* ‘నీట్ పీజీ’ నిర్వహణకు కీలక నిర్ణయం
దిల్లీ: నీట్ యూజీ-2024 (NEET UG 2024) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ నీట్ పీజీ 2024 (NEET PG 2024) పరీక్ష నిర్వహణను కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఈ నెలాఖరు లేదా ఆగస్టులో నీట్ పీజీ పరీక్ష ఉండొచ్చని తెలుస్తోంది. దీనిపై ఈ వారంలోనే రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక, పరీక్షలో అక్రమాలకు తావులేకుండా ఉండేలా చివరి గంటల్లోనే ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
అనుమతి వచ్చిన తర్వాతే షెడ్యూల్
జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పరీక్షకు ఒక రోజు ముందు ప్రకటించారు. రివైజ్డ్ షెడ్యూల్ను మంగళవారం (జులై 2న) ప్రకటించనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే పరీక్ష తేదీని నేడు వెల్లడించలేమని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) సీనియర్ అధికారి తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం తాము సిద్ధం చేసిన ప్రణాళికను కేంద్రం ఇంకా ఆమోదించలేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.
జులై 5వ తేదీలోగా పరీక్ష తేదీ వెల్లడి
జులై చివర్లో లేదా ఆగస్టులో పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయని ఆ అధికారి తెలిపారు. జులై 5వ తేదీలోగా షెడ్యూల్ను వెల్లడిస్తామన్నారు. ఇక, నీట్ యూజీ పేపర్ లీకేజ్ (NEET Row) వివాదం నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు ఎగ్జామినేషన్స్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరీక్షకు కేవలం 2 గంటల ముందు ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి సెంటర్లకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.