* ఏకలవ్య పాఠశాలల్లో అమలు
* కొత్తవాటి కోసం స్థలాల గుర్తింపు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లో కో-ఎడ్యుకేషన్ విద్య ప్రారంభం కానుంది. ఇప్పటివరకు బాలబాలికలకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలోని 23 ఏకలవ్య గురుకులాల్లో(ఈఎంఆర్ఎస్) ఈ పద్ధతి అమల్లోకి రానుంది. గత రెండేళ్లుగా రాష్ట్రానికి మంజూరైన 12 ఈఎంఆర్ఎస్ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఆరోతరగతి నుంచి కో-ఎడ్యుకేషన్ విద్య అమల్లోకి వచ్చింది. 2021-22 నుంచి అన్ని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి మొదలుపెట్టి, ఏటా తరగతిని అప్గ్రేడ్ చేస్తూ కో-ఎడ్యుకేషన్ ప్రారంభించాలంటూ ఏకలవ్య గురుకులాల సొసైటీ ఆదేశాలు జారీ చేసింది.
సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు
రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్ గురుకులాలు సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు పొందాయి. వీటిని నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మాదిరిగా తీర్చిదిద్దాలని వాటికి కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసింది. కొత్తగా మంజూరైన గురుకులాల్లో వెంటనే కో-ఎడ్యుకేషన్ విద్యనుప్రారంభించాలంది. సీబీఎస్ఈ సిలబస్ కావడంతో అవసరమైన ఎన్సీఈఆర్టీ పుస్తకాలను సమీకరించింది. రాష్ట్రానికి మంజూరైన 23 గురుకులాల్లో ఏడింటికి కేంద్ర ప్రభుత్వ నిర్మాణ నిబంధనల మేరకు శాశ్వత భవనాలు, క్రీడామైదానాలు, ఇతర సదుపాయాలు పూర్తయ్యాయి. మిగతా 4 భవనాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. 2019, 2020లో మంజూరైన 12 ఈఎంఆర్ఎస్ పాఠశాలల్లో పదింటికి మాత్రమే స్థలాల గుర్తింపు పూర్తయింది. వీటిలోనూ రెండు మొదలయ్యాయి. ప్రస్తుతానికి తరగతులు ప్రారంభించేందుకు అందుబాటులోని ఇతర భవనాలు, పాఠశాలలు గుర్తించి సదుపాయాలు కల్పించారు. ఈఎంఆర్ఎస్ భవన నిర్మాణాన్ని వేగంగా చేపట్టేందుకు బడ్జెట్ను రూ.20 కోట్ల నుంచి రూ.38 కోట్లకు కేంద్రం పెంచింది. పాఠశాలల నిర్వహణకు సొసైటీ ద్వారా నేరుగా ఆయా ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. పాఠశాలల్లో శాశ్వత నియామకాలు చేపట్టేవరకు తాత్కాలిక పద్ధతిన బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలంది. ఇందులో రిజర్వేషన్లు అమలు చేయాలంది. ఈ మేరకు తెలంగాణ ఈఎంఆర్ఎస్ సొసైటీ నియామక ప్రక్రియ ప్రారంభించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.