• facebook
  • whatsapp
  • telegram

కాలుదువ్వుతున్న చైనా

* అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా దూకుడు

   సరిహద్దుల్లో తరచూ ఘర్షణలకు దిగడం ద్వారా కంటిమీద కునుకు లేకుండా చేసి, భారత్‌ను అస్థిర పరచాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అధికార దాహంతో తపించిపోతున్న డ్రాగన్‌ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సైనిక రంగాల్లో దుందుడుగ్గా ప్రవర్తిస్తోంది. లద్దాఖ్‌ సెక్టార్‌లో భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి గొడవపడే విషయంలో చైనాకు కరోనా మహమ్మారి సమస్యా అడ్డంకి కావడం లేదు. చైనా సకాలంలో స్పందించి, విదేశాలకు వెళ్లే విమానాలను గత ఏడాది డిసెంబరు నుంచే నిలిపివేసి ఉంటే, ప్రాణాంతక వైరస్‌ కార్చిచ్చులా వ్యాపించి ఉండేది కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజారోగ్య వ్యవస్థలు విఫలమయ్యేవీ కావు.
దుందుడుకు దౌత్య వ్యూహం
   చైనా ఎందుకు భారత్‌ను అస్థిర పరచాలనుకుంటోందనేది పెద్ద ప్రశ్నే. ఎందుకంటే, ఈసారి భారత్‌ తన ఆర్థిక, రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించాలని నిర్ణయించుకుంది. ఇటీవల ప్రకటించిన కొత్త విధాన నిర్ణయాల ప్రకారం భారత్‌ విదేశీ మూలధనాన్ని ఆకర్షించడంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. చైనా నుంచి బయటికి వెళ్లాలని భావిస్తున్న సంస్థల్ని తీసుకురావాలని భావిస్తోంది. అమెరికా కంపెనీలన్నీ చైనాను వీడాలని ఆ దేశధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో- ప్రపంచ సరఫరా గొలుసు వ్యవస్థలన్నింటికీ భారీ హబ్‌లా అవతరించే అవకాశాలపై భారత్‌ ఆశలు పెట్టుకుంది. అయితే భారత్‌, చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులు మాత్రం పెట్టుబడిదారుల మెదళ్లలో అపనమ్మకాన్ని సృష్టిస్తున్నాయి. ఇలా భారత్‌ను అస్థిర పరచడం ద్వారా తన విలువైన శక్తిని, వనరుల్ని సరిహద్దుల రక్షణకే వెచ్చించేలా ఒత్తిడి పెంచాలనే వ్యూహాన్ని చైనా అమలు చేస్తోంది. తన ఆర్థిక, సైనిక శక్తిని ఉపయోగిస్తూ ప్రతి ఒక్కరూ తలొగ్గి ఉండేలా చైనా దుందుడుకు దౌత్య వ్యూహాన్ని పాటిస్తోంది.
   కరోనా వైరస్‌ పుట్టుక, చైనా వ్యవహారం వంటి అంశాలపై దర్యాప్తు చేపట్టాలని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ ఇటీవల పిలుపిచ్చారు. కాన్‌బెరాలోని చైనా రాయబారి వెంటనే స్పందిస్తూ, ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటామని బహిరంగంగానే హెచ్చరికలు చేశారు. అంతకుముందు, వివాదాస్పద హావేయ్‌ 5జీ ఉపకరణాల్ని భద్రతపరమైన కారణాలతో నిషేధించాలని జర్మనీ భావించగా, ఆ దేశ కార్ల దిగుమతుల్ని నిలిపివేస్తామంటూ అక్కడి చైనా రాయబారి హెచ్చరించారు. ఆ 5జీ ఉపకరణాల్ని అమెరికా అంతకుముందే నిషేధించి, ఇతర దేశాలూ అదేబాటలో నడవాలంటూ ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. చైనాలో మానవ హక్కుల్ని హరిస్తున్నారంటూ స్వీడన్‌ ఆందోళన వ్యక్తం చేయగా, చైనా రాయబారి స్పందిస్తూ, శత్రువుల కోసం తమవద్ద షాట్‌గన్స్‌ ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల విషయంలో పలు దేశాలతో డ్రాగన్‌ ప్రవర్తన తీరు ప్రపంచానికంతా తెలిసిన సంగతే.

పక్కదారి పట్టించే యత్నం
   ప్రచ్ఛన్నయుద్ధం పతాక స్థాయిలో ఉన్నప్పుడు సైతం నాటి రెండు అగ్రరాజ్యాల్లోనూ ఈ తరహా దౌర్జన్యపూరిత ప్రవర్తనను చూడలేదు. తనకున్న సైనిక ఆధిపత్యం, ఆర్థిక శక్తి ఈ ప్రాంతంలోని ప్రతి దేశాన్నీ శాసించే శక్తిని తనకు ప్రసాదించాయని చైనా భావిస్తోంది. ఈ దృక్కోణం నుంచి చూసినప్పుడు భారత్‌ చైనాల మధ్య ఇటీవలి సరిహద్దు ఘర్షణలకు కారణం... అస్పష్టంగా ఉన్న సరిహద్దు రేఖలపై అపోహలు కాదని, మరేదో ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ కొత్త భౌగోళిక పటాన్ని ప్రచురించడం ద్వారా భారత్‌తో సరిహద్దు వివాదానికి తెరతీయడం వంటి ఉదంతాలు సైతం భారత్‌ను తన వాస్తవిక లక్ష్యాల నుంచి దృష్టి మరల్చే యత్నాలుగా అనుమానించాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థను వృద్ధి దిశగా నడిపించడం, 130 కోట్ల మందికి సరైన సంక్షేమాన్ని అందించడం, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండటం వంటి లక్ష్యాల సాధన దిశగా సాగుతున్న భారత్‌ను పక్కదారి పట్టించేందుకు చైనా యత్నిస్తోంది. నేపాల్‌ ప్రధాని ఓలీ తన బాధ్యతల్ని కాఠ్‌మాండూలోని చైనా రాయబారికి అప్పగించేసి ఓ కీలుబొమ్మలా మారిపోయారు. భారత్‌, చైనా సరిహద్దు ఘర్షణలు కలత పెట్టే ప్రవర్తనగా అమెరికా పేర్కొనగా, ఆ వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమంటూ చైనా విదేశాంగ శాఖ కొట్టిపారేసింది.
   చైనా ఏకపార్టీ నియంతృత్వ వ్యవస్థ అనే లోపంతో సతమతమవుతోంది. అదేసమయంలో... భారత్‌ తన పొరుగునున్న చిన్నాచితకా దేశాలు ఎన్ని దుష్ట పన్నాగాలు పన్నుతున్నా తట్టుకుంటూ శాంతియుత, ప్రజాస్వామిక దేశంగా నిలుస్తోంది. హాంకాంగ్‌ను 2047 వరకు స్వయంప్రతిపత్తితో కొనసాగిస్తామంటూ హామీ ఇచ్చి- తాజాగా అన్ని ప్రజాస్వామిక స్వేచ్ఛలను కొల్లగొట్టడానికి ఉద్దేశించిన కొత్త భద్రతా చట్టాన్ని చైనా తీసుకొచ్చింది. ఈ క్రమంలో డ్రాగన్‌ ప్రపంచ శాంతిభద్రతలకు ఓ ముప్పులా పరిణమించకుండా చూసేందుకు ప్రపంచమంతా చేతులు కలపాల్సిన అవసరం ఉంది.


 

Posted Date: 13-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం