది. ప్రతి పది లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండాలన్న ఆంక్షల అమలుకు 2024-25 విద్యా సంవత్సరానికి మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు నవంబరు 15న ఎన్ఎంసీ ప్రకటించింది. 2025-26 నుంచి యథావిధిగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న పిడుగురాళ్ల, అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, పార్వతీపురం వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితులు లేవు. రూ.3,530 కోట్లతో చేపట్టిన ఈ భవనాల నిర్మాణ పనులు ఇప్పటికి రూ.348 కోట్ల మేర చేశారు. ఒక్కో కళాశాలలో 150 మంది చొప్పున వైద్య విద్యార్థులను చేర్చుకునేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
‣ 2024-25 విద్యా సంవత్సరంలో పులివెందుల, మదనపల్లె, ఆదోని, పాడేరు, మార్కాపురం వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎంసీకి దరఖాస్తు చేసింది. గత ఆగస్టు 16న ప్రతి పది లక్షల మంది జనాభాకు ఒక ఎంబీబీఎస్ సీటు మాత్రమే ఉండాలని పేర్కొంటూ ఎన్ఎంసీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై పునరాలోచన చేయాలని తమిళనాడుతో పాటు ఏపీ, ఇతర రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. దీనిపై నవంబరు 1న ఎన్ఎంసీ ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రతి పది లక్షల జనాభాకు ఒక ఎంబీబీఎస్ సీటు అన్న నిబంధనను 2025-26 నుంచి మాత్రమే అమలు చేస్తామని వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరం వరకు మినహాయింపు ఇవ్వడంతో పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి గండం తప్పింది.
అమలు సాధ్యం కాదు: రాష్ట్రంలో 5,34,56,000 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం 6,435 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రతి 10 లక్షల మందికి ఒక సీటు ప్రకారం 5,347 మాత్రమే ఉండాలి. అదనంగా 1,088 సీట్లు ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అదనంగానే ఉన్నాయి. బిహార్, మధ్యప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయి. ఇక్కడి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఎన్ఎంసీ ఆంక్షలు విధించింది. ప్రస్తుత విధానంలో తొలి ఏడాదిలో చేరిన విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలోకి వచ్చే నాటికి అవసరమైన నిర్మాణాలు, ఫ్యాకల్టీ నియామకాలు, పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ వస్తున్నారు. వారు చివరి సంవత్సరానికి వస్తే 600 సీట్లకు సరిపడా సౌకర్యాలను పెంచుతున్నారు. ఎన్ఎంసీ కొత్త మార్గదర్శకాల ప్రకారం నాలుగేళ్ల తరువాత కల్పించే సదుపాయాలన్నీ ప్రారంభ ఏడాదిలోనే సిద్ధం చేయాలి. వైద్య కళాశాల ప్రారంభ ఏడాదిలోనే 600 పడకలు ఉండాలని తెలిపింది. వీటిని అమలు చేయడం సాధ్యమయ్యే అవకాశాలు లేనందున 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఏడు కొత్త వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.