• facebook
  • whatsapp
  • telegram

Constable Exam: నిపుణుల కమిటీ ప‌రిశీల‌న‌కు 13 ప్రశ్నలు

* సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశం
తెలంగాణ కానిస్టేబుల్ ప‌రీక్ష‌

ఈనాడు, హైదరాబాద్‌: సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రశ్నపత్రాల్లో తెలుగు తర్జుమా లేని నాలుగు ప్రశ్నలను తొలగించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు జ‌న‌వ‌రి 4న‌ సవరించింది. ఈ నాలుగు ప్రశ్నలతో పాటు ఇతరత్రా సందేహాలు వ్యక్తం చేసిన మరో తొమ్మిది ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలని పోలీసు నియామక మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంది. బోర్డు ఏర్పాటుచేసిన కమిటీ 13 ప్రశ్నలను పరిశీలించి నిర్ణయం వెలువరించాలంది. ఈ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. నిపుణుల కమిటీ నిర్ణయానికి పిటిషనర్లు, పోలీసు నియామక మండలి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. సుమారు 4,965 సివిల్‌ కానిస్టేబుళ్ల పోస్టుల నియామకం నిమిత్తం రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి 2022 ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ఆధారంగా అదే ఏడాది ఆగస్టు 30న తుది రాత పరీక్షలు నిర్వహించింది. అభ్యర్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడంతో పాటు తప్పుగా ఉన్నాయని, వాటిని తొలగించాలని వినతిపత్రం సమర్పించినా పట్టించుకోకపోవడంతో పలువురు అభ్యర్థులు వేర్వేరుగా ఆరు పిటిషన్‌లు దాఖలు చేశారు.


తెలుగు అనువాదం లేకుండా ట్రాన్సిలిటిరేషన్‌లో ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీటిపై విచారించిన సింగిల్‌ జడ్జి.. నోటిఫికేషన్‌ ప్రకారం తెలుగులో ప్రశ్నలు ఉండాలని, ఇక్కడ 4 ప్రశ్నలకు అనువాదం లేనందున వాటిని తొలగించాక మూల్యాంకనం చేసి ఎంపిక జాబితాను ప్రకటించాలని తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ పోలీసు నియామక మండలితో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రశ్నపత్రంలో తొలగించిన ప్రశ్నలపై సింగిల్‌ జడ్జి నిర్ణయం తీసుకోకుండా నిపుణుల కమిటీకి నివేదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ అభ్యంతరాలు లేవనెత్తిన ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించామని తెలిపారు.  ప్రశ్నపత్రం రూపొందించిన జేఎన్‌టీయూ ప్రొఫెసర్లతోనే కమిటీ ఏర్పాటు చేశారని అభ్యర్థుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం కేవలం ఓయూ ప్రొఫెసర్లతో మాత్రమే స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పోలీసు నియామక మండలిని ఆదేశించింది.
 



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.