మూడో దశ కాలేజీలపై ఎన్ఎంసీ నిబంధనల ప్రభావం
ఈనాడు, అమరావతి: కొత్త వైద్య కళాశాలల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించక పోవడం చేటు తెచ్చింది. 17 కళాశాలలను రెండు దశల్లో అందుబాటులోకి తేవాల్సి ఉండగా... సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోనందున మూడో దశకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈలోగా వైద్య కళాశాలల ఏర్పాటుకు సబంధించి జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) కొత్త నిబంధనల్ని ప్రకటించింది. వాటి ప్రభావం 2025-26 విద్యా సంవత్సరంలో మొదలవ్వాల్సిన ఏడు వైద్య కళాశాలలపై పడింది.
‣ 2021 మేలో 14 వైద్య కళాశాలల నిర్మాణాలను సీఎం తలపెట్టారు. పనులు సవ్యంగా సాగితే 2022-23, 2023-24 సంవత్సరాల్లో కళాశాలలు అందుబాటులోకి వచ్చేవి. మహా అయితే మరో ఏడాది ఆలస్యమయ్యేది. నిర్మాణాలకు అవసరమైన సుమారు రూ.8 వేల కోట్లు లేకపోవడం, ఏజెన్సీలు ఖరారు కాకపోవడం, రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగాల్సి రావడం.. వంటి కారణాలతో 2023-24లో ఐదు కళాశాలల్లోనే తరగతులు మొదలయ్యాయి. 2024-25లో మరో 5 కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన ఏడు.. 2025-26 విద్యాసంవత్సరంలో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఏడింటిలో కేంద్ర ప్రభుత్వం సీఎస్ఎస్ కింద ప్రత్యేకంగా నిధులు కేటాయించిన పిడుగురాళ్ల వైద్య కళాశాల కూడా ఉంది. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల కళాశాలలకు రూ.390 కోట్ల చొప్పున 60:40 నిష్పత్తిలో కేంద్రం ఆర్థికసాయం చేసింది. మచిలీపట్నం కళాశాల ఇప్పటికే ప్రారంభం కాగా... పాడేరు కళాశాల 2024-25 విద్యా సంవత్సరంలో మొదలు కాబోతోంది.
ఇదీ అసలు సమస్య..
ప్రస్తుత విధానంలో తొలి సంవత్సరంలో చేరిన విద్యార్థులు ద్వితీయ ఏడాదిలోకి వచ్చేనాటికి వారికి అవసరమైన నిర్మాణాలు, పరికరాలు, మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవాలి. ఫ్యాకల్టీని నియమించాలి. కోర్సు చివరి సంవత్సరానికల్లా 600 సీట్లకు సరిపడా సౌకర్యాలు కల్పించాలి. అధ్యాపకుల్ని నియమించాలి. అయితే ఈసారి... నాలుగేళ్ల తర్వాత కల్పించే సదుపాయాలన్నింటినీ ప్రారంభ ఏడాదిలోనే సిద్ధం చేయాలని ఎన్ఎంసీ నిబంధన విధించింది. లేబొరేటరీల ఏర్పాటు, ట్యూటర్ల నియామకాలు, ఇతర నిబంధనల అమలు వెంటనే సాధ్యంకాదు. 2024-25 విద్యా సంవత్సరంలో పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలోని కళాశాలలను ప్రారంభించేందుకు ఎన్ఎంసీ నుంచి అనుమతి కోరుతూ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. కొత్త నిబంధనల నేపథ్యంలో 150 సీట్లు లేదా 100 సీట్లయినా మంజూరు చేయాలని అభ్యర్థించింది. అందుకు అనుగుణంగా వివరాలు సమర్పించింది. ఎన్ఎంసీ నిబంధనల వల్ల 2025-26లో మొదలవ్వాల్సిన ఏడు వైద్య కళాశాలల భవితవ్యం ప్రమాదంలో పడింది. కొత్త నిబంధనల్ని కొంతకాలం వాయిదా వేయాలని ఏపీతోపాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కోరనున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.