ఈనాడు, అమరావతి: కరోనా నేపథ్యంలో ఇంటర్ ప్రయోగ పరీక్షల కేంద్రాలను పెంచినట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. గతేడాది 905 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఈసారి వీటిని 947కు పెంచినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 3,58,474 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. హాల్ టికెట్లను కేవలం వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. కరోనా పాజిటివ్ విద్యార్థులకు ఈ షెడ్యూల్లోనే ఏదో ఒక రోజు అవకాశం కల్పిస్తారు. విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే అవసరాన్ని అనుసరించి గదికి 10మందిని మాత్రమే అనుమతిస్తారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలకు చెందిన వారిని ప్రైవేటు కళాశాలల్లో ముఖ్య పర్యవేక్షకులుగా నియమిస్తారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాలకు సంబంధించి ప్రతి రోజు ముఖ్య పర్యవేక్షకులకు ఓటీపీ నంబరు పంపిస్తారు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు ఎగ్జామినర్లు తమ సెల్ఫోన్లను ముఖ్య పర్యవేక్షకుల వద్ద ఉంచాల్సి ఉంటుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.