• facebook
  • whatsapp
  • telegram

Educations: అన్ని పాఠ్యపుస్తకాలు.. అన్ని భాషల్లో

* పాఠశాల నుంచి ఉన్నతవిద్య వరకు అనువాదం

* నియంత్రణ విభాగాలకు కేంద్రం ఆదేశం

* మూడేళ్లలో డిజిటల్‌గా అందుబాటులోకి!

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా విద్యార్థులకు తమ సొంత భాషలో చదువుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. వచ్చే మూడేళ్లలో అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు తర్జుమా చేపట్టాలని నియంత్రణ సంస్థలైన ఎన్‌సీఈఆర్‌టీ, యూజీసీ, ఏఐసీటీఈ, ఇగ్నో, జాతీయ సార్వత్రిక విద్యా పీఠం (ఎన్‌ఐఓఎస్‌)తోపాటు కేంద్రీయ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్‌ వర్సిటీలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. మాతృభాషలో చదువుకోవడాన్ని ప్రోత్సహించాలని జాతీయ నూతన విద్యా విధానం-2020 సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీటెక్‌ కోర్సులనూ ప్రాంతీయ భాషల్లో బోధనకు ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా అనుమతిస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్‌ కోర్సు హిందీ మాధ్యమంలో ఇప్పటికే మొదలైంది.

అనువాదిని యాప్‌..

రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భారతీయ భాషల్లో అన్ని తరగతుల పుస్తకాలను ఆంగ్లం నుంచి తర్జుమా చేయాలని కేంద్ర విద్యాశాఖ సంకల్పించింది. ఏ భాష నుంచి ఏ భాషలోకైనా సులభంగా తర్జుమా చేసేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే అనువాదిని యాప్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. దాని సహాయంతో గత రెండేళ్ల నుంచి ఇంజినీరింగ్‌, మెడికల్‌, లా తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల పాఠ్యపుస్తకాలను అనువాదం చేస్తున్నారు. ఇలా తర్జుమా చేసిన ఉన్నత విద్య కోర్సుల పుస్తకాలను ఈ-కుంభ్‌ పోర్టల్‌లో ఉంచారు. పాఠశాల విద్యకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ దీక్షా యాప్‌లో అందుబాటులో ఉంది. మొత్తానికి అన్ని తరగతుల పుస్తకాలను 2026 నాటికి అన్ని భాషల్లో అందుబాటులో ఉంచనున్నారు.  
యాప్‌ గురించి అవగాహన కల్పిస్తున్నాం

బుద్ధా చంద్రశేఖర్‌, ముఖ్య సమన్వయకర్త, ఏఐసీటీఈ

అనువాదిని యాప్‌ సహాయంతో పాఠ్యపుస్తకాల తర్జుమాపై విశ్వవిద్యాలయాలకు అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల్లో సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇటీవలే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రజంటేషన్‌ ఇచ్చాం. మార్చ్‌ లలో ఏపీలో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో అవగాహన కల్పించబోతున్నాం. ఆంగ్ల భాష భయంతో ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్యను మానేయకుండా కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోంది. ఎందరో నిపుణులు, రచయితలు తర్జుమా చేయడానికి ముందుకొస్తున్నారు. ఇటీవల యూజీసీ సైతం రచయితల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కేరళ హైకోర్టు ఆంగ్లంలో ఇచ్చిన తీర్పులను ఈ యాప్‌ సహాయంతో మలయాళంలోకి తర్జుమా చేసి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతోంది.
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.