• facebook
  • whatsapp
  • telegram

Jobs: ప్రభుత్వ కొలువు.. ఈయనకు చాలా సులువు

* మూడేళ్లలో 15 ఉద్యోగాలు సాధించిన రమావత్‌ మధుసూదన్‌

ఈనాడు, హైదరాబాద్‌: మూడు సంవత్సరాల వ్యవధిలో 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు ఆ యువకుడు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలానికి చెందిన రమావత్‌ మధుసూదన్‌ ఏప్రిల్‌ 1న వెలువడిన ఐబీపీఎస్‌ ఫలితాల్లో పీవో కేడర్‌లో కెనరాబ్యాంకులో ఉద్యోగాన్ని సాధించాడు. ఇంతకు మునుపు ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌, ఎస్‌బీఐలలో పీవో పోస్టులు... ఎల్‌ఐసీ ఏఏవో, ఎన్‌ఐఏసీఎల్‌ ఏవో, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ మేనేజర్‌, ఎఫ్‌సీఐలో అసిస్టెంట్‌ గ్రేడ్‌-3, ఐడీబీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ, ఐడీబీఐ విభాగాల్లో క్లరికల్‌ ఉద్యోగాలు, ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌ క్లరికల్‌, టీఎస్‌ క్యాబ్‌లో మేనేజర్‌గా ఎంపికయ్యాడు. పోస్టు కేటాయించిన ప్రదేశం, వాతావరణం, వేర్వేరు కారణాలతో ఇప్పటివరకు ఏ పోస్టులోనూ  చేరలేదని మధుసూదన్‌ తెలిపాడు. ప్రస్తుతం ‘స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (సీజీఎల్‌)’లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నట్టు పేర్కొన్నాడు. మధుసూధన్‌ తండ్రి పాండు వ్యవసాయం చేస్తుండగా.. తల్లి నాగమణి స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకపోవడం, తల్లి ప్రోత్సాహంతో విజయాలు సాధిస్తున్నట్లు చెప్పాడు. 2020లో బీటెక్‌ (ఎన్‌ఐటీ కాలికట్‌లో ఈఈఈ) పూర్తి చేసిన మధుసూదన్‌ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బీటెక్‌లో 60శాతం మార్కులతో పాసైన ఈ యువకుడు ‘ఈనాడు’తో మాట్లాడుతూ వివిధ ఉద్యోగాలు సాధించిన తీరును వివరించాడు. ‘ఒక సంవత్సరం బ్యాంకు ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమించా. తొలి ప్రయత్నంలో విజయం అందకపోయినా కుంగిపోలేదు. కచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకంతో ప్రయత్నాన్ని కొనసాగించా. ఆ తర్వాత వరసగా ఐబీపీఎస్‌, ఎస్‌బీఐతో పాటు పలు బ్యాంకుల నుంచి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అప్పటికే కోర్సు పూర్తిచేసి సన్నద్ధమై పరీక్షలు రాయగా తొలుత క్లర్క్‌, ఆ వెంటనే ఆఫీసర్‌ కేడర్‌ ఉద్యోగాలు దక్కాయి. ఆ తర్వాత ఎస్‌బీఐ పీవో (కర్ణాటక)గా ఎంపికవడంతో ఉద్యోగంలో చేరాను. తర్వాత తెలంగాణలో గ్రూప్‌ నోటిఫికేషన్లు రావడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ సాధన మొదలుపెట్టా. దిల్‌సుఖ్‌నగర్‌లోని కోచింగ్‌ సెంటర్లో నిరంతరం పరీక్షలు రాస్తూ, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయి’ అని పేర్కొన్నాడు. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉందని.. అందుకోసం శ్రమిస్తున్నానని మధుసూదన్‌ తెలిపాడు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.