• facebook
  • whatsapp
  • telegram

పీఠం కోసం ట్రంప్‌ దాసోహం

* 18 ఏళ్ల యుద్ధ ఫలాలు తాలిబన్లకే సమర్పితం


ఒక అత్యాశాపరుడు అందలమెక్కితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహార శైలి చూస్తే సరిపోతుంది. ఓ వైపు నోబెల్‌ శాంతి బహుమతి పొందాలనే ఆశ- మరో వైపు అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నికవ్వాలనే లక్ష్యం. ఈ క్రమంలో ఆయన నిర్ణయాలు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఫలితంగా మధ్య ప్రాచ్యం, అఫ్గానిస్థాన్‌, వెనెజువెలా వంటి కీలక ప్రాంతాల్లో శాంతి కరవవుతోంది. అమెరికా ఎన్నికలకు మరో తొమ్మిది నెలలే ఉండటంతో నమ్మిన మిత్రులను నట్టేట ముంచేసి స్వలాభం చూసుకొనే పనిలో ట్రంప్‌ నిమగ్నమయ్యారు. లాభనష్టాలను లెక్కలేసుకుంటూ ట్రంపులోని వ్యాపార వేత్త విశ్వరూపం చూపిస్తున్నాడు. దానికి తాజా ఉదాహరణే అమెరికా- తాలిబన్‌ శాంతి ఒప్పందం. దోహాలో తాలిబన్ల తరఫున ముల్లా బరాదర్‌, అమెరికా పక్షాన ఆ దేశ ముఖ్య చర్చల ప్రతినిధి జల్మే ఖలీజాద్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. పాకిస్థాన్‌, టర్కీ, ఇండొనేసియా, చైనా తదితర దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. తాజా ఒప్పందంతో అమెరికా తాను సాగించిన అత్యంత దీర్ఘకాల యుద్ధభూమిలో ఉన్న తమ సైన్యాన్ని 14 నెలల్లో బయటకు తీసుకురావడానికి వీలవుతుంది. అంతేగాక తాలిబన్‌కు, అఫ్గాన్‌ ప్రభుత్వానికి మధ్య చర్చలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఈ చర్చలు విజయవంతమైతే 2014 డిసెంబరులో మొదలైన ఆపరేషన్‌ రిజల్యూట్‌ సపోర్టు నుంచీ అమెరికా బయటపడే అవకాశం ఉంది. వాస్తవానికి 2001లో మొదలుపెట్టిన ఆపరేషన్‌ ఎండ్యూరింగ్‌ ఫ్రీడమ్‌ 2014లో ముగిసినా తాలిబన్లతో ఘర్షణలు ఆగలేదు. కాకపోతే 2014 నుంచి అమెరికా సైన్యానికి బదులు అఫ్గాన్‌ సైన్యం తాలిబన్లతో తలపడుతోంది. వారికి అవసరమైన మద్దతును అమెరికా ఇస్తోంది. ఇప్పుడు చర్చలు సఫలమైతే మొత్తం 18 ఏళ్ల భీకర ఘర్షణకు తెరపడుతుంది. ఈ ఒప్పందంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఆచితూచి స్పందించారు. అఫ్గాన్‌ భూభాగం నుంచి అమెరికా, మిత్రదేశాలకు ఉగ్రవాదం ముప్పు తొలగిపోయినప్పుడే విజయం సాధించనట్లని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పాంపియో అనుకున్న విజయ తీరం కనుచూపు మేరలో కనిపించడంలేదు. మరోవైపు, చర్చల్లో తాలిబన్‌ ప్రతినిధిగా పాల్గొన్న షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానెక్జాయ్‌ మాత్రం ఇది విజయం సాధించిన రోజు అని నిస్సంకోచంగా ప్రకటించుకొన్నారు. తాలిబన్లు దీన్ని వ్యూహాత్మక ఒప్పందంగానే చెప్పుకొంటున్నారని గార్డియన్‌వంటి పత్రికలు చెబుతున్నాయి.

అమెరికా ఆరాటం
వీలైనంత తొందరగా అఫ్గాన్‌ నుంచి బయటపడాలనే అమెరికా ఆరాటం ఈ ఒప్పందంలోని ప్రతి అక్షరంలో కనిపిస్తోంది. 14 నెలల్లో దళాలను పూర్తిగా ఉపసంహరించడంలో భాగంగా తొలి 135 రోజుల్లో అయిదు స్థావరాలను పూర్తిగా ఖాళీ చేసి 8,600 మంది అమెరికా, అదే స్థాయిలో సంకీర్ణ సేనలను వాపస్‌ తీసుకోవాలి. మే 29 నాటికి ఐరాస ఆంక్షలను, ఆగస్టు 27 నాటికి అమెరికా ఆంక్షలను తొలగించేలా కార్యాచరణ మొదలుపెట్టడం వంటివి ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఒప్పందం తొలిభాగంలో అమెరికా చేయాల్సిన పనులను ప్రస్తావిస్తూ ప్రతిదానికి కచ్చితమైన తేదీలతో సహా కాలావధిని నిర్ణయించారు. రెండో భాగంలో తాలిబన్లు చేయాల్సిన పనికి ఏ కొలమానం కనిపించదు. అమెరికా, మిత్రదేశాలకు ముప్పు కలిగించే అల్‌ఖైదా వంటి గ్రూపులను తాలిబన్లు నిరోధించడం, ఆశ్రయం కల్పించకపోవడం వంటివి చేయాలట. తాలిబన్లు రాజ్యం వదలుకొని మరీ అల్‌ఖైదాకు మద్దతుగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ట్రంప్‌కి మాత్రమే ఉపయోగపడే అల్‌ఖైదాను వదులుకుంటారా? రెండో భాగం అయిదో పాయింట్‌లో ఒక ప్రమాదకర సంకేతం ఉంది. అమెరికా మిత్రదేశాలకు ముప్పు కలిగించేవారికి తాలిబన్లు వీసాలు, పాస్‌పోర్టులు, ట్రావెల్‌ పర్మిట్లు ఇవ్వకూడదని పేర్కొన్నారు. అంటే భవిష్యత్తులో అఫ్గాన్‌లో తాలిబన్‌ పాలన ఖాయమని పరోక్షంగా అమెరికా అంగీకరించినట్లే! తాలిబన్లు తమకు తాము ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌గా చెప్పుకొనే ప్రయత్నం చేయగా అమెరికా కిందా మీదా పడి అడ్డుకోవాల్సి వచ్చింది. ఒప్పందంలో షరతులు అమలు చేయకపోతే తాము మళ్లీ రంగంలోకి దిగుతామని అమెరికా చెప్పడం, ఒప్పందం అమలుకు 14నెలల గడువు నిర్ణయించడం ఊరట కలిగించే అంశాలు. ఈ లోపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిస్తే అమెరికా నాయకత్వం రాజకీయ ఒత్తిళ్ల నుంచి బయటపడి నిర్ణయాన్ని మార్చుకొనే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందంపై మాజీ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జాన్‌బోల్టన్‌ వంటి వారు ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కూడా శాంతి ఒప్పందానికి మరో అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. గత ఎన్నికల్లో అష్రఫ్‌ ఘనీ 50.64 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించినా, ఈ విజయాన్ని 39.52 శాతం ఓట్లు వచ్చిన ఆయన ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లా అంగీకరించలేదు. గత ఎన్నికల్లో ఇలాంటి సమస్యే వస్తే ఘనీని అధ్యక్షుడిగా, అబ్దుల్లాను చీఫ్‌ ఎగ్జిక్యుటివ్‌గా ఉండేందుకు అమెరికా ఒప్పించింది. కానీ, ఈసారి అమెరికా తాలిబన్లతో చర్చల్లో తలమునకలుగా ఉంది. తాలిబన్లతో చర్చలు ముగిసేవరకు రాజకీయాలు పక్కనపెట్టాలని అమెరికా, రష్యా వంటి దేశాలు వారికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఘనీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ శాంతి చర్చల విషయంలో రాజకీయ ఏకాభిప్రాయం రాకపోతే సమస్య మొదటికొచ్చే ప్రమాదం ఉంది.

భారత్‌కు పొంచి ఉన్న ముప్పు
భారత్‌ ఇంధన భద్రత, వాణిజ్యాలతోపాటు- అఫ్గాన్‌లో పెట్టుబడులకు రక్షణా ప్రమాదంలో పడింది. దీనికితోడు భద్రతాపరమైన సమస్యలు ముసురుకొనే ముప్పు పొంచి ఉంది. భారత్‌ మొదటి నుంచి అఫ్గాన్‌ ప్రజాప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటూ, తాలిబన్లకు దూరంగా ఉంది. రష్యాలోని మాస్కోలో తాలిబన్లకు, అఫ్గాన్‌ ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లోనూ భారత్‌ తమ మాజీ రాయబారులైన అమర్‌ సిన్హా, టీసీఏ రాఘవన్‌లను పంపింది. వాస్తవానికి ఈ చర్చల తర్వాతే అఫ్గాన్‌ శాంతి ప్రక్రియ ఊపందుకొంది. తాజాగా జరిగిన దోహా చర్చల్లో కేవలం పరిశీలకుడి హోదాలో భారత రాయబారి పి.కుమరన్‌ ఒప్పంద కార్యక్రమానికి హాజరయ్యారు. పాక్‌ మాత్రం తన పలుకుబడిని అమెరికా, తాలిబన్ల వద్ద బాగా పెంచుకొంది. పాక్‌ కోసం అమెరికా ఇప్పటికే ఏకంగా బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీపై నిషేధం విధించింది. ఈ శాంతి ఒప్పందానికి ముందే పాక్‌ను మంచి చేసుకొనేందుకు ఆ దేశ సైనికాధికారులకు అమెరికాలో శిక్షణను డిసెంబరులో ట్రంప్‌ సర్కారు పునరుద్ధరించింది. ఇవన్నీ భారత్‌కు వ్యూహాత్మకంగా ఇబ్బందికరమైన విషయాలు. ఈ ఒప్పందంపై మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాట్లాడుతూ అక్కడ ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందే. అక్కడ సాధించిన విజయాలను కోల్పోకుండా అమెరికా చూసుకోవాలి అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 2018లో ప్రారంభమైన తాపీ (తుర్క్‌మెనిస్థాన్‌ - అఫ్గానిస్థాన్‌ - పాకిస్థాన్‌ - ఇండియా) గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టులో మరిన్ని చిక్కులు రానున్నాయి. తుర్క్‌మెనిస్థాన్‌ నుంచి భారత్‌కు నిరంతరాయంగా గ్యాస్‌ అందించే ఈ ప్రాజెక్టులో చెల్లింపులు, భద్రతాపరమైన అంశాల్లో చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి 400 మిలియన్‌ డాలర్ల మేరకు అఫ్గాన్‌కు పంపిణీ ఫీజు కింద లభించవచ్చు. ప్రస్తుతం వచ్చే మార్గంలోని హెరాత్‌, కాందహార్‌ ప్రాంతాల్లో తాలిబన్ల పట్టు అధికంగా ఉంది. పాక్‌ పరోక్షంగా తన గుప్పిట్లో ఉన్న తాలిబన్లను రెచ్చగొట్టి ఈ ప్రాజెక్టులో భారత్‌ను ఇబ్బందులకు గురిచేసే ప్రమాదమూ పొంచి ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి నిధులు అందితే వాటిని తాలిబన్లు ఎలా వాడతారనేదీ ఆందోళనకర అంశం. మరోవైపు అఫ్గాన్‌లోని ఐఎస్‌ఐ ప్రేరేపిత మూకలు కశ్మీర్‌ సరిహద్దులకు చేరే ముప్పూ ఉంది. అమెరికా బలగాలు ఉంటేనే ప్రపంచంలో 90 శాతానికి పైగా నల్లమందు అఫ్గానిస్థాన్‌లో పండిస్తున్నారు. ఈ ఆదాయాన్ని రుచి చూసినవారు ఒప్పందం కోసం నల్లమందు సాగును వదులుకోవడం సందేహాస్పదమే. నార్కో ఉగ్రవాదానికి కోరలు వచ్చేకొద్దీ భారత్‌లో కశ్మీర్‌, పంజాబ్‌ ప్రాంతాల్లో సమస్యలు తప్పవు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆదాయ వనరుల్లో కీలక భాగం మత్తుమందుల విక్రయాలే. అఫ్గాన్‌లోని ప్రజా ప్రభుత్వంతో భారత్‌ సన్నిహితంగా ఉండటం పాక్‌ ప్రేరేపిత తాలిబన్లకు రుచించలేదు. పార్లమెంట్‌ భవనం, విద్యాలయాలు, డ్యామ్‌లు, రోడ్లు సహా ఇతర అవసరాలు తీర్చే 36 పైగా కీలక ప్రాజెక్టులను భారత్‌ పూర్తి చేసింది. ఇంకా చాలా ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. అందుకే భారత దౌత్యకార్యాలయాలు, ప్రాజెక్టులే లక్ష్యంగా పలు మార్లు దాడులు నిర్వహించింది. కీలక ప్రాజెక్టుల్లో పనిచేసే పలువురు భారతీయులు అపహరణలకు గురయ్యారు. ఈ లెక్కన అమెరికా సేనలు పూర్తిగా వైదొలగే వరకు తాలిబన్లు మౌనంగా ఉన్నా, ఆ తరవాత భారత్‌ వారి లక్ష్యంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఒప్పందంలో తాలిబన్లు అమలు చేసే అంశాలకు కొలమానాలు, మానవహక్కులు, మహిళల గౌరవం, సుపరిపాలన, ప్రజాస్వామ్యం వంటి పదాలు ఎక్కడా కనిపించవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అఫ్గాన్‌ ప్రజలను, ప్రజా ప్రభుత్వాన్ని, భాగస్వాముల భద్రతను గాలికొదిలేసి ట్రంప్‌ తన దారి తాను చూసుకున్నారు. అచ్చం సిరియాలో మాదిరే!

సంక్షోభానికి సంకేతం
ప్రజా ప్రభుత్వంలో రాజకీయ అస్థిరత తలెత్తడం, తాలిబన్లను కట్టడి చేసే అమెరికా చేతులెత్తేయడంతో మరోమారు సంక్షోభ మేఘాలు మెల్లగా కమ్ముకొనే అవకాశాలు ఉన్నాయి. 18 నెలల పాటు సంప్రతింపులు, నాటకీయ పరిణామాల అనంతరం కుదిరిన ఈ ఒప్పందం ద్వారా అమెరికా లేదా మిత్రపక్షాలు సాధించింది ఏమీలేదు. మార్చి పదో తేదీలోపు అఫ్గాన్‌ ప్రభుత్వ ఖైదులో ఉన్న అయిదు వేల మంది తాలిబన్లను విడుదల చేస్తే వెయ్యి మందికి తాలిబన్‌ చెర నుంచి విముక్తి కల్పించాలి. విడుదలైన తాలిబన్లు బుద్ధిగా ఒప్పందంలోని అంశాల అమలుకు సహకరించాలి. అఫ్గాన్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపి మరో మూడు నెలల్లో మిగిలిన తాలిబన్లను కూడా దశల వారీగా విడుదల చేయాలి. ఇరుపక్షాలు సంతకాలు చేసిన ఒప్పందంలో ఉన్న ఓ అంశం ఇది. విచిత్రం ఏమిటంటే- వారంతా అఫ్గాన్‌ ప్రభుత్వం వద్ద ఖైదీలుగా ఉన్నారు. ఈ చర్చల్లో అఫ్గాన్‌ ప్రభుత్వం భాగస్వామి కాదు. అమెరికా-తాలిబన్ల మధ్య జరిగిన చర్చలివి. దీంతో ఈ ఖైదీల విడుదలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ మాట్లాడుతూ అఫ్గాన్‌ అంతర్గత వర్గాల చర్చలు ప్రారంభమయ్యే వరకు తాము ఖైదీలను విడుదల చేసేదిలేదని తాజాగా ఓ సమావేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం.

- పెద్దింటి ఫణికిరణ్‌

 

Posted Date: 18-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం