‣ మొదటి రోజు పరీక్షలో మధ్యస్థంగా ప్రశ్నపత్రాలు
‣ గణితం కొంచెం.. ఆప్టిట్యూడ్ ఇంకొంచెం సులువు!
ఈనాడు, అమరావతి: దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 23న జరిగిన జేఈఈ మెయిన్ పేపర్-2కు దాదాపు 60 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్ఐటీల్లో బీఆర్క్/బీప్లానింగ్ సీట్లలో ప్రవేశానికి 63,065 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 8 - 10 వేల మంది హాజరై ఉండొచ్చని భావిస్తున్నారు. బీటెక్ సీట్లలో ప్రవేశానికి నిర్వహించే పేపర్ - 1 ఆన్లైన్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి 3 రోజులపాటు జరగనున్నాయి.
మధ్యస్థంగా ప్రశ్నపత్రాలు
జేఈఈ మెయిన్ బీఆర్క్, బీప్లానింగ్ ప్రశ్నపత్రాలు మధ్యస్థంగా ఉన్నాయి. ర్యాంకులను నిర్ణయించే గణితంలో సాధారణ విద్యార్థులూ 20 సమాధానాలు రాసేలా ప్రశ్నలు ఉన్నాయి. సెక్షన్-బీలో 10 ప్రశ్నలు ఇచ్చి, అయిదింటికి సమాధానం రాసేలా ఛాయిస్ ఇచ్చారు. గణితం మధ్యస్థంగా ఉందని, ఆప్టిట్యూడ్ విభాగంలో కొంచెం కష్టపడే విద్యార్థులూ అత్యధికంగా మార్కులు సాధించే వీలుందని శారద, శ్రీచైతన్య విద్యా సంస్థల గణిత నిపుణులు విఘ్నేశ్వరరావు, వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. డ్రాయింగ్, ఆప్టిట్యూడ్లో ప్రశ్నలు కొంచెం తేలికగా ఉన్నాయని వెల్లడించారు. బీఆర్క్లో 82, బీప్లానింగ్లో 105 ప్రశ్నలు ఇచ్చి, ఛాయిస్ ఇచ్చారు. బీటెక్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి.
గణితంలో కొన్నింటికి ఎక్కువ సమయం
‣ జేఈఈ మెయిన్ బీఆర్క్ ప్రశ్నపత్రంలోని గణిత విభాగంలో కొన్ని ప్రశ్నలు సమయం ఎక్కువ తీసుకున్నాయి. ఆన్లైన్ తరగతులకు హాజరు కావడంతో పరీక్ష రాయడానికి ఉపయోగపడింది. జేఈఈ మెయిన్ రాసేందుకు నాలుగు సార్లు అవకాశం ఉందనే ధైర్యంతో అన్ని ప్రశ్నలకు సమాధానం రాశాను. ఆప్టిట్యూడ్, డ్రాయింగ్లో ప్రశ్నలు కొంత తేలికగా ఉన్నాయి’.
-కె.శాన్వి, విజయవాడ
అప్టిట్యూడ్ తేలిక
‣ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు తేలికగా ఉన్నాయి. డ్రాయింగ్లో వంద మార్కులకు ఇచ్చిన రెండు ప్రశ్నలు సులువుగా ఉన్నాయి. లెక్కల్లో ఇచ్చిన 30 ప్రశ్నల్లో 14 కొంచెం కష్టంగా ఉన్నాయి. పరీక్ష బాగా రాశాను.’
- గణేష్ వీర్, విజయవాడ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.