• facebook
  • whatsapp
  • telegram

  తాలిబన్‌ ఒప్పందం తప్పూ తాలూ

* భారత్‌ భద్రతకు చేటు తెచ్చేనా?

దోహాలో అమెరికా, అఫ్గాన్‌ తాలిబన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రాంతీయ భద్రత, సుస్థిరతలను ప్రభావితం చేయనుంది. దీర్ఘకాలంలో భారత్‌పై ప్రభావం సానుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగానా అన్నది ముఖ్యమైన ప్రశ్న. కేవలం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రయోజనాల కోసమే ఆదరాబాదరాగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఒప్పంద పీఠికను చూస్తే చాలు అందులో ఉన్న మెలిక అర్థమైపోతుంది. తాలిబన్‌గా సుపరిచితమైన అఫ్గానిస్థాన్‌ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ను ఒక రాజ్య వ్యవస్థగా అమెరికా సాధికారికంగా గుర్తించడం లేదు. అయినా అఫ్గానిస్థాన్‌లో శాంతి సాధనకు వారితో అమెరికా 2020 ఫిబ్రవరి 29న ఒప్పందం కుదుర్చుకుంది అని ఒప్పంద పీఠికలో స్పష్టంగా పేర్కొన్నారు. దీన్నిబట్టి ఒప్పందం తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందంటే తప్పు లేదు.

ఈ శాంతి ఒప్పంద సారమేమంటే- అమెరికా, దాని మిత్రదేశాల భద్రతకు ముప్పు తీసుకురావడానికి అఫ్గాన్‌ గడ్డను ఏ బృందం కానీ, వ్యక్తి కానీ ఉపయోగించకుండా తాలిబన్‌ నిరోధిస్తుంది. అందుకు బదులుగా అఫ్గానిస్థాన్‌ నుంచి ఒక గడువులోగా అన్ని విదేశీ సేనల ఉపసంహరణకు అనుసరించే పద్ధతి క్రమాన్ని, భరోసాలను అమెరికా ప్రకటిస్తుంది అని. చిత్రమేమిటంటే తాలిబన్ల ఇస్లామిక్‌ ఎమిరేట్‌ను అమెరికా గుర్తించనట్లే, ప్రజాస్వామికంగా ఎన్నికైన అఫ్గాన్‌ ప్రస్తుత ప్రభుత్వాన్నీ తాలిబన్లు గుర్తించకపోవడం. అందువల్లనే శాంతి ఒప్పందంలో అఫ్గాన్‌ ప్రజాతంత్ర ప్రభుత్వ ఊసే లేకుండా పోయింది. 2001 సెప్టెంబరు 11న అమెరికాపై ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా అఫ్గానిస్థాన్‌లోని అల్‌ ఖైదా, వారి వత్తాసుదారులైన తాలిబన్లపై అమెరికా సంకీర్ణ సేనలు విరుచుకుపడ్డాయి. అమెరికా-తాలిబన్‌ పోరుకు భారత్‌ దూరంగా ఉండిపోయినా, ఆ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకోవడానికి మాత్రం తన వంతు సాయం అందిస్తూ వచ్చింది. అంతకుముందు, అంటే 1999 డిసెంబరులో భారతీయ పౌర విమానం హైజాక్‌, అందులోని ప్రయాణికులను విడచిపెట్టినందుకు బదులుగా కొందరు ఉగ్రవాద ఖైదీలను విడుదల చేయాల్సి వచ్చిన ఉదంతంలో తాలిబన్ల పాత్రను భారత్‌ మరచిపోలేదు. 1990లలో తాలిబన్లు రంగం మీదకు వచ్చినప్పటి నుంచి వారికి పాకిస్థాన్‌ సైన్యం పూర్తి అండదండలిస్తూ వచ్చింది. భారత్‌ అనుసరించిన అఫ్గాన్‌ విధానాన్ని ఈ అంశం ప్రభావితం చేసింది. 1979లో అఫ్గానిస్థాన్‌ పై సోవియట్‌ యూనియన్‌ దండయాత్ర చేసింది. సోవియట్లపై 1980వ దశకంలో ముజాహిదీన్‌లు పోరాటం ప్రారంభించగా, అమెరికన్లు వారికి వత్తాసు ఇచ్చారు. ఈ పోరుకు పాకిస్థాన్‌ అన్ని విధాలా సహకరించింది. రోనాల్డ్‌ రీగన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సోవియట్లతో ప్రచ్ఛన్న యుద్దాన్ని ఈ విధంగా ముమ్మరం చేశారు. అమెరికా-సోవియట్‌ వైరం, సౌదీ-ఇరాన్‌ మత భేదాలు, జిహాదీలకు పాకిస్థాన్‌ అండదండలు, బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) కింద నిర్మితమవుతున్న చైనా పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సిపెక్‌)- ఇవన్నీ భారతదేశ విదేశాంగ, భద్రతా విధానాలను ప్రభావితం చేస్తూ వచ్చాయి. తాజాగా అమెరికా-తాలిబన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేం. అందుకే భారతదేశం ఈ ఒప్పందం పట్ల ఆచితూచి స్పందించింది. అఫ్గానిస్థాన్‌లో శాంతి, భద్రత, సుస్థిరతలను పునరుద్ధరించడానికి ఏ అవకాశం దొరికినా భారత్‌ పూర్తిగా సమర్థిస్తుంది. అక్కడ హింసాకాండ, అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు అంతమవడానికి శాశ్వత రాజకీయ పరిష్కారం లభించాలని ఆశిస్తోంది. ఈ పరిష్కారమనేది అప్గాన్ల నియంత్రణలో, అఫ్గాన్ల నాయకత్వంలో సిద్ధించాలని కోరుకుంటోంది అని దిల్లీ ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌లో శాంతి, ప్రజాస్వామ్యం, అభివృద్ధి విలసిల్లాలని; అఫ్గాన్‌ సమాజంలో అన్ని వర్గాలకు మేలు జరిగే వాతావరణం ఏర్పడాలని కోరుకుంటున్నామని ఉద్ఘాటించింది. ఈ లక్ష్యాల సాధనకు అఫ్గాన్‌ ప్రభుత్వం, ప్రజలకు భారత్‌ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చింది. అమెరికా తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకుంటే, భారత్‌ అఫ్గాన్‌ ప్రజాతంత్ర ప్రభుత్వ పాత్రను నొక్కిచెప్పడం విశేషాంశం. ఫిబ్రవరి 29న కుదిరిన ఒప్పందం ఎంతసేపటికీ తాలిబన్ల డిమాండ్ల గురించి పట్టించుకుందే తప్ప అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రాధాన్యాన్ని గుర్తించడానికి నిరాకరించింది. 18 ఏళ్ల నుంచి తాను పోరాటం జరిపిన తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆరాటంలో అమెరికా, ఆ పోరాటంలో అమాయక అఫ్గాన్‌ పౌరులకు ఎదురైన కష్టనష్టాలను పూర్తిగా విస్మరించింది. అపార ప్రాణ, ఆస్తి నష్టాల గురించి మరచిపోయింది. ఫిబ్రవరి 29 ఒప్పందంలో అమెరికా, దాని మిత్రదేశాలపై తాలిబన్‌ దాడి చేయకూడదని షరతు పెట్టింది. ఈ నిబంధన భారతదేశానికి వర్తించదు కాబట్టి పాకిస్థాన్‌, తాలిబన్ల ప్రేరేపణతో ఉగ్రవాదులు భారత్‌పై దాడులకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. ఇది ఎంతో ఆందోళనకరం. అమెరికా-తాలిబన్‌ ఒప్పందంలోని డొల్లతనం ఫిబ్రవరి 29న దానిపై సంతకాలు జరిగిన రోజే బయటపడింది.

అమెరికా సేనలు వైదొలగిన తరవాత అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి బలోపేతం కావడం ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌), అల్‌ ఖైదా శక్తులకు కొత్త ఊపునిస్తుంది. ఫిబ్రవరి నెలాఖరులో దిల్లీలో జరిగిన అల్లర్లను ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రంగా పరిగణించడం ఇక్కడ గమనించాలి. ఈశాన్య దిల్లీలో ఒక ముస్లింపై కొందరు వ్యక్తుల గుంపు దాడి చేసిన ఘటనను ఐసిస్‌ సైబర్‌ విభాగం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇంతవరకు భారత్‌లో ఉగ్రవాద కార్యకర్తలను రిక్రూట్‌ చేసుకోవడంలో ఐసిస్‌ పెద్దగా సఫలం కాలేకపోయింది. అఫ్గాన్‌ శాంతి ఒప్పందం, దిల్లీ అల్లర్ల తరవాత పరిస్థితి మారే ప్రమాదం లేకపోలేదు. ఏతావతా అఫ్గాన్‌ శాంతి ఒప్పందం నిలబడినా, భగ్నమైనా ప్రాంతీయ సుస్థిరతకు చేటు తెచ్చే అవకాశమే ఎక్కువ.

- సి.ఉదయ్‌ భాస్కర్‌
(రచయిత- నౌకాదళ విశ్రాంత అధికారి)

Posted Date: 18-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం