* బోధన రుసుముల ఉత్తర్వుల్లో తీవ్ర జాప్యం
* ప్రవేశాలకు విడుదల కాని ప్రకటన
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలకు ఈ ఏడాది మొదటిసారిగా ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ బోధన రుసుములను నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో డిగ్రీ ప్రవేశాల ప్రకటనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. డిసెంబరు 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినా ఇంతవరకు ప్రవేశాలే పూర్తి కాలేదు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం విద్యార్థులు కొన్ని నెలలుగా నిరీక్షిస్తున్నారు.
మొదటిసారి ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు..
ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా చేపడుతున్నారు. విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు, బోధన రుసుముల నిర్ణయం, ఆన్లైన్ ద్వారా ప్రవేశాలకు నమోదు చేసుకున్న కళాశాలలకు అనుమతివ్వాలనే నిబంధనను ఉన్నత విద్యామండలి తీసుకొచ్చింది. కానీ, కొన్ని మైనారిటీ, స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలు ఆన్లైన్ ప్రవేశాల కోసం రిజిస్టర్ చేసుకోలేదు. కొన్ని స్వయం ప్రతిపత్తి కళాశాలలు ముందుగానే ప్రవేశాలు నిర్వహించుకున్నాయి. మరికొన్ని కళాశాలలు బోధన రుసుముల నిర్ణయం కోసం ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్కు వివరాలు సమర్పించలేదు. ముందుగా నిర్వహించిన ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఆమోదం తెలుపుతుందా? లేదా? అనే దానిపైనా స్పష్టత లేదు. రాష్ట్రంలోని 1,080 ప్రైవేటు, 121 ఎయిడెడ్, 151 ప్రభుత్వ కళాశాలల్లో దాదాపు 5 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.