* లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ప్రకటించేందుకు సర్కారు కసరత్తు
* గణాంకాలు సేకరించిన విద్యాశాఖ
* ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న టీచర్లు 3,800 మందిగా గుర్తింపు
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో విద్యాశాఖ.. పదవీ విరమణ చేయనున్న వారితోసహా పలు వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. వాస్తవానికి వారందరూ 2021లోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మూడేళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించింది.
మరోసారి సీఎంతో చర్చించి తుది ఆమోదం..
గత ఏడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. అందుకే పాత నోటిఫికేషన్కు సుమారు మరో 5 వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లోక్సభ ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల (సీడబ్ల్యూఎస్ఎన్)కు బోధించేందుకు దాదాపు 1,500 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని.. తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్లో అత్యధికం.. నారాయణపేటలో అత్యల్పం
ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్లో 370 మంది టీచర్లు పదవీ విరమణ చేయనున్నారు. మేడ్చల్లో-260, ఖమ్మం-240, రంగారెడ్డి 210, సంగారెడ్డి-200, నిజామాబాద్లో-190 మంది ఉన్నారు. అతి తక్కువగా నారాయణపేటలో 40 మంది రిటైర్ కానున్నారు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1.22 లక్షలు కాగా... ప్రస్తుతం 1.03 లక్షల మంది పనిచేస్తున్నారు. అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం 3.7 శాతం మంది రిటైర్ కానునున్నారు.
మార్చి నెలాఖరులో 360 మంది పదవీ విరమణ చేయనుండగా.. జూన్లో అత్యధికంగా 700 మంది విశ్రాంత ఉపాధ్యాయులుగా మారనున్నారు.
పదవీ విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయుల్లో 80 శాతానికిపైగా పురుషులే ఉన్నారు. ఇప్పుడు రిటైర్ అవుతున్నవారంతా 30 ఏళ్ల కిత్రం నియమితులైనవారు. ఆ సమయంలో మహిళలు ఉపాధ్యాయ కొలువుల్లో తక్కువగా ఉన్నారు. 1996లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
టీఆర్టీ/డీఎస్సీ తెలంగాణ
మరిన్ని వాటి కోసం క్లిక్ చేయండి
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్’ కోర్సులు
‣ ఎన్సీఎల్లో ట్రైనీ సూపర్వైజరీ పోస్టులు
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.