* జూన్ 1 నుంచి వెబ్సైట్లో హాల్టికెట్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ (ఇంతకుముందు టీఎస్పీఎస్సీ) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. 2022లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేసిన కమిషన్.. 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త ప్రకటనను జారీ చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు, మూల్యాంకన సిబ్బంది నియామకం, బాధ్యతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో, టెలి కాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాలతో న్యాయవివాదాలు తలెత్తిన దరిమిలా ప్రిలిమ్స్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి పరీక్షలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఓఎంఆర్ పద్ధతిలో ప్రిలిమ్స్..
ప్రిలిమ్స్ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇస్తూ వెబ్ నోట్ జారీ చేసింది. ఈ పరీక్షను ఓఎంఆర్ లేదా సీబీఆర్టీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశముందని, దీనిపై కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. భారీగా 4.03 లక్షల దరఖాస్తులు రావడంతో.. సీబీఆర్టీ విధానంలో అయితే సెషన్ల వారీగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని అంచనా వేసింది. అందువల్ల ఒక్కరోజులోనే పూర్తి చేసేందుకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హాల్టికెట్లు జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటాయంది.
షెడ్యూలు ప్రకారం పూర్తి చేసేందుకు కార్యాచరణ
గ్రూప్-1 నియామకాలను షెడ్యూలు ప్రకారం పూర్తి చేసేందుకు టీజీపీఎస్సీ ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసింది. ఫిబ్రవరిలో ఉద్యోగ ప్రకటన జారీ చేసిన వెంటనే జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రధాన పరీక్షలు అక్టోబరు 21న ప్రారంభమవుతాయని తెలిపింది. దీంతో ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రధాన పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యేందుకు వీలు కలుగుతుంది. ప్రధాన పరీక్షలు మొత్తం 7 పేపర్లలో జరుగుతాయి. మరోవైపు, గతంలో ఇచ్చిన జీవో నంబరు 55కు కమిషన్ సవరణలు చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను జోన్లవారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రిజర్వుడ్ వర్గాలవారీగా 1:50 నిష్పత్తిలో తీసుకుంటారు. రిజర్వుడ్ వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్థులకు సూచనలు
* ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేస్తూ టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెబ్నోట్ జారీ చేశారు. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ పత్రాలు అందజేస్తామని వెల్లడించింది. పరీక్ష సమయంలో వేలిముద్ర, ఫొటో బయోమెట్రిక్ తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వనివారిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ బయోమెట్రిక్ను నియామక ప్రక్రియ వివిధ దశల్లో ద్రువీకరించుకుంటామని పేర్కొన్నారు.
* అభ్యర్థులకు పరీక్ష రోజు హాల్టికెట్ నంబరు, ఫొటో, పేరు, తండ్రి, తల్లి పేర్లు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, జెండర్ వివరాలను ముద్రించిన ఓఎంఆర్ జవాబుపత్రం అందిస్తారు. ఇందులో తప్పులుంటే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి.. సాదా ఓఎంఆర్ పత్రాన్ని పొందాలి.
* పరీక్ష రాసేముందు ప్రశ్నపత్రం బుక్లెట్ నంబరు ఓఎంఆర్ షీట్లో నమోదు చేసి, సర్కిళ్లను జాగ్రత్తగా బబుల్ చేయాలి. జవాబుపత్రంలో పేర్కొన్నచోట అభ్యర్థి, ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. జవాబులు గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పెన్ను ఉపయోగించాలి.
* పరీక్ష పూర్తయిన తరువాత జవాబు పత్రాలను స్కానింగ్ చేసి, అభ్యర్థుల డిజిటల్ కాపీలు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ప్రశ్నపత్రంలో ఇంగ్లిష్ పదాలు, వ్యాక్యాల అర్థం తెలుగులో సరిగా అనువాదం కాకుంటే ఇంగ్లిష్ వర్షన్ కాపీని పరిగణనలోకి తీసుకుంటారు.
* సమాధానాలు గుర్తించేందుకు, పొరపాట్లు జరగకుండా ప్రాక్టీస్ చేసేందుకు నమూనా ఓఎంఆర్ పత్రాన్ని కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఓఎంఆర్లో వివరాలు సరిగా బబుల్ చేయకుంటే ఆ జవాబు పత్రాన్ని తిరస్కరిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.
* హాల్టికెట్తో పాటు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు) ఒరిజినల్ తీసుకురావాలి.
* పరీక్ష కేంద్రం ఎక్కడుందో ఒకరోజు ముందుగా చూసుకోవాలి. పరీక్షకేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రం గేట్లు పది గంటలకు మూసివేస్తారు. ఆ తరువాత కేంద్రంలోకి ఎవరినీ అనుమతించబోరు.
* అభ్యర్థుల బయోమెట్రిక్ను ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రంలో ఉదయం 9.30 నుంచి ప్రారంభిస్తారు. బయోమెట్రిక్ పూర్తయ్యేవరకు అభ్యర్థులెవరూ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదు.
* బయోమెట్రిక్లో ఫింగర్ప్రింట్ తీసుకునేందుకు వీలుకాకుంటే.. అభ్యర్థి ఫొటోను తీసుకుని, ఇంక్ప్యాడ్ ద్వారా వేలిముద్రను బయోమెట్రిక్గా తీసుకుంటారు.
* అభ్యర్థులు చేతులపై గోరింటాకు, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దు.
ఇక టీజీపీఎస్సీ..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంక్షిప్త పేరు టీఎస్పీఎస్సీ నుంచి టీజీపీఎస్సీగా మారింది. పేరు మారుస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయకున్నా.. అభ్యర్థులకు సూచనలిస్తూ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ జారీ చేసిన వెబ్ నోట్లో టీజీపీఎస్సీగా పేర్కొనడం గమనార్హం
మరింత సమాచారం... మీ కోసం!
‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!
‣ టెక్స్టైల్ కమిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ కొలువులు!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.