* బేస్లైన్ పరీక్ష వాస్తవాలను బయటపెట్టమని డిమాండ్
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యముంటే 2022 జులైలో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవడానికి నిర్వహించిన బేస్లైన్ పరీక్ష ఫలితాలను వెల్లడించాలని సామాజిక కార్యకర్త గుంటుపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పిల్లల అభ్యసన స్థాయిలను గుర్తించకుండా, రాజకీయ లబ్ధికోసం వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్షలో ప్రస్తావనకు వచ్చిన అంశాల్లోని వాస్తవాలను ఉటంకిస్తూ సీఎంకు శ్రీనివాస్ లేఖ రాశారు. ప్రధానాంశాలివీ..
ప్రభుత్వం చెప్పింది: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆరు, ఆపై తరగతులకు ఫ్యూచర్ స్కిల్స్పై పాఠ్యాంశాలు బోధించాలి.
వాస్తవం: 2022 జులైలో ప్రభుత్వ బడుల్లో విద్యాశాఖ బేస్లైన్ పరీక్ష నిర్వహించింది. గత 25 ఏళ్లలో విద్యాశాఖ, ఉపాధ్యాయులు నిజాయతీగా నిర్వహించిన ఏకైక పరీక్ష ఇది. బడికి రోజూ హాజరయ్యే ప్రతి విద్యార్థి ఆ పరీక్ష రాశారు. దాని ఫలితాల ప్రకారం 6, 7, 8 తరగతుల విద్యార్థుల్లో 41.5శాతం మంది సరళమైన తెలుగు వాక్యాలున్న చిన్న పేరా చదవలేకపోయారు. 65.2 శాతం మంది మూడు సరళ ఆంగ్ల పదాలున్న వాక్యాలూ చదవలేదు. 58.6 శాతం మంది చిన్నపాటి భాగహారాలు చేయలేదు. ఇవీ.. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల వాస్తవ సామర్థ్యాలు. కనీస అవగాహన లేని పిల్లలు బడిలో అయినా, బడి బయట అయినా ఆధునిక సాంకేతికత, ఫ్యూచర్ స్కిల్స్ను నేర్చుకోవడంలో వెనకబడతారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు 2018లో విడుదల చేసిన
‘లెర్నింగ్: టు రియలైజ్ ఎడ్యుకేషన్ ప్రామిస్’ నివేదికలో పేర్కొంది. విద్యాశాఖ బేస్లైన్ పరీక్ష నిర్వహించి 16 నెలలు దాటినా, దాని ఫలితాలను ఇప్పటికీ తల్లిదండ్రులకు చెప్పలేదు. అంటే సమాజానికి వాస్తవాలు చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది.
ప్రభుత్వం చెప్పింది: ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 3నుంచి 9వ తరగతి వరకు యూనిట్ పరీక్షల్లో 87శాతం మంది ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాస్తున్నారు. దేశవ్యాప్త సగటు 37.03శాతం మాత్రమే.
వాస్తవం: కనీసం మూడు పదాల ఆంగ్ల వాక్యాలు చదవలేని పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు ఎలా రాస్తున్నారు? ఉపాధ్యాయులు బోర్డుపై ఆంగ్లంలో సమాధానాలు రాసి, పిల్లలతో జవాబు పత్రాల్లో రాయిస్తున్నారు. పరీక్షల నిర్వహణ తీరును సీసీ కెమెరాల ద్వారా తల్లిదండ్రులకు చూపించి, ప్రభుత్వం నిజాయతీని నిరూపించుకోవాలి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలు అమర్చాలని విద్యాశాఖ కమిషనర్ 2020లో ఇచ్చిన ఆదేశాలు నేటికీ అమలు కావడం లేదు. విద్యార్థుల వాస్తవ సామర్థ్యాలను తల్లిదండ్రులకు, సమాజానికి చెప్పే ధైర్యం వైకాపా ప్రభుత్వానికి లేదు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ 26,146 కానిస్టేబుల్ ఖాళీలకు ప్రకటన
‣ ఐటీఐతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ డిగ్రీతో ఎయిర్పోర్ట్స్ అథారిటిలో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.