• facebook
  • whatsapp
  • telegram

అంచెలంచెలుగా త‌ర‌గ‌తులు ప్రారంభం

విద్యాసంస్థ‌ల పునఃప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
సిల‌బ‌స్ త‌గ్గింపుపై త్వ‌ర‌లో నిర్ణ‌యం

హైదరాబాద్‌: తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలల విద్యా సంవత్సరాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వివిధ తరగతుల్లో సిలబస్ తగ్గింపుపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు. తరగతులు ప్రారంభించేందుకు ప్రైవేటు విద్యా సంస్థలు సిద్ధం కావాలని.. ఈ విషయంలో తల్లిదండ్రులు సహకరించాలని మంత్రి కోరారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో మంత్రి సమావేశమై పలు సూచనలు చేశారు. పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతినిధులతో చర్చించారు. చర్చలో భాగంగా 14 డిమాండ్లను పరిష్కరించాలని పాఠశాలల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంచెలంచెలుగా అన్ని తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు ఏడాదిగా ఫీజులు లేనందున పాఠశాలలు నిర్వహణ కష్టతరంగా మారిందని యాజమాన్యాలు మంత్రికి తెలిపాయి. జూన్ వరకు విద్యా సంవత్సరం నిర్వహించాలని.. కనీస హాజరు ఉండేలా నిబంధన పెట్టాలని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేయాలి. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల ప్రతినిధులతో చర్చించాం. కొవిడ్‌పై అవగాహన కల్పిస్తూనే విద్యార్థుల ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతినిధులను కోరాం. వారంతా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. పాఠశాలలకు సంబంధించి పలు సమస్యలను ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరఫున సాధ్యమైనంతవరకు వారి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు వెళ్లని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు వినేలా ఏర్పాట్లు చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించాం’’ అని మంత్రి తెలిపారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.