* 50% అమలు చేయాలి
* ఉద్యోగ కల్పన కేంద్రాలుగా పాలిటెక్నిక్లు
ఈనాడు, అమరావతి: ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 50 శాతం కన్వీనర్ కోటాను అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మొత్తం సీట్లలో కన్వీనర్, యాజమాన్య కోటా 50 శాతం చొప్పున ఉండాలని సూచించారు. కన్వీనర్ కోటాలో పేద పిల్లలకు సీట్లు వస్తాయని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం బోధన రుసుములు చెల్లిస్తుందని వెల్లడించారు. ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో నవంబరు 2 న జరిగిన సమీక్షలో సీఎం మాట్లాడారు. ‘‘ప్రైవేటు విశ్వవిద్యాలయాల అనుమతులు, పర్యవేక్షణ పటిష్ఠంగా ఉండాలి. మెరుగైన మౌలిక సదుపాయాలు, బోధన ఉంటుందనేఉద్దేశంతోనే ప్రైవేటు సంస్థలకు విద్యార్థులు వెళ్తారు. సదుపాయాలు, మెరుగైన ప్రమాణాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలన చేయాలి. ప్రైవేటు కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు, సిబ్బంది లేకపోతే చర్యలు తీసుకోవాలి...’’ అని సీఎం జగన్ ఆదేశించారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో కొత్త కోర్సులు తీసుకురావాలి. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి. ఇంజినీరింగ్ కోర్సులతో పాటు పశుసంవర్థక, వ్యవసాయ కోర్సులను అవసరాలకు అనుగుణంగా మిళితం చేయాలి. ఉద్యోగాల కల్పన కేంద్రాలుగా పాలిటెక్నిక్ కళాశాలలను తీర్చిదిద్దాలి. ప్రపంచంలో వస్తున్న కొత్త కోర్సులను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేసి, కళాశాలల్లో ప్రవేశపెట్టాలి.
నైపుణ్యాల మెరుగుకు ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో నైపుణ్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నాం. పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల ప్రతిభకు వాటిల్లో మరింత మెరుగులు పెడతారు.
విద్యార్థులపై ఒత్తిడి వద్దు..
కరోనా కారణంగా వృథా అయిన కాలాన్ని కవర్ చేసే ఉద్దేశంతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దు. విద్య అనేది వికాసానికి దారి తీయాలే తప్ప ఒత్తిడితో సతమతమయ్యే పరిస్థితి వద్దు. కేంద్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) మార్గదర్శకాలకు పరిశీలించి, నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
నైపుణ్య సామర్థ్య పెంపు సముదాయాల ఏర్పాటు
ఉపాధ్యాయులు నుంచి సచివాలయ ఉద్యోగుల వరకు అందరిలో నైపుణ్యాలను పెంచేందుకు ప్రతి లోక్సభ నియోజకవర్గంలోనూ సామర్థ్య పెంపు సముదాయాలను తీసుకురావాలి. శిక్షణ కేంద్రాలుగా ఇవి ఉపయోగపడతాయి. జిల్లాల్లో మంచి సదుపాయాలున్న కళాశాలలు, ప్రభుత్వ శిక్షణ కేంద్రాలను సామర్థ్య పెంపు సముదాయాల ఏర్పాటుకు వినియోగించుకోవాలి. ఇందుకు ఐఐటీల సహకారం తీసుకోవాలి. ఐఐటీ, ఐసర్, తిరుపతి, ఐఐఎం, విశాఖపట్నం, నిట్, తాడేపల్లిగూడెం సంస్థలకు వెళ్లే రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్తు కనెక్షన్లు వంటి వాటిలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలి. కేంద్రీయ విశ్వవిద్యాలయం, అనంతపురం పనులు వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలి. గిరిజన వర్సిటీపైనా దృష్టి సారించాలి...’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఉన్నత విద్యలో ఇప్పటి వరకు 5 లక్షల ఆన్లైన్ తరగతులు నిర్వహించామని అధికారులు ఆయనకు వివరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.