ఈనాడు, హైదరాబాద్: ఎంటెక్, బీటెక్ కోర్సులకే పరిమితమైన రోబోటిక్స్ ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సుల్లో కూడా రానుంది. అంతేకాకుండా బిజినెస్ అండ్ కామర్స్ విభాగంలో ఇప్పటికే ఉన్న నాలుగు కోర్సుల్లో సీఏ పాఠ్య ప్రణాళికను చేర్చనున్నారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సులను కాలానుగుణంగా మార్చి.. మరింత ఉద్యోగావకాశాలను కల్పించేవిగా మార్చాలని భావిస్తున్న ఇంటర్బోర్డు వాటి పాఠ్య ప్రణాళికలో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం ఇంటర్ ఒకేషనల్ విద్యలోని 6 విభాగాల కింద 22 కోర్సులను అందిస్తున్నారు. వాటిల్లో మొత్తం 95 వేల మంది చదువుతున్నారు. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆరు కోర్సులు అందిస్తున్నారు. వాటిలోని మెకానికల్ టెక్నీషియన్(ఎంటీ) కోర్సులో ఇండస్ట్రియల్ రోబోటిక్స్ పేరిట సిలబస్ను కలుపుతున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒక్కో పేపర్ చొప్పున దానిపై పాఠ్యప్రణాళిక ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు.
* కామర్స్ కోర్సుల్లో సీఏ సిలబస్
కామర్స్ విభాగంపై దృష్టి సారించిన ఇంటర్ బోర్డు కమిషనర్ జలీల్ కొద్ది నెలల క్రితమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) హైదరాబాద్ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థ సహకారంతో సీఏ ఫౌండేషన్లోని సిలబస్ను బిజినెస్ అండ్ కామర్స్ విభాగంలోని రిటైల్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్ కోర్సుల్లో సీఏ సిలబస్ను చేరుస్తున్నారు. ప్రతి కోర్సులో ప్రథమ ఏడాదిలో ఒక పేపర్, ద్వితీయ సంవత్సరంలో మరో పేపర్గా సీఏ సిలబస్ ఉంటుంది. ఇంటర్బోర్డు ఆమోదం పొందకపోవడం, అధ్యాపకులకు శిక్షణ ఇవ్వకపోవడంతో ఈ ఏడాది అమలు కష్టమని.. వచ్చే విద్యా సంవత్సరం (2021-22) అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. ఇంటర్ ఒకేషనల్ పలు కోర్సులు చేసినవారు బ్రిడ్జి కోర్సు పూర్తి చేయకుండా బీఎస్సీలో చేరే పరిస్థితి లేకపోవడంతో సమస్యను గుర్తించిన అధికారులు బ్రిడ్జి కోర్సుకు మినహాయింపు ఇచ్చారు. ఫిషరీస్, ఫారెస్ట్రీ, డెయిరీ టెక్నాలజీ లాంటి కోర్సులు ఒకట్రెండు కళాశాలల్లో ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్యను పెంచారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.