• facebook
  • whatsapp
  • telegram

  కొత్త సంకీర్ణాల కాలమిది

* కీలకం కానున్న భారత్‌ పాత్ర

   ‘ప్రపంచాన్ని నాయకత్వ శూన్యత ఆవరించనుంది. మధ్యాదాయ దేశాలకు, ఒకమాదిరి శక్తి సామర్థ్యాలున్న రాజ్యాలకు నాయకత్వ స్థానం అందుకునే అవకాశాలు బార్లా తెరచుకోనున్నాయి. జపాన్‌, జర్మనీ, ఇండియా, దక్షిణాఫ్రికా వంటివి ఒకే తాటి మీదకు వచ్చి సంకీర్ణంగా ఆవిర్భవించే వాతావరణం కనిపిస్తోంది’ చైనా, పాకిస్థాన్‌లకు భారత రాయబారిగా పనిచేసిన గౌతమ్‌ బంబవాలే వ్యాఖ్యలవి. కరోనా అనంతర పరిస్థితుల్లో కొత్త సభ్య రాజ్యాలతో కొలువుదీరే సంకీర్ణం అమెరికా, చైనాలకూ దిశానిర్దేశం చేసి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందిస్తున్నది ఆయన అభిప్రాయం. 1930ల్లో మహా మాంద్యం ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ తరవాత తిరిగి 2008లో ‘సబ్‌ ప్రైమ్‌’ సంక్షోభం మాంద్యానికి అంటుకట్టింది. పన్నెండేళ్ల క్రితం తలెత్తిన ఆ మాంద్యం దేశాల మధ్య సంకీర్ణ సంబంధాలను ఒక్క పెట్టున మార్చేసింది. ప్రపంచ ఆర్థిక దౌత్యానికి అప్పటివరకూ ఆధారశిలగా కొనసాగిన జి-8 కూటమి ప్రాధాన్యం జి-20 రాకతో మలిగిపోయింది. చైనాలాంటి దేశాలు ఆసియా మౌలిక సౌకర్యాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) వంటి వ్యవస్థలకు భారీగా నిధులు అందజేశాయి. గడచిన దశాబ్దంలో దాని ప్రాధాన్యం శాఖోపశాఖలుగా విస్తరించింది. దేశాలు ఒకదానిమీద మరొకటి ఆధారపడకపోతే వాటికి మనుగడ లేదన్న విషయాన్ని కొవిడ్‌ నేపథ్యంలో తలెత్తిన పరిణామాలు మరోమారు చాటిచెబుతున్నాయి.
దక్షతకు పరీక్ష
   సంక్షోభం కారణంగా అందివచ్చిన అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకుని- ప్రపంచ సంకీర్ణానికి నాయకత్వం వహించగలదా అన్నది ప్రశ్న. భారత తయారీ రంగం అనేక సవాళ్ల మధ్య ప్రస్థానిస్తోంది. పరిమిత విస్తృతి, నాణ్యత లేమి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనకబాటు వంటి సమస్యలు భారతీయ ఉత్పత్తి రంగాన్ని ఐరోపా, అమెరికాలతో పోల్చినప్పుడు దిగనాసిగా తేల్చేస్తున్నాయి. వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యం చైనా ప్రతిష్ఠను దారుణంగా దిగజార్చింది. కాబట్టి, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ప్రత్యామ్నాయ ఆలోచనలతో ముందుకు రావడం ఖాయం. ప్రపంచ కార్ఖానాగా పేరొందిన చైనాతో అమెరికా, ఐరోపాల్లోని బడా సంస్థలు ఉన్నపళంగా సంబంధాలు తెగతెంపులు చేసుకునే అవకాశాలు లేవు. ఆయా కంపెనీలు ప్రత్యామ్నాయాలను అన్వేషించి తమ కార్యకలాపాలను ఒకవైపు చైనాలో కొనసాగిస్తూనే మరోవంక వియత్నాం, మలేసియా, ఫిలిప్పైన్స్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాలకు విస్తరించే అవకాశాలు కొట్టిపారేయలేనివి. ఇక్కడే భారత్‌ కొత్త అవకాశాలు ఒడిసిపట్టాల్సి ఉంది. చైనానుంచి తరలిపోవాల్సి వస్తే బహుళ జాతి కంపెనీలు ఆ స్థాయి మార్కెట్‌, విస్తృతి ఉన్న భారత్‌ వంటి దేశాలవైపే మొగ్గుచూపుతాయి. బహుళజాతి కంపెనీలకు ఆహ్వానం పలికి, వాటి కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వాలు కల్పించబోయే వెసలుబాట్లే అంతర్జాతీయ వాణిజ్య వేదికపై భారత్‌ స్థానాన్ని నిర్దేశించనున్నాయి. మోదీ ప్రభుత్వ దక్షతకు ఇది పరీక్ష.
   కరోనా మహమ్మారి విరుచుకుపడిన నేపథ్యంలో దాన్ని సమర్థంగా కట్టడి చేసేందుకు దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ- ‘సార్క్‌’, జి-20 వేదికలపై ఆ మేరకు బలంగా గళం వినిపించడం గమనించాల్సిన అంశం. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కోసం ఒక దశలో అమెరికా బెదిరింపులకు దిగినా- భారత్‌ సంయమనం కోల్పోకుండా సమస్యకు సానుకూల పరిష్కారాన్ని కనుగొంది. మందులు ఇవ్వబోమని మొండిగా చెప్పడంవల్ల భారత్‌పట్ల ప్రపంచ దృక్పథం మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి, దేశీయ అవసరాలకు సమృద్ధిగా మందులు అట్టిపెట్టుకొని మిగిలిన నిల్వను ఇతర దేశాలతో పంచుకోవడం సరైన వ్యూహమే. 2004లో సునామీ విరుచుకుపడి కల్లోలం సృష్టించిన నేపథ్యంలోనూ- భారత్‌ ముప్పునుంచి త్వరగా బయటపడి మనతో పోలిస్తే దారుణంగా దెబ్బతిన్న ఇరుగుపొరుగు దేశాలకు చురుగ్గా మానవీయ సాయం అందించింది. అప్పట్లో ప్రపంచ దేశాలు ఇవ్వజూపిన విరాళాలనూ సున్నితంగా తిరస్కరించిన భారత్‌- ఆ సాయాన్ని కోలుకోలేని స్థాయిలో దెబ్బతిని, కుములుతున్న చిన్న దేశాలకు అందించాలని సూచించింది. సంక్షోభం ఉరిమినప్పుడు దాన్ని ఎదుర్కోగల స్వావలంబన స్థాయికి భారత్‌ చేరుకొందని నిరూపించే ఉదంతాలివి. ప్రపంచవ్యాప్తంగా యెమెన్‌ సహా వివిధ దేశాల్లో విపత్తులు సంభవించినప్పుడు భారత్‌ భేషుగ్గా స్పందించి వాటికి ఉదారంగా సాయం చేసింది. ఫ్రాన్స్‌తో అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటు విషయంలోనూ మనదేశం చక్కటి చొరవ కనబరిచింది.

అవకాశాలను ఒడిసిపట్టాలి
   కరోనా అనంతరం చైనా విశ్వసనీయత సన్నగిల్లుతుంది. ఆసియా లేదా ప్రపంచానికి నాయకత్వ శక్తిగా ఎదిగేందుకు ‘బీజింగ్‌’ చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం వాటిల్లుతుంది. రెట్టించిన నిబద్ధతతో ఆచరణాత్మకంగా అడుగులు వేస్తూ సంకీర్ణ ప్రత్యామ్నాయ నాయకత్వ పగ్గాలకోసం భారత్‌ ప్రయత్నించాల్సి ఉంటుంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరి ఆ ప్రభావం భారత్‌పైనా పడే అవకాశాలున్నాయి. మరోవంక భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కూడిన చతుర్భుజ కూటమి ఏర్పాటు యత్నాలూ ముమ్మరించవచ్చు. కృత్రిమ మేధ (ఏఐ)పై పెట్టుబడులు పెంచి, డిజిటల్‌ సాంకేతికతను గుణాత్మకంగా విస్తరించడం ద్వారా- భారత్‌ వివిధ దేశాలతో ద్వైపాక్షిక, ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంపై శ్రద్ధపెట్టాలి. జీవ వైద్య, జీవ సాంకేతిక రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమివ్వాలి. భారత్‌-చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఏడో దశాబ్దంలో అడుగుపెడుతున్న సందర్భమిది. కరోనా అనంతరం మొదలవబోయే అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో ఇరు దేశాలు వేయబోయే ఎత్తులు, పైయెత్తులు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. అమెరికా-చైనాలు అతిపెద్ద శత్రువులుగా ఆవిర్భవించిన నేపథ్యంలో- భారత్‌ పోషించబోయే పాత్ర అత్యంత కీలకం కాబోతోంది.
 

- స్మితా శర్మ
(రచయిత్రి- ప్రముఖ పాత్రికేయురాలు)

Posted Date: 13-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం