* మధ్యస్థంగా జేఈఈ మెయిన్ - 2024 ప్రశ్నలు
* జనవరి 27న జరిగిన షిఫ్ట్-1 ప్రశ్నపత్రం విశ్లేషణ
ఈనాడు ప్రతిభ డెస్క్: జేఈఈ మెయిన్ – 2024 తొలి దశ మొదటి రోజు మొదటి షిఫ్ట్ పరీక్షలో వంద శాతం మార్కులు సాధించుకోగలిగిన అవకాశం ఉందని శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆల్ ఇండియా ఐఐటీ కో-ఆర్డినేటర్ ఎం. ఉమాశంకర్ పేర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్2024 తొలి విడత (బీఈ/ బీటెక్) పరీక్షలు జనవరి 27న ప్రారంభమయ్యాయి. శనివారం మొదటి షిఫ్ట్ పూర్తి కాగానే ఆయన ప్రశ్నపత్రాన్ని విశ్లేషించారు. ప్రశ్నల స్థాయి మధ్యస్థంగా ఉందన్నారు. తికమక పెట్టే, గందరగోళ పరిచే ప్రశ్నలు రాలేదు. మూడు సబ్జెక్టుల్లోనూ కొన్ని ప్రశ్నలు మధ్యస్థాయి కంటే తక్కువగా, సులభంగా ఉన్నాయన్నారు. పూర్తిగా సిలబస్ పరిధిలోనే ప్రశ్నలు అడిగారు. మొత్తంగా చూస్తే వంద శాతం మార్కులు (300లకు 300 మార్కులు) సాధించుకునే వీలుందన్నారు. మ్యాథ్స్ విభాగంలో అసెర్షన్(A), రీజన్(R) ప్రశ్నలు రాలేదు కానీ స్టేట్మెంట్ I, స్టేట్మెంట్ II ప్రశ్నలు రెండు వచ్చాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలో అసెర్షన్/ రీజన్ రకానివి ఒక ప్రశ్న చొప్పున; ఫిజిక్స్, కెమిస్ట్రీలో స్టేట్మెంట్ I, స్టేట్మెంట్ II రకానివి రెండు చొప్పున ఇచ్చారు. మొత్తంగా మూడు సబ్జెక్టుల్లో స్టేట్మెంట్ I, స్టేట్మెంట్ II; అసెర్షన్/ రీజన్ ప్రశ్నలు ఎనిమిది వరకు వచ్చాయి. ఈ ఎనిమిది ప్రశ్నలే వంద శాతం మార్కుల సాధనకు కీలకంగా మారనున్నాయి. ప్రతి విద్యార్థి కనీసం 100 మార్కులు సులువుగా తెచ్చుకునే విధంగా ప్రశ్నపత్రం ఉందని ఆయన తెలిపారు. సంవత్సరంలో రెండుసార్లు జరిగే జేఈఈ మెయిన్ తొలి, మలి దశల్లో వచ్చిన స్కోరుల్లో ఉత్తమమైన దానిని పరిగణనలోకి తీసుకొని అంతిమంగా అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.