* 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రధాన పరీక్షకు 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ప్రిలిమినరీ పరీక్ష తుది ‘కీ’ని అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో పొందుపరిచినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ప్రధాన పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకు జరుగుతాయని, హాల్టికెట్లు పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపింది.
రెండు ప్రశ్నల తొలగింపు
గ్రూప్-1 తుది ‘కీ’లో మాస్టర్ ప్రశ్నపత్రంలో 56, 59 ప్రశ్నలను తొలగించింది. అలాగే 115వ ప్రశ్నకు ప్రాథమిక కీలో సమాధానం 2గా ఉంటే.. తుది ‘కీ’లో ఒకటిగా మార్చింది. గ్రూప్-1 పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో టీజీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు 4,03,667 మంది దరఖాస్తు చేయగా.. జూన్ 9న నిర్వహించిన రాతపరీక్షకు 3,02,172 మంది హాజరయ్యారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని జూన్ 12న ప్రకటించిన కమిషన్.. జూన్ 13 నుంచి 17 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. జూన్ 24న అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ కాపీలను వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రధాన పరీక్షకు మల్టీజోన్ వారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనలు-1996 ప్రకారం సంబంధిత కేటగిరీల అభ్యర్థుల సంఖ్య తక్కువగా.. ఆ మేరకు ఆయా కేటగిరీల నుంచి తదుపరి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ లెక్కన మొత్తం 563 పోస్టులకు రెండు మల్టీజోన్లలో కలిపి 31,382 మంది పోటీలో ఉన్నారు. క్రీడాకారుల కోటా కింద తదుపరి అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. గ్రూప్-1 తుది ఫలితాలు ప్రకటించిన తరువాత.. ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాఫ్ మార్కులను కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తామని పేర్కొంది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.