మంత్రి బొత్స క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగులు
ఈనాడు, అమరావతి: జనవరి మొదటి వారంలో మెగా డీఎస్సీ ప్రకటన రాకపోతే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని నిరుద్యోగులు హెచ్చరించారు. గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన డీఎస్సీ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో విజయవాడలోని మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని జనవరి 3న వారు ముట్టడించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని మధురానగర్, మాచవరం పోలీస్స్టేషన్లకు తరలించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాము, రామన్న మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలి. ఏపీలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డీఎస్సీపై మంత్రి బొత్స రోజుకో మాట మాట్లాడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక తరగతుల విలీనం, హేతుబద్ధీకరణ పేరుతో 2వేల బడులను మూసివేయగా.. 15 వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేశారని’ పేర్కొన్నారు.
నిరసన గళంపై నిప్పులుగక్కిన పోలీసులు!
ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకు సాగిన యువతను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసేక్రమంలో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా వాహనం ఎక్కించారు. అయినా యువకులు తప్పించుకొని క్యాంపు కార్యాలయం వైపు దూసుకెళ్తుండటంతో పోలీసులు వారిని పట్టుకొని బూటు కాళ్లతో తొక్కి, పీకలు నొక్కి, పిడిగుద్దులు కురిపించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నౌకాదళంలో 910 సివిల్ కొలువులు
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు
‣ సివిల్స్ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.