* మరో ఇద్దరు అరెస్టు
దిల్లీ: నీట్ యూజీ-2024 (NEET UG-2024) పరీక్ష పేపర్ లీక్, అవకతవకలకు సంబంధించిన దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. తాజాగా మరో ఇద్దరు కీలక వ్యక్తులను కస్టడీలోకి తీసుకుంది. ఇందులో ఓ వ్యక్తి.. పరీక్ష జరగడానికి ముందు ఝార్ఖండ్లోని హజారీబాగ్లో ఉన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన ట్రంక్ పెట్టె నుంచి నీట్ పేపర్ను తస్కరించినట్లు గుర్తించారు.
నీట్ పేపర్ లీక్ చేసినట్లు అనుమానిస్తున్న పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్యను సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది. ఐఐటీ జంషెడ్పుర్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఇతడు.. హజారీబాగ్లోని ఎన్టీఏకు చెందిన ట్రంక్ పెట్టె నుంచి ప్రశ్నపత్రాన్ని తస్కరించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ప్రశ్నపత్రం లీక్ చేయడంలో ఆదిత్యకు సహాయపడిన రాజు సింగ్ అనే మరో వ్యక్తిని హజారీబాగ్లో అదుపులోకి తీసుకుంది. ఈ ప్రశ్నపత్రాలనే రాజు తన గ్యాంగ్ సభ్యులకు దీన్ని చేరవేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సీబీఐ మొత్తంగా 14 మందిని అరెస్టు చేసినట్లయ్యింది.
ఇప్పటికే హజారీబాగ్లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా.. అక్కడ కాలిపోయిన ప్రశ్నపత్రాలను బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో మే 5న నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 4,570 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే.. 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం. అంతేకాకుండా ఒకే సెంటర్లో పరీక్ష రాసిన పలువురు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు రావడం అనుమానాలకు దారితీసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.