Asked By: ఎ. వీరభద్రం
Ans:
వైద్యవిద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్లు కావడం సాధ్యమే. 1980వ సంవత్సరంలోనే మన తెలుగువారైన డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ సివిల్స్ పోటీలో అఖిల భారత స్థాయి 4వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. 2021లో వరంగల్కి చెందిన డాక్టర్ శ్రీజ అఖిల భారత స్థాయిలో 20వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. ఎంబీబీస్ చదువుతూ యూపీఎస్సీ పరీక్ష రాయడం కుదరదు. యూపీఎస్సీ పరీక్ష రాయాలంటే ఏదైనా డిగ్రీ పూర్తవ్వాలి. కానీ, మీరు ఎంబీబీఎస్ చదువుతూనే, యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధంకండి. ప్రణాళికాబద్ధ్దమైన శిక్షణ, కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా కచ్చితంగా ఐఏఎస్ సాధించగలరు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ప్రశాంత్
Ans:
చాలామంది డిగ్రీ పూర్తయ్యాక ఉపాధికి ప్రయత్నాలు చేయడం, ఉన్నతవిద్యను అభ్యసించడంలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ దిశలో ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకోసం మాత్రమే ప్రయత్నిస్తే, మరికొంతమంది రాష్ట్ర ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్ధమవుతారు. చాలామంది రెండింటికీ తయారవుతారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఎక్కువ పోస్టులు అందుబాటులో ఉంటాయి. ఇక మీరు అడిగిన గ్రూప్ -2 తరహా నోటిఫికేషన్కు మీరు ఊహించేదానికంటే పోటీ ఎక్కువగానే ఉంటుంది. రాబోయే నోటిఫికేషన్ కోసం మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొలువుల కోసం కృషి చేయండి.
ఏదైనా ఒక ఉద్యోగం పొందిన తరువాత మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. గతంలో జరిగిన గ్రూప్-1, గ్రూప్-2 నియామకాల్లో చాలామంది ఏదో ఒక ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్ కోసం సన్నద్ధమై ఉద్యోగాలు పొందారు. సమయం వృథా కాకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డేటా విశ్లేషణ లాంటి అంశాలను అధ్యయనం చేసి వాటిపై పట్టు సాధించండి. ఆత్మవిశ్వాసం, నిరంతర కృషి, పట్టుదల, కఠోర శ్రమ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న మీ కల కచ్చితంగా నెరవేరుతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డేటా విశ్లేషణ లాంటి అంశాలను అధ్యయనం చేసి వాటిపై పట్టు సాధించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: Dasari
Ans:
There is no specific group that is useful for Civil Services examinations. Any degree holder can apply. Any degree to a limited extent is useful for those examinatins. If you are aiming at IAS, you need to get an comprehensive idea on examination pattern, syllabus etc. and accordingly preparation.
Asked By: nayudupalli
Ans:
పదేళ్ళ క్రితం పూర్తి చేసిన బీఎస్సీ, ఎంసీఏ విషయపరిజ్ఞానం ఎంతవరకు మీకు గుర్తుంది అనే అంశం, మీరు ఏరంగంలో స్థిరపడాలో నిర్ణయిస్తుంది. కొంతకాలం స్కూల్ టీచర్గా పనిచేశారన్నారు. కానీ ఏ సబ్జెక్టులు బోధించారో చెప్పలేదు. మీరు బీఎస్సీలో చదివిన మూడు సబ్జెక్టుల్లో మీకిష్టమైన సబ్జెక్టులో పీజీ చేసే ప్రయత్నం చేయవచ్చు. ఎంసీఏ కూడా చదివారు కాబట్టి, కంప్యూటర్ రంగంలో స్థిరపడాలనుకొంటే- అందుకు సంబంధించిన కోర్సులు నేర్చుకొనే ప్రయత్నం చేయండి. మీరు ఎంసీఏ చేసినప్పటికీ, ఇప్పటికీ సాఫ్ట్వేర్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లర్నింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లాంటి రంగాలకు చాలా డిమాండ్ ఉంది. ఆ రోజుల్లో సీ, సీ ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎంత ప్రాచుర్యంలో ఉండేవో, ఇప్పుడు జావా, ఆర్ ప్రోగ్రామింగ్, పైతాన్ లాంటి సాఫ్ట్వేర్లు కూడా అంతే ప్రాచుర్యంలో ఉన్నాయి. మీరు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్లాలనుకొంటే కనీసం ఒక సంవత్సరం పాటు వివిధ కంప్యూటర్ కోర్సులు నేర్చుకోండి. ఒకవేళ మీరు మేనేజ్మెంట్్/ అడ్మినిస్టేషన్ ఉద్యోగాలు చేసివుంటే ఎంబీఏ చేయవచ్చు. బోధనరంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేసి మళ్ళీ స్కూల్ టీచర్గా కెరియర్ కొనసాగించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: nayudupalli
Ans:
డిగ్రీ తరువాత, బీఎస్సీలో మీరు ప్రస్తుతం చదువుతున్న బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ చేసే అవకాశం ఉంది. కొన్ని యూనివర్సిటీలు బీఎస్సీ బీజడ్సీ అర్హతతో బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రో బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఇమ్యునాలజీ లాంటి సబ్జెక్టుల్లో పీజీ చేయటానికి అనుమతిస్తున్నాయి. పీజీ తరువాత నెట్/ సెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే డిగ్రీ కళాశాలల్లో బోధనావకాశాలు ఉంటాయి. మీరు పీజీలో చదివిన సబ్జెక్టులో పీహెచ్డీ కూడా చేయొచ్చు. పీహెచ్డీ చేసిన తరువాత బోధనా రంగంపై ఆసక్తి ఉంటే విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం, పరిశోధన రంగంపై ఆసక్తి ఉంటే కేంద్ర/ రాష్ట్ర/ ప్రైవేటు పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.
బీఎస్సీ పూర్తి చేశాక ప్రైవేటు ఫార్మా, బయోటెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయవచ్చు. బీఎస్సీ బీజడ్సీ తరువాత ఆసక్తి ఉంటే మెడికల్ రెప్రజెంటేటివ్ ఉద్యోగం ఎంచుకునే వీలుంది. పోటీపరీక్షలు రాయాలనే ఆసక్తి ఉంటే డిగ్రీ అర్హత ఉన్న అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలువుల కోసం సన్నద్ధం కావొచ్చు. బోధనరంగంపై ఆసక్తి ఉంటే బీఎస్సీ అయిన వెంటనే బీఈడీ కూడా చేయవచ్చు. డిగ్రీ తరువాత బీఈడీ చేసి పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా, పీజీ తరువాత బీఈడీ చేసి కేంద్రీయ పాఠశాలల్లో పీజీ టీచర్గా స్థిరపడవచ్చు. మీరు డిగ్రీలో చదివిన ఇంగ్లిష్, తెలుగు/ హిందీల్లో పీజీ చేయవచ్చు. డిగ్రీ తరువాత మూడు సంవత్సరాల ఎల్ఎల్బీ కోర్సులో, జర్నలిజంలో పీజీలో, ఎంబీఏలో కూడా చేరవచ్చు. కొన్ని యూనివర్సిటీల్లో బీఎస్సీ విద్యార్హతతో ఆంత్రొపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ, హిస్టరీ లాంటి సబ్జెక్టుల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎ. బుచ్చయ్య
Ans:
ఎంఏ ఇంగ్లిష్ కోర్సుకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ పీజీతో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఆంగ్లం బోధించవచ్చు. ఎంఏ ఇంగ్లిష్ తరువాత నెట్/ సెట్ పరీక్షలో ఉత్తీర్ణులయితే డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. ఈ భాషలో పీహెచ్డీ చేసి విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం పొందవచ్చు. ఎంఏ ఇంగ్లిష్తో పాటు బీఈడీ చేసి పాఠశాలల్లో ఇంగ్లిష్ టీచర్ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. ప్రైవేటు రంగంలో కంటెంట్ రైటర్లుగా, స్పోకెన్ ఇంగ్లిష్ సంస్థల్లో ఇన్స్ట్రక్టర్గా, అనువాదకునిగా, ఎడిటర్గా, కాపీ రైటర్గా, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా, టెక్నికల్ రైటర్గా విభిన్న ఉద్యోగావకాశాలు ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: nayudupalli
Ans:
చాలామంది తల్లిదండ్రులు, విద్యార్ధులు ఆంగ్ల భాషలో విద్యాభ్యాసం గురించి ఆలోచిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగు సాహిత్యం చదవాలనుకొంటున్న మీ అభిలాష అభినందనీయం. డిగ్రీలో తెలుగు లిటరేచర్ చదివాక తెలుగు పండిట్ శిక్షణ చేసినట్లయితే, పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందవచ్చు. తెలుగు భాషతో పాటు మరో భాషను నేర్చుకొంటే, అనువాదకులుగా స్థిరపడవచ్చు. డిగ్రీ తరువాత తెలుగులో పీజీ చేస్తే జూనియర్ కళాశాలల్లో తెలుగు అధ్యాపకులుగా చేరే అవకాశం ఉంది. పీజీలో తెలుగు చదివి, పీహెచ్డీ చేసినట్లయితే డిగ్రీ కళాశాలలు/ విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులుగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీరు బీఏ తెలుగు తరువాత జర్నలిజం కోర్సు చేసి టీవీ, రేడియో, పత్రికా రంగాల్లో పనిచేసే అవకాశం పొందొచ్చు. కంప్యూటర్కు సంబంధించిన కోర్సులు నేర్చుకొని ఎడ్యుకేషన్ టెక్నాలజీ రంగంలోనూ ప్రవేశించవచ్చు. కంపారిటివ్ లిటరేచర్, ట్రాన్స్లేషన్ స్టడీస్, అప్లైడ్ లింగ్విస్టిక్స్ లాంటి సబ్జెక్టుల్లోనూ పీజీ చేయవచ్చు. ఇవి కాకుండా- తెలుగు లిటరేచర్లో డిగ్రీ తరువాత, డిగ్రీ అర్హతగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలన్నింటికి మీరు అర్హులే! - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Q: బీఎస్సీ (అగ్రికల్చర్) ఆనర్స్ తర్వాత దేశ విదేశాల్లో లభించే ఉన్నత విద్యావకాశాల గురించి తెలుపగలరు.
Asked By: యు. ప్రవీణ్ తేజ
Ans:
సాధారణంగా ఏజీ బీఎస్సీ చదివిన తరువాత ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే చాలామంది ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుతారు. మరికొంతమంది బయోటెక్నాలజీ. ప్లాంట్ సైన్సెస్, జెనెటిక్స్, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, అగ్రికల్చర్ కెమిస్ట్రీ, అగ్రికల్చరల్ ఎకనమిక్స్, అగ్రికల్చరల్ ఎక్స్ టెన్షన్, ఆగ్రోనమి, ఎంటెమాలజీ లాంటి సబ్జెక్టుల్లో పీజీ చేస్తారు. ఇటీవలికాలంలో చాలామంది బీఎస్సీ అగ్రికల్చర్ చదివాక ఎంబీఏలో అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు గురించీ ఆలోచిస్తున్నారు. ఇక విదేశాల్లో ఉన్నత విద్యావకాశాల విషయానికొస్తే- పైన పేర్కొన్న అన్ని కోర్సులతో పాటు, విభిన్న కోర్సులు చదివే అవకాశం ఉంది. ఉదాహరణకు- క్రాప్ సైన్సెస్, సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ టెక్నాలజీ, గార్డెన్ డిజైన్, సస్టెయినబుల్ అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫుడ్ సెక్యూరిటీ లాంటి వినూత్న కోర్సులతో పాటు మరెన్నో మల్టీ డిసిప్ల్లినరీ కోర్సులు కూడా పూర్తిచేసుకోవచ్చు. పీజీ తరువాత, పీహెచ్డీ కూడా చేసినట్లయితే, బోధన, పరిశోధన రంగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు పొందవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్