• facebook
  • whatsapp
  • telegram

  అఫ్గాన్లో శాంతి భ్రాంతియేనా!

* తాలిబన్లతో అమెరికా ఒప్పందం

ఇటీవల అమెరికా, తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరినా- అఫ్గానిస్థాన్లో ఎక్కడో ఒకచోట నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశాధ్యక్షులుగా పోటాపోటీగా ఇద్దరు నేతలు ప్రమాణ స్వీకారాలు చేశారు. తాలిబన్ ఖైదీల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ పరిస్థితుల్ని మరింత వేడెక్కిస్తున్నాయి. అఫ్గానిస్థాన్లో శాంతి నెలకొనడం భ్రాంతియేనా అనే అనుమానాలకు తావిస్తున్నాయి.
అఫ్గాన్ ఒప్పందంపై ఎవరెలా వ్యాఖ్యానించినా- ఈ గ్రహం మీదే శక్తిమంతమైన సైనిక, ఆర్థిక శక్తిగా పేరొందిన అమెరికా... అనాగరిక అఫ్గాన్ జిహాదీ బృందాలను మచ్చిక చేసుకోవడంలో విఫలమైందని మాత్రం చెప్పక తప్పదు. ఆ ఒప్పందం అత్యంత స్పష్టంగా చెబుతున్నదిదే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని నమ్మింపజూస్తున్నట్లుగా ఇది శాంతి ఒప్పందం కాదు, వారికి లొంగిపోవడమే. ట్రంప్తోపాటు అదే తరహా ఆలోచనలు కలిగిన అమెరికన్ల దృష్టిలో మాత్రం ఇది మంచి ఒప్పందం! ప్రస్తుతం అమెరికా భావోద్వేగ స్థితిలో ఇది సరైన పరిణామమేనని భావిస్తున్నవారూ ఉన్నారు. ప్రపంచానికి పోలీసు మాదిరిగా వ్యవహరించే క్రమంలో భారీ స్థాయిలో డబ్బుల్ని, మనుషుల్ని నష్ట పోతుండటంపై అమెరికాలో అంతకంతకూ ఆందోళన పెరిగిపోతోంది. ఒక అంచనా ప్రకారం- అఫ్గానిస్థాన్ యుద్ధం కారణంగా అమెరికాకు రెండు లక్షల కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. సంకీర్ణ దళాలకు చెందిన మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అమెరికన్లే ఎక్కువ. 2001లో మూడు వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి, ఎంతోమంది క్షతగాత్రులుగా మిగలడానికి కారణమైన 9/11 ఉగ్రదాడి అనంతరం తాలిబన్లు, ఒసామాబిన్ లాడెన్ పని పట్టేందుకు అమెరికన్లు నాటో దళాలతో పోరు ప్రారంభించారు. ఒక దశలో అఫ్గానిస్థాన్లో విదేశీ బలగాల సంఖ్య లక్షకు పైబడింది. తాలిబన్లు కొంతకాలం తగ్గినట్లుగా ఉన్నారు. పాకిస్థాన్ వారికి ఆశ్రయం సైతం కల్పించింది. ఆ తరవాత కొద్దికాలంలోనే తాలిబన్లంతా ఒక్కచోట చేరారు. తమ జిహాదీ ఉగ్రవాదంతో దేశాన్ని అస్థిరపరిచారు. మధ్యయుగాలనాటి విధానాల్ని అమలులోకి తెచ్చారు. ఫలితంగా మహిళలది బానిస బతుకుగా మారగా, పురుషులు ఏకపక్ష శాసనాలకు కచ్చితంగా లొంగి పడి ఉండాల్సిన స్థితిని తీసుకొచ్చారు. అమెరికా అండతో అఫ్గాన్లోని ఎన్నికైన ప్రభుత్వం కేవలం ప్రధాన పట్టణ కేంద్రాల వరకే పాలన సాగించగా, దేశం మారుమూల ప్రాంతాల్లో తాలిబన్లతో పూర్తిగా సహకరించిన గిరిజన భూస్వాములే పాలనపరమైన పెత్తనం చలాయించారు.
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైనికులను వెనక్కి తీసుకొస్తాననేది ట్రంప్ ఎన్నికల్లో చేసిన ప్రధాన హామీ. ఈ మేరకు ఖతర్ను ప్రధాన మధ్యవర్తిగా చేసుకొని తాలిబన్లతో అమెరికా చర్చలు సాగించింది. ఇక్కడ రెండు విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి- అఫ్గాన్ పరిణామాలకు సంబంధించినంత వరకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఎన్నడూ దూరంగా ఉండలేదు. తాలిబన్లకు ప్రధాన మార్గదర్శిగా సాగింది. ఈ ఒప్పందం కొలిక్కి వచ్చేందుకు అమెరికా పాకిస్థాన్పైనే ఆధారపడింది. రెండోది- చర్చలకు సంబంధించి అఫ్గాన్లోని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రభుత్వ ప్రమేయం తక్కువే. 2018 నుంచి జరిగిన ఈ తరహా చర్చల్లో చాలా అంశాలు పరిగణనలోకి రాకుండా విస్మరణకు గురయ్యాయి. అయినప్పటికీ, నవంబర్లో జరిగే ఎన్నికల్లో మరోసారి గెలవాలని భావిస్తున్న ట్రంప్ ఒప్పందం కుదిరే దిశగా మార్గం సుగమం చేసినట్లు భావించాల్సి ఉంటుంది. ఒప్పందంపై సంతకాలు చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే... ఖైదీల మార్పిడి విషయంలో ప్రధాన భేదాభిప్రాయాలు తలెత్తడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అమెరికా సైనికుల ఉపసంహరణ తరవాత అధికారాన్ని పంచుకునే విషయంలో ఒప్పందం కుదరకపోతే... తాలిబన్ల చేతిలో ఉన్న వెయ్యిమంది బందీల్ని విడిచిపెట్టేందుకు, ప్రతిగా అయిదు వేల మంది తాలిబన్ ఖైదీల్ని విడిచిపెట్టాలనే ప్రతిపాదనను అఫ్గాన్ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ పరిణామాలతో అఫ్గానిస్థాన్లో జరగాల్సిన అంతర్గత చర్చలపై ఇప్పటికే నీలినీడలు కమ్ముకున్నాయి.
అమెరికన్లకు ప్రస్తుతం అఫ్గానిస్థాన్లో పద్నాలుగు వేలకుపైగా బలగాలున్నాయి. అఫ్గాన్లో అంతర్గత చర్చల ప్రారంభంతో అయిదు వేల మందిని ఉపసంహరించుకోవాలనేది ప్రణాళిక. ప్రస్తుతం అఫ్గాన్లో ప్రభుత్వం ఉన్నా, రాబోయే కాలంలో దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునే విషయంలో తాలిబన్లు ఎక్కువ కాలం వేచి చూడకపోవచ్చని తెలుస్తోంది. ఫస్తూన్ల ఆధిక్యం ఎక్కువగా ఉండే తాలిబన్లు తమ తోటి ఫస్తూన్ అయిన అధ్యక్షుడు ఘనీకి కొత్త వ్యవస్థలోనూ అవకాశం కల్పించే అవకాశం ఉంది. అయితే, తజిక్, ఉజ్బెక్ వంటి ఇతర జాతి వర్గాలు వారి ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనిపిస్తోంది. ఇక- భారత్కు సంబంధించి భద్రతా పరంగా పెరిగిన ముప్పునూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా, విదేశాల నుంచి పెరుగుతున్న జిహాదీ ఉగ్రవాద ముప్పు నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు కొత్త శక్తిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి తాజా పరిణామాలతో అఫ్గానిస్థాన్ అనాగరిక, అరాచక శక్తుల చేతుల్లోకి తిరిగి వెళ్తోందనే ఆందోళన ఎక్కువమందిలో మొదలైంది!

- వీరు.కె

Posted Date: 13-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం