• facebook
  • whatsapp
  • telegram

  ప్రపంచ దేశాల చమురు చదరంగం

* పావులుగా మారుతున్న సామాన్యులు

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంటే, మరోవంక చాపకింద నీరులా చమురు సంక్షోభం విస్తరిస్తోంది. ప్రధానంగా చమురు వాణిజ్యం మీదే ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. చమురు సంపన్న దేశాలు వ్యూహాత్మకంగా ఉత్పత్తులను తగ్గిస్తూ, పెంచుతూ; అవసరానుగుణంగా ఎగుమతులను నియంత్రిస్తూ ధరల సరళిని ఇన్నేళ్లూ ఇష్టారీతిన మార్చేశాయి. తమకున్న చమురు బలాన్ని ఉపయోగించి ఆ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక రాజకీయాలను శాసించాయి. ప్రపంచ చమురు ధరల, మార్కెట్ల నియంత్రణకు 15 సభ్య దేశాలతో ఎనిమిదో దశకంలో ‘ఒపెక్’ (చమురు ఉత్పత్తి దేశాల సంస్థ)ను ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో రష్యా భాగస్వామి కాకపోయినప్పటికీ- ‘ఒపెక్’ సమావేశాలకు ఠంచనుగా హాజరవుతోంది. గడచిన కొంతకాలంగా ‘షేల్ గ్యాస్’ ఉత్పత్తిలో అమెరికా ముందుకు దూసుకుపోతోంది. అమెరికా, రష్యాలు అంతర్జాతీయ వేదికపై చమురు ధరలనూ ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నాయి.
కరోనా విజృంభణ కారణంగా ఈ నెల మొదట్లో చైనాలో చమురుకు డిమాండ్ మందగించింది. ప్రపంచంలో అత్యధిక చమురు వినియోగ దేశాల్లో అగ్రభాగాన ఉండే చైనాలో గిరాకీ పడిపోవడంతో ఆ ప్రభావం సహజంగానే ముడి చమురు ధరలపై ప్రసరించింది. చైనాతో పాటు దక్షిణ కొరియా మరికొన్ని దేశాలూ చమురు దిగుమతులను భారీగా తగ్గించాయి. దాంతో ముడి చమురు ధర బ్యారెల్‌కు 50 డాలర్ల కనిష్ఠానికి చేరింది. ఆ పరిస్థితుల్లో ఒక్కపెట్టున పడిపోతున్న చమురు ధరలను నిలువరించేందుకు ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడమే మేలన్న ప్రతిపాదనతో సౌదీ అరేబియా ముందుకొచ్చింది. ఉత్పత్తి తగ్గితే ఆ మేరకు ధరలకు కళ్లెం పడుతుందన్నది సౌదీ అరేబియా ప్రతిపాదన. కానీ, ఉత్పత్తికి కోతపెట్టాలన్న సౌదీ సూచనను రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ అడ్డంగా తిరస్కరించారు. తగ్గింపు మాటను పక్కనపెట్టి రష్యా గరిష్ఠ స్థాయిలో ఉత్పత్తిని కొనసాగించింది. దాంతో ముడి చమురు ధరలు దారుణంగా పతనమయ్యాయి. 1991 గల్ఫ్ యుద్ధకాలం నాటి కనిష్ఠానికి దిగజారాయి. రష్యా చర్యతో ఆగ్రహం చెందిన సౌదీ అరేబియా అనూహ్యంగా ముడి చమురు ఉత్పత్తిని పెంచడంతోపాటు ధరలను మరింత తగ్గించింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 30 డాలర్లకు చేరింది. ఈ ధరలు మరింత దిగజారి బ్యారెల్‌కు 20 డాలర్లు పలకవచ్చునని గోల్డ్‌మ్యాన్ సాచ్ సంస్థ అంచనా!
ఈ చమురు యుద్ధంలో గెలిచిందెవరు, ఓడిందెవరు? చమురు విక్రయాలు, దాని నుంచి వచ్చే లాభాలపై అధికంగా ఆధారపడే రష్యా ఉన్నఫళంగా ఉత్పత్తి పెంచి ధరల పతనానికి ఎందుకు సమకట్టింది? ఇంతకీ రష్యా వ్యూహమేమిటని ఆరా తీస్తే అనేక కారణాలు కళ్లకు కడతాయి. 2015లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 37 డాలర్లకు కుప్పకూలినప్పుడు రష్యా దారుణంగా దెబ్బతింది. చమురు ధరల పతనం దెబ్బకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 3.7శాతం కుంచించుకుపోయింది. ఆ ఘటన రష్యా ఆలోచన ధోరణిలో పెను మార్పులు తీసుకువచ్చింది. చమురుతో సంబంధం లేకుండా ‘మాస్కో’ నాయకత్వం విత్త వ్యవస్థలను పటిష్ఠంగా తీర్చిదిద్దుకుంది. బంగారం నిల్వలను భారీగా పెంచుకుని ఆర్థిక వ్యవస్థను సుభద్రంగా నిర్మించుకుంది. ఉక్రెయిన్‌తో వివాదం కారణంగా పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. అంతర్జాతీయ ఆంక్షలవల్ల తలెత్తే ఉత్పాతాలనూ దృష్టిలో పెట్టుకొని- ఎంతటి ఒడుదొడుకులనైనా తట్టుకొనే యుద్ధ సన్నద్ధతతో రష్యా తన ఆర్థికవ్యవస్థలను నిర్మించుకొంది. దుర్భేద్య ఆర్థిక వ్యవస్థను సొంతం చేసుకున్న రష్యాను చమురు ధరల్లో పతనం పెద్దగా ప్రభావితం చేయలేదు. కానీ, ఈ పరిణామం పూర్తిగా చమురు విక్రయాలపైనే ఆధారపడిన అరబ్బు దేశాలను ‘ఒపెక్’లోని ఇతర సభ్య రాజ్యాలను మాత్రం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సిరియా సంక్షోభంలో అసద్ ప్రభుత్వానికి సైనిక మద్దతు అందించి రష్యా సాయంగా నిలవడంతోపాటు- పశ్చిమాసియా రాజకీయాల్లో తనదైన శైలిలో పావులు కదిపింది. సిరియా, పశ్చిమాసియాల్లో రష్యా జోక్యాన్ని సౌదీ అరేబియా బహిరంగంగా వ్యతిరేకించింది. దాంతో సౌదీపై కన్నెర్రజేసిన ‘మాస్కో’ నాయకత్వం ఎలాగైనా ఆ దేశానికి గుణపాఠం నేర్పాలన్న పంతంతో ఉంది. మరోవంక గడచిన దశాబ్దకాలంలో ‘చమురు-సహజ వాయువు’ వెలికితీతలో విప్లవాత్మకంగా ముందడుగు వేసి, ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న అమెరికాపైనా ఈ ప్రభావం పడింది. ఫలితంగా ఆ దేశం చమురు ఉత్పత్తిని తగ్గించుకోవడంతోపాటు, ధరలకూ కోతపెట్టాల్సి వచ్చింది. ఫలితంగా అమెరికన్ చమురు కంపెనీలు సంక్షోభంలో పడ్డాయి. మారిన సమీకరణల్లో రష్యా పైచేయి సాధించింది. రష్యాతో అమెరికా సంప్రదింపులు జరపక తప్పని పరిస్థితి ఏర్పడింది. తన చర్యల ద్వారా రష్యా ‘ఒపెక్’ ప్రాధాన్యాన్ని ఒక్కపెట్టున తగ్గించగలిగింది. చైనా, కొన్ని ఐరోపా దేశాల రూపంలో రష్యా ముడి చమురుకు అతిపెద్ద కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నారు. దాంతో రష్యా చమురు పరిశ్రమకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఇప్పుడు సమస్యల్లా సాధారణ వినియోగదారులకే! చమురు ధరలు పడిపోతే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు మేలు జరుగుతుందనుకుంటే అది పొరపాటే. అమెరికాతోపాటు ‘ఒపెక్’ దేశాల్లోనూ పెద్ద చమురు కంపెనీలు రష్యా, సౌదీ అరేబియాలనుంచి తక్కువ రేటుకు సరఫరా అవుతున్న చమురు దిగుమతులపై భారీ సుంకాలు విధించాలని ఆయా కంపెనీలు అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి. భారత్‌లోనూ చమురుపై ఎక్సైజ్ సుంకాలు పెంచడంతో ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరుతోంది గానీ, సామాన్యుడికి ఎలాంటి ఉపయోగమూ ఉండటం లేదు. పెద్ద దేశాలు ఆడుతున్న చమురు చదరంగంలో బడా కంపెనీలు బాగుపడుతున్నాయేగానీ- సామాన్యుడికి మాత్రం నిరాశే మిగులుతోంది!


- అనురాధా షెనాయ్
(రచయిత్రి - దిల్లీలోని జేఎన్‌యూ అంతర్జాతీయ అధ్యయన విభాగ మాజీ ‘డీన్’, విశ్రాంత ప్రొఫెసర్)

Posted Date: 13-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం