* బీఎస్సీ డేటా సైన్స్, బీకాం ఎనలిటిక్స్కు నామమాత్రపు స్పందన
* విద్యార్థుల్లో అవగాహన కల్పించకపోవడమే కారణం
* వచ్చే విద్యాసంవత్సరంపై ఆశలు
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2020-21)లో డిగ్రీలో నాలుగు కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చినా విద్యార్థులు వాటిల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదు. ఉద్యోగాలపరంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న బీకాం బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీ డేటా సైన్స్లోనూ నామమాత్రంగా చేరడం గమనార్హం. అందులో డేటా సైన్స్లో దాదాపు 42 శాతం సీట్లు భర్తీకాగా బిజినెస్ అనలిటిక్స్లో 25 శాతం కూడా సీట్లు భర్తీ కాలేదు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవ తీసుకొని ఈసారి బీఎస్సీలో గణితం, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ సబ్జెక్టులతో కూడిన కోర్సుతోపాటు బీకాం (బిజినెస్ అనలిటిక్స్), బీకాం(ఫారిన్ ట్రేడ్), బీకాం (టాక్సేషన్) అనే కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటికి డిమాండ్ ఉండటంతో పెద్ద ఎత్తున కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. బిజినెస్ అనలిటిక్స్ను 126, డేటా సైన్స్ కోర్సును 128 కళాశాలల్లో ప్రవేశపెట్టారు.
ఎందుకు చేరలేదంటే..
ముఖ్యంగా కొత్త కోర్సుల గురించి విద్యార్థుల్లో అవగాహన లేదు. ఆ దిశగా విశ్వవిద్యాలయాలు గానీ, ఉన్నత విద్యామండలిగానీ చొరవ తీసుకోలేదు. ఈసారి కళాశాలల తనిఖీ లేకుండానే అనుమతి ఇవ్వడంతో కొత్త సబ్జెక్టులను బోధించే అధ్యాపకులు ఉంటారో? ఉండరో? అన్న సందిగ్ధత విద్యార్థుల్లో తలెత్తింది. కనీసం తాము ఆ కోర్సుల గురించి ప్రచారం చేద్దామన్నా కరోనా నేపథ్యంలో వీలులేకుండా పోయిందని హైదరాబాద్లో కళాశాల యజమాని ఒకరు తెలిపారు. కాకపోతే వచ్చే ఏడాది నుంచి మరింత మంది చేరే అవకాశం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- ఈనాడు, హైదరాబాద్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.