ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పదోతరగతి విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ జిల్లాల్లో 535 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 33,450మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రశ్నపత్రం.. కొత్త విధానం.. మే 17 నుంచి పదోతరగతి పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈలోపు విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ఈసారి పరీక్షల్లోనూ మార్పులు తీసుకువచ్చింది. సిలబస్ను 70 శాతానికే కుదించి పరీక్ష పేపర్లను ఆరుకు కుదించింది. ఈ మేరకు ప్రశ్నపత్రాల్లో మార్పులుంటాయి. దీనికి తగ్గట్టుగా విద్యార్థుల్లో అవగాహన తీసుకువచ్చి పరీక్షలు సమర్థంగా రాసేందుకు వీలుగా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు పరీక్షల ప్రశ్నపత్రాల సరళిపై శిక్షణ ఇచ్చారు. మోడల్ పేపర్లు అన్ని పాఠశాలలకు పంపించారు. వీటిని విద్యార్థులకు అందించి సాధన చేయిస్తున్నారు. స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లేదా సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుల వద్ద నుంచి ప్రశ్నపత్రాలు తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించారు. ‘ప్రశ్నపత్రాలను ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు అందించి పరీక్షలకు సన్నద్ధమయ్యేలా కృషి చేయిస్తున్నట్లు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల విద్యాశాఖాధికారిణి ఐ.విజయకుమారి వివరించారు.
వాట్సాప్ గ్రూపుల ఏర్పాటు
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పదోతరగతి విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు ఉపాధ్యాయులతో వాట్సాప్ గ్రూపులను అధికారులు ఏర్పాటు చేయించారు. ప్రతి పాఠశాలలో ఇవి పనిచేస్తున్నాయి. వీటిద్వారా సందేహాలు నివృత్తి చేయడంతోపాటు అసైన్మెంట్లు, పాఠాలకు సంబంధించి సంక్షిప్త వీడియోలు పోస్టు చేస్తున్నారు. విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రాలకు సమాధానాలు రాసి వాట్సాప్ గ్రూపుల్లో పంపించే వెసులుబాటు కల్పించారు. ‘వారు సమాధానాలు రాసి ఆ పేపర్లను ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులు చూసి తప్పులుంటే సరిదిద్ది పంపిస్తున్నారని’ హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్.రోహిణి వివరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.