• facebook
  • whatsapp
  • telegram

  స్వయంకృతానికి అమెరికా మూల్యం

* ప్రమాదాన్ని పసిగట్టడంలో విఫలం

   అమెరికాలో రెండులక్షల మందికిపైగా వైరస్‌ బారిన పడటంతో ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురయింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, సంపన్నమైన దేశం అమెరికా. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుని జీవశాస్త్ర పరిశోధనల్లోనూ అందరికన్నా ముందున్న దేశమది. కొన్ని దశాబ్దాలుగా పెద్ద సంఖ్యలో భారతీయులు మెరుగైన జీవనం కోసం అమెరికాలో స్థిరపడ్డారు. అందులోనూ తెలుగువారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. గుజరాతీల తరవాత తెలుగువారే అక్కడ ఎక్కువమంది ఉన్నారు. అందుకే అమెరికాలో చోటుచేసుకునే చిన్న పరిణామాలు సైతం ఇక్కడున్న తెలుగువాళ్లను ప్రభావితం చేస్తాయి. తెలుగు ప్రసార మాధ్యమాల్లో సైతం అమెరికాలో వాతావరణ మార్పుల దగ్గర నుంచి సామాజిక అంశాల దాకా ప్రధానంగా ప్రస్తావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఒక్కసారిగా పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులపై ఇక్కడున్న తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వైరస్‌ బాధితుల విషయంలో అమెరికా ఎందుకు సతమతమవుతోందో లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
చురుగ్గా స్పందించని ప్రభుత్వాలు
   వుహాన్‌ నగరంలో పుట్టిన ఈ వైరస్‌ గురించి దాదాపు రెండు నెలలదాకా బయట ప్రపంచానికి పొక్కకుండా ఉండటానికి చైనా ప్రభుత్వ వైఖరే కారణమనే విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. మూడు దశాబ్దాల నుంచి అమెరికా- చైనా వ్యాపార సంబంధాలు గణనీయంగా అభివృద్ధి చెందడంతో అటూ ఇటూ మానవ వనరుల కదలికల్లో పెనుమార్పులొచ్చాయి. ప్రత్యేకించి అమెరికా పశ్చిమ తీరంతో చైనీయుల అనుబంధం ఎక్కువగా ఉంది. మొట్టమొదటగా జనవరి 21వ తేదీన వాషింగ్టన్‌ ప్రాంతంలోని స్నోకామీ కౌంటీలో ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అతడు జనవరి 15వ తేదీన చైనా నుంచి వచ్చాడు. వుహాన్‌ నగరంలో ఈ వైరస్‌ వ్యాప్తి గురించి ప్రపంచవ్యాప్తంగా వెల్లడి కావడంతో, తరవాత చైనా ప్రకటన చేసింది. కొద్ది రోజులకు వుహాన్‌ నగరంలో లాక్‌డౌన్‌నూ ప్రకటించింది. కానీ, అత్యంత అధునాతన సమాచార వ్యవస్థ కలిగిన అమెరికా మేలుకోలేదు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం సమర్థ చర్యలు తీసుకోలేదు. వెంటనే చైనా నుంచి వచ్చే విమానాలను నిషేధించడం, వచ్చిన వారిని పూర్తి పర్యవేక్షణలో ఉంచడం లాంటి తక్షణ చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. సమస్య అక్కడితో ఆగలేదు. ఈ నమూనాలను పరిశీలించే టెస్టింగ్‌ కిట్లు, ప్రయోగశాలల విషయంలో గందరగోళం నెలకొంది. జనవరిలోనే జర్మనీ పరిశోధకులు అభివృద్ధి చేసిన టెస్టింగ్‌ కిట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించడంతో అన్ని దేశాలు అదే నమూనాను ఉపయోగించాయి. దక్షిణ కొరియా వాటితోనే విస్తృతంగా పరీక్షలు చేపట్టింది. కానీ అమెరికా మాత్రం వాటిని ఉపయోగించటానికి ఒప్పుకోలేదు. అవి పూర్తిస్థాయిలో లోపరహితం కావనే నెపంతో సొంత నమూనాతో పనిచేసే కేంద్ర సంస్థ ఉన్న అట్లాంటాకి మాత్రమే పంపించారు. అక్కడ రోజుకు కొన్ని వేలు మాత్రమే పరీక్షించే సామర్థ్యం ఉంది. పైగా పరీక్ష ఫలితం రావడానికి కనీసం ఒకరోజు పడుతుంది. ఇలాంటి లోపభూయిష్ఠ వ్యవస్థ మూలంగా బయటి నుంచి వచ్చినవాళ్లలో ఎంతమందికి వైరస్‌ సోకింది, వాళ్లు ఎంతమందితో అనుసంధానమయ్యారనే విషయం తెలుసుకోవడం కష్టతరమైంది. ఈ తతంగం దాదాపు నెల రోజులు నడిచింది. ఫిబ్రవరి 29న మొదటి కరోనా మరణం సియాటిల్‌ శివారులో సంభవించడంతో అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. అప్పటిదాకా ప్రభుత్వ చర్యలు నిమ్మకు నీరెత్తినట్లుగా సాగడంతో వైరస్‌ వ్యాప్తి చాపకింద నీరులా విస్తృతమైంది.
   అంటువ్యాధుల విషయంలో ప్రతిరోజూ, ప్రతిక్షణం విలువైనదే. జరగరాని ఘోరం అప్పటికే జరిగిపోయింది. ఆ మృతితో కళ్లు తెరిచిన ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ప్రైవేటు సంస్థలకు అనుమతులిచ్చింది. అయినా ఆ సంస్థలు అన్ని ఏర్పాట్లు చేసుకొని ‘ఎఫ్‌డీఏ’ అనుమతి తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఈ లోపు వైరస్‌ వ్యాప్తి మరింత లోతుగా చొచ్చుకుపోయింది. వాషింగ్టన్‌ ప్రాంతంలో దాదాపు 50 మందికి పైగా అప్పటికే మరణించారు. వాస్తవానికి అమెరికాలో గత రెండు వారాల నుంచే ఎక్కువ టెస్టింగ్‌ కిట్లు, ప్రయోగశాలలు అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో పశ్చిమ తీరంలోని క్యాలిఫోర్నియా, వాషింగ్టన్‌ ప్రాంతంలో ఎక్కువ కేసులు నమోదయితే ఈ పరీక్షలన్నీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చేటప్పటికి తూర్పు తీరంలోని ఇంగ్లాండ్‌ ప్రాంతం, న్యూయార్క్‌ నగరం, న్యూజెర్సీల్లో వేలల్లో బయటకొచ్చాయి. ఒక్కసారిగా ఓ విస్ఫోటంలా అమెరికాలో కేసులు పెరగడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఆరోగ్య నిపుణులు మొదట్నుంచీ ఇలా జరిగే అవకాశం ఉందని చెబుతూనే ఉన్నారు. ప్రభుత్వమే మొదట్లో పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు ఇలాంటి తీవ్ర పరిస్థితి నెలకొంది.

ఆదరాబాదరాగా ఏర్పాట్లు
   ప్రస్తుతం రోజురోజుకీ వైరస్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతూ ఉంది. కాకపోతే, వ్యాధి సోకిన వారిలో చనిపోతున్న వారి సంఖ్య విషయంలో అమెరికా పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. ఇటలీలో 10 శాతం, స్పెయిన్‌లో 8 శాతం మంది మృత్యువాత పడితే అమెరికాలో అది 1.5 శాతంగా ఉంది. ఇది కొంతలోకొంత ఊరట కలిగించే విషయం. అయితే వాషింగ్టన్‌ యూనివర్సిటీ మెడిసిన్‌ స్కూల్‌ నిపుణుల అంచనా ప్రకారం- వైరస్‌ వ్యాప్తి ఉచ్ఛ దశ ఏప్రిల్‌ మధ్య దాకా ఉండొచ్చని, మొత్తం మృతులు 2.4లక్షల దాకా ఉండొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకునే చర్యల తీవ్రతను బట్టి ఈ సంఖ్య ఆధారపడి ఉంటుందని అంచనా వేసింది. అమెరికా కాంగ్రెస్‌ ఆమోదంతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. పాతకాలంనాటి రక్షణ ఉత్పత్తి చట్టాన్ని ప్రయోగించి జనరల్‌ మోటార్‌ కంపెనీ ద్వారా వెంటిలేటర్ల తయారీకి శ్రీకారం చుట్టారు. మాస్కులు, రక్షణ ముసుగులు యుద్ధ ప్రాతిపదికన తయారు చేయడంతోపాటు, దిగుమతి చేసుకుంటున్నారు. అవసరమైతే ఇతర దేశాలకు కూడా వెంటిలేటర్లు సరఫరా చేస్తామని ప్రకటించారు. కనీసం ఈ వేగంతో పని చేస్తేనైనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే ఇప్పటికీ ట్రంప్‌, డెమోక్రాట్‌ గవర్నర్ల మధ్య బహిరంగంగా గొడవలు సాగుతూనే ఉన్నాయి. చివరకు లాక్‌డౌన్‌ విషయంలోనూ భేదాభిప్రాయాలున్నాయి. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ స్పందిస్తూ కనీసం ఆరు నుంచి పది వారాలు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటిస్తేనే ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కగలమని చెబుతున్నారు. డెమోక్రాట్‌ నేత జో బైడెన్‌ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ రెండు వారాలు సరిపోతుందని పేర్కొన్నారు. ఇంత జరిగినా ఇప్పటికీ ప్రజలు పూర్తిస్థాయిలో స్వీయ గృహనిర్బంధంలో లేరు. ఇంకా కొంత శాతం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అదేమంటే ఆ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కువ కేసులు లేవని ప్రభుత్వాలు చెబుతున్నాయి. నిపుణులు మాత్రం ఇదంతా ఇలాగే సాగితే మిగతా ప్రాంతాల్లోనూ న్యూయార్క్‌లాంటి పరిస్థితే తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు.
   ఇక భారత్‌ విషయానికి వస్తే- అమెరికా అనుభవం చూసైనా మనం పాఠాలు నేర్వాలి. ముఖ్యంగా ప్రజలు ప్రభుత్వాలకు పూర్తి సహకారం అందించాలి. ఏదో ఒక మిషతో, గుంపులు గుంపులుగా ఒకచోట చేరితే అందరికీ చేటు చేసిన వారవుతారని గ్రహిస్తే మంచిది.

న్యూయార్క్‌ అతలాకుతలం
   న్యూయార్క్‌ నగరం పరిస్థితి దారుణంగా తయారైంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అత్యంత జనసాంద్రత కలిగిన నగరం కావడం, ఎక్కువ మంది ప్రజారవాణాను ఉపయోగించడం వల్ల వ్యాధి ప్రబలడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో న్యూయార్క్‌ కూడా ఒకటి. ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలైన పారిస్‌, ఇటలీ, న్యూయార్క్‌ ఈ మహమ్మారి బారినపడ్డాయి. ఈ పరిస్థితులతోపాటు స్వయంకృతాపరాధమూ కొంత ఉంది. ముందస్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించకపోవడం, అంతర్జాతీయ పర్యాటకులను, విమానాలను ఆపకపోవడంలాంటి చర్యలు ఘోర తప్పిదాలుగా పరిణమించాయి. విరివిగా పరీక్ష కిట్లు అందుబాటులో లేకపోవడం, ప్రయోగశాలలు ఏర్పాటు చేయకపోవడంతో వైరస్‌ సోకినా వారిని ముందుగానే గుర్తించలేకపోయారు. దాంతో ప్రజానీకంలో వ్యాధి విస్తృతంగా వ్యాపించింది. కొన్నాళ్లకు ఆ లోపాలన్నింటినీ సవరించుకొని ఎక్కువ మందికి పరీక్షలు చేయటంతో వేల కేసులు ఒక్కసారిగా బయట పడ్డాయి. నిపుణుల అంచనా ప్రకారం న్యూయార్క్‌ నగరంలోనే సుమారు లక్ష మందిదాకా కరోనా బారినపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌లో ఇంత జరిగినా ప్రభుత్వ పనితీరు మారిందని చెప్పలేం. ప్రస్తుత పరిస్థితి పాక్షిక లాక్‌డౌన్‌గానే ఉంది. రహదారులపైకి వచ్చే వాళ్లకు కొదవేమీ లేదు. ఇటీవలే విమాన సర్వీసులు మూసివేసినా రోడ్డు ప్రయాణాలు పూర్తిగా మూసివేశారని చెప్పలేం. ఇంకా ఉద్ధృతి తగ్గడానికి రెండు, మూడు వారాలు పట్టొచ్చు. ఈ లోపల వైరస్‌ బాధితుల సంఖ్య ఎంతదాకా పెరుగుతుందనేది ఊహకే అందడం లేదు. న్యూయార్క్‌ మేయర్‌ మాటల్లో చెప్పాలంటే ఇంకా 30 వేల వెంటిలేటర్లు, లక్షకుపైగా పడకలు కావాల్సి ఉంటుంది.


 

Posted Date: 13-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం