ఎన్ఐఆర్ఎఫ్ తాజా సర్వేలో దేశంలో వైద్యవిద్యలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) శిఖర స్థానంలో నిలిచింది. ఇక్కడ విద్య అభ్యసించిన వైద్యులకు విశేష ఆదరణ లభిస్తోంది. అందువల్ల టాప్ ర్యాంకర్లంతా ఎయిమ్స్, న్యూదిల్లీలో చేరడానికే తొలి ప్రాధాన్యమిస్తున్నారు.
మెడికల్ విభాగంలో 2018 నుంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులను ప్రకటిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా అంటే.. 2018, 2019, 2020, 2021, 2022ల్లో వరుసగా ఐదుసార్లు ఎయిమ్స్ మొదటి స్థానంలో నిలిచింది. బోధన, అభ్యసన ప్రమాణాలు, వనరులు, వృత్తి సాధన, కోర్సు పూర్తిచేసుకున్న గ్రాడ్యుయేట్లు, సంస్థ వ్యాప్తి, వివిధ అనుబంధ విభాగాలతో సమన్వయం, నిపుణుల దృక్పథం..మొదలైన అంశాలను ప్రామాణికంగా తీసుకుని తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు.
ఇవీ కోర్సులు
ఎంబీబీఎస్: ఇంటర్ బైపీసీ విద్యార్థులు అర్హులు. నీట్ యూజీతో ప్రవేశం లభిస్తుంది.
ఎండీ, ఎంఎస్: సూపర్ స్పెషాలిటీలో డీఎం, ఎంసీహెచ్ కోర్సులను పలు స్పెషలైజేషన్లతో ఈ సంస్థ అందిస్తోంది. ఐఎన్ఐసెట్లో చూపిన ప్రతిభతో వీటిలో చేరవచ్చు.
ఇవే కాకుండా ఈ సంస్థ బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ (రేడియోగ్రఫీ), బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ, ఎమ్మెస్సీ నర్సింగ్, ఎండీఎస్, ఎమ్మెస్సీ కోర్సులను అందిస్తోంది. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశాలుంటాయి.
ఈ సంస్థకు న్యూదిల్లీతోపాటు భోపాల్, భువనేశ్వర్, జోధ్పూర్, పట్నా, రాయ్పూర్, రుషికేశ్, రాయ్బరేలీ, మంగళగిరి, నాగ్పూర్, గోరఖ్పూర్, భటిండా, బీబీనగర్, కల్యాణి, దియోఘర్ల్లో క్యాంపస్లు ఉన్నాయి. వీటిలో పలు చోట్ల ఎంబీబీఎస్, పారా మెడికల్ కోర్సులు అందిస్తున్నారు. ఎంబీబీఎస్లో ప్రవేశం నీట్తో, పారా కోర్సుల్లో ఎయిమ్స్ న్యూదిల్లీ నిర్వహించే పరీక్షతో అవకాశం ఉంటుంది.
టాప్ టెన్ సంస్థలు:
1. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), న్యూదిల్లీ
2. పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్), చండీగఢ్
3. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ), వెల్లూరు
4. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్), బెంగళూరు
5. బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ), వారణాసి
6. జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్మర్), పుదుచ్చెరి
7. సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీఐఎంఎస్), లఖ్నవూ
8. అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్
9. శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం
10. కస్తూర్బా మెడికల్ కాలేజ, మణిపాల్
దేశవ్యాప్తంగా 50 సంస్థలకే మెడికల్ ర్యాంకులు కేటాయించారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏ సంస్థకూ చోటు దక్కలేదు. ఉస్మానియా, ఆంధ్రా మెడికల్ కాలేజ్...తదితర సంస్థలు ఇందులో పాల్గొనలేదు. అందువల్ల వాటికి ర్యాంకులు కేటాయించలేదు. పలు ప్రైవేటు కళాశాలలు తమ వివరాలు పంపినప్పటికీ వాటికి అవకాశం దక్కలేదు.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ దేశ రక్షణలో మీరూ భాగమవుతారా?
‣ ఎంసెట్లో టాప్ర్యాంక్ ఎలా సాధ్యమైంది?