* తెలుగు విద్యార్థులకు టాప్ టెన్లో 4 ర్యాంకులు
* సందేశ్కు 3.. కుశాల్కుమార్కు 5.. తేజేశ్వర్, సుహాస్లకు 8, 10 ర్యాంకులు
ఈనాడు- హైదరాబాద్, అమరావతి; ఈనాడు యంత్రాంగం: అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. తొలి 10లో నాలుగింటిని సొంతం చేసుకున్నారు. మే 26న జరిగిన అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను ఐఐటీ మద్రాస్ జూన్ 9న విడుదల చేసింది. ఇందులో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భోగలపల్లి సందేశ్ 360 మార్కులకు 338 సాధించి మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. అనంతపురానికి చెందిన పుట్టి కుశాల్కుమార్ 334 మార్కులతో అయిదో ర్యాంకు, విజయవాడలో చదువుతున్న కర్నూలు జిల్లా విద్యార్థి కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన సిద్విక్ సుహాస్ 329 మార్కులతో 10వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. వీరిలో భోగలపల్లి సందేశ్, పుట్టి కుశాల్కుమార్, సిద్విక్ సుహాస్లు గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్లోనే చదువుతున్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
కౌన్సెలింగ్కు 48,248 మంది
ఈసారి జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులైన 2.50 లక్షల మందిలో 1,80,200 మంది అడ్వాన్స్డ్ పరీక్ష రాశారు. రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కుల ఆధారంగా జోసా కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు 48,248 మందికి అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. వారిలో 40,284 మంది అబ్బాయిలు, 7,964 మంది అమ్మాయిలున్నారు. గత ఏడాది మొత్తం 43,773 మంది అర్హత సాధించారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంయుక్తంగా నిర్వహించే జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలవుతుంది. మొత్తం అయిదు విడతల కౌన్సెలింగ్ ద్వారా బీటెక్ సీట్లు భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలు పొందొచ్చు.
కటాఫ్ మార్కులు పైపైకి...
ఈసారి కటాఫ్ మార్కులు భారీగా పెరిగాయి. 2021లో జనరల్ కేటగిరీలో (360 మార్కులకు) 63, 2022లో 55, 2023లో 86 కటాఫ్ మార్కులుగా ఉన్నాయి. ఈసారి కటాఫ్ మార్కులు 109కి పెరిగాయి. 2017లో 366 మార్కులకు 128ని కటాఫ్గా నిర్ణయించారు. ఆ తర్వాత అత్యధిక కటాఫ్ ఈసారే. ప్రస్తుతం ఓబీసీలకు 98, ఈడబ్ల్యూఎస్కు 98, ఎస్సీ, ఎస్టీలకు 54 మార్కులను కటాఫ్గా నిర్దేశించారు. ఆ మార్కులు సాధించిన వారు మాత్రమే జోసా కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు పొందేందుకు పోటీపడాల్సి ఉంటుంది. ‘‘తుది కీలో పేపర్-1, 2లో ఒక్కో ప్రశ్నకు జవాబులు మార్చారు. పేపర్-2లో ఒక ప్రశ్నను తొలగించి అందరికీ మార్కులు కలిపారు’’ అని శ్రీచైతన్య ఐఐటీ జాతీయ డీన్ ఎం.ఉమాశంకర్ తెలిపారు. పేపర్-1 సులభంగా ఉండటంతో విద్యార్థులు మంచి స్కోర్ సాధించారని, దానివల్ల ఈసారి కటాఫ్ మార్కులు పెరిగాయని పేర్కొన్నారు. గతంలో 285 మార్కులకు 100లోపు ర్యాంకులు వచ్చాయని, ఈసారి 300పైన మార్కులు వచ్చిన వారికే అది సాధ్యమైందని చెప్పారు.
అర్హుల్లో 7-8 వేల మంది తెలుగు విద్యార్థులు
జేఈఈ అడ్వాన్స్డ్ మొదటి 100 ర్యాంకర్లలో 25 మంది ఐఐటీ మద్రాస్ జోన్ విద్యార్థులు ఉన్నారు. వారిలో 20 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉండటం ఖాయమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. 500ల ర్యాంకుల్లోపు 145 మంది మద్రాస్ జోన్ విద్యార్థులు ఉండగా.. వారిలో కనీసం 100 మంది ఏపీ, తెలంగాణ వారు ఉంటారని చెబుతున్నారు. మద్రాస్ జోన్లో కౌన్సెలింగ్కు అర్హత పొందిన మొత్తం 11,180 మందిలో తెలుగు రాష్ట్రాల వారు సుమారు 7 వేల నుంచి 8 వేల మంది వరకు ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఐటీల్లో ఏటా 18-20 శాతం మంది తెలుగు విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు.
బాంబే ఐఐటీలో ప్రవేశమే లక్ష్యం
బాంబే ఐఐటీలో కంప్యూటర్స్ సైన్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకు తగినట్టు రోజూ పది నుంచి 12 గంటలపాటు కష్టపడి చదివా. కర్నూలు జిల్లా ఆదోని మాది. హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుకున్నా. ప్రభుత్వ ఉపాధ్యాయులైన తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల పాఠాలతోనే మూడో ర్యాంకు సాధించగలిగా.
జేఈఈ అడ్వాన్సుడ్ ఓపెన్ కేటగిరిలో మూడో ర్యాంకర్ సందేశ్
మొదటినుంచి బేసిక్స్ నేర్చుకున్నా
పాఠశాల స్థాయిలోనే నేర్చుకున్న ఐఐటీ పరీక్షల బేసిక్స్, హైదరాబాద్లోని ప్రైవేటు కళాశాలలో ఇచ్చిన శిక్షణ మంచి ర్యాంకు సాధించడానికి సహకరించాయి. అనంతపురం ఆర్కేనగర్లో నివసిస్తున్నాం. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సీటు సాధించడమే లక్ష్యంగా ఉదయం ఆరున్నర నుంచి రాత్రి పదింటి వరకు చదువుకునేవాణ్ని.
ఓపెన్ కేటగిరిలో ఐదో ర్యాంకర్ కుశాల్కుమార్
సేవా కార్యక్రమాలు చేస్తా
కర్నూలు గణేశ్నగర్లో నివసిస్తున్నాం. మా అమ్మానాన్నలిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. కళాశాలలో అధ్యాపకులు నేర్పిన అంశాలపై బాగా చదువుకునేవాణ్ని. బాంబే ఐఐటీలో సీఎస్ఈ చేయాలన్నదే లక్ష్యం. సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తా.
8వ ర్యాంకర్ తేజేశ్వర్
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్
‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్
‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?