• facebook
  • whatsapp
  • telegram

  అధిక నిధులతోనే సాగు బాగు

* పద్దుల్లో కేటాయింపులూ వ్యయం కాని వైనం 

వ్యవసాయాభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్న తీరుకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేకుండా పోయింది. తాజా బడ్జెట్‌లో 30శాతందాకా నిధులు పెంచినట్లు ప్రకటించారు. కానీ, అందులో 55.80శాతం నిధులు కేవలం ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’(పీఎం కిసాన్‌) పథకానికే కేటాయించారు. పంట రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ, పంటల బీమా పథకం కూడా కలిపితే ఈ మూడింటికే మొత్తం బడ్జెట్‌లో 83.23 శాతం నిధులు దక్కాయి. వాస్తవానికి ఈ మూడు పథకాల్లో ఏ ఒక్కటీ రైతాంగంలో సగంమందికీ చేరడం లేదు. కొన్ని పథకాలైతే కేవలం నాలుగోవంతు రైతులకే దక్కుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. 2014లో అధికారంలోకి రాగానే 2022కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. లక్ష్యసాధన గడువుకు మరో రెండేళ్లే మిగిలింది. ఇప్పటికీ ఆదాయం పెరిగిన దాఖలాలు కనిపించడం లేదు. దేశంలో రైతుల ఆదాయం పెంపునకు పలు భారీ పథకాలు ప్రవేశపెట్టినట్లు కేంద్రం తాజాగా పార్లమెంటులో ప్రకటించింది. ఈ పథకాలను పలు రాష్ట్రాల్లో సక్రమంగా అమలు చేయడం లేదు. అమలు చేసే చోట సైతం ప్రభుత్వాల మాటలకు, వాస్తవిక పరిస్థితికి చాలా తేడా ఉంటోంది.

విధానాల్లో లోపం
వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో వ్యవసాయ రంగానికి రూ.1.34 లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. ఇందులో పీఎం కిసాన్‌, పంట రుణాలపై వడ్డీ రాయితీ, పంటల బీమాకు కలిపి మొత్తం రూ.1,11,870 కోట్లు కేటాయించారు. ఇందులో పీఎంకిసాన్‌ పథకానికి రూ.75 వేల కోట్లు దక్కాయి. వాస్తవానికి ఈ పథకంలో కేవలం 30 శాతంలోపు రైతులకే లబ్ధి చేకూరినట్లు తేలింది. పేద రైతులున్న పశ్చిమ్‌ బంగ వంటి రాష్ట్రాలు దీన్ని సరిగ్గా అమలు చేయడం లేదు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ.54,370 కోట్లే ఖర్చయినట్లు తేలింది. ఇందులో మిగిలిన రూ.20,630 కోట్లు మిగతా వ్యవసాయాభివృద్ధి పథకాలకూ మళ్లించలేదు. రాష్ట్రాల నిర్లక్ష్యంతో నిధులు మిగిలిపోగా, మరికొన్ని పథకాల్లో కేంద్రం సక్రమంగా విడుదల చేయలేదు. ఉదాహరణకు వ్యవసాయాభివృద్ధికి రాష్ట్రాలకు గ్రాంటు రూపంలో ఈ ఏడాదికి రూ.12,842 కోట్లు గత బడ్జెట్‌లో కేటాయించారు. కానీ, అందులో రూ.3,800 కోట్లు ఇవ్వలేదంటూ అనంతరం ప్రకటించారు. ఇలాంటి కోతల కారణంగా ఈ ఏడాది వ్యవసాయ రంగానికి కేటాయించిన మొత్తం రూ.1.30 లక్షల కోట్లలో చివరికి రూ.28,546 కోట్లు మిగిలిపోయాయి. వీటిని కనీసం రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ఇచ్చినా ఏదోఒక రూపంలో రైతులకు అందేవి. వ్యవసాయ బడ్జెట్‌ పేరిట రైతులకు ఉదారంగా నిధులు బ్యాంకులో జమచేసే పథకాలకే ఎక్కువ కేటాయింపులు చేస్తూ, వాస్తవంగా పంటలపై పరిశోధనలకు, దిగుబడుల పెంపునకు సంబంధించిన వాటిని తగ్గించేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రివాజుగా మారింది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రానికి గత రెండేళ్లలో కేంద్రం అమలు చేసే వ్యవసాయాభివృద్ధి పథకాలకు సంబంధించి రూ.వెయ్యి కోట్లను విడుదల చేయలేదు. కేంద్రం నుంచి రానందువల్లే రైతులకు ఇవ్వడం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ చెబుతోంది. కానీ, ఆయా పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా కలిపి ఇవ్వాల్సినవి విడుదల చేయనందువల్లే నిధుల విడుదల జరగలేదని కేంద్రం వాదిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనల నడుమ రైతులు నష్టపోతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఏటా రూ.వేల కోట్లు రైతులకు బడ్జెట్‌ కాగితాల్లోనే తప్ప వాస్తవానికి ఇవ్వడమే లేదు. వచ్చే ఏడాది అదనంగా 37.50 లక్షల ఎకరాల్లో రైతులను ఇతర పంటల నుంచి ఆహార ధాన్యాలు సాగుచేసేలా మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల 44 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా పండించడం సాధ్యమవుతుందని అంచనా. హెక్టారుకు 27 క్వింటాళ్ల చొప్పున బియ్యం ఉత్పాదకత సాధించాలనే లక్ష్యాన్ని కూడా కేంద్ర బడ్జెట్‌లో తాజాగా ప్రకటించారు. ఈ ఏడాదే తెలంగాణలో సగటు 34 క్వింటాళ్లకు పైగా ఉత్పాదకత వచ్చింది. కేంద్రం నిర్ణయించిన లక్ష్యం అంతకన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ఎరువులపై ఇచ్చే రాయితీని రూ.79,998 కోట్ల నుంచి రూ.71,309 కోట్లకు తగ్గించారు. ఎరువుల్లో యూరియాకు ఇచ్చే రాయితీ 67 శాతానికి పైగా ఉంటోంది. యూరియా ధరల నియంత్రణ ఒక్కటే కేంద్రం చేతిలో ఉంది. మిగతా ఎరువుల ధరలను నిర్ణయించే అధికారం వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలకే ఉన్నందు వల్ల వాటికిచ్చే రాయితీ తక్కువగా కేటాయిస్తోంది.

బడ్జెట్‌ కేటాయింపులో పీఎం కిసాన్‌ తరవాత అత్యధిక నిధులు కేటాయించిన రెండో పథకం వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ. రైతులు బ్యాంకుల నుంచి తీసుకుంటున్న పంట రుణాలపై మూడు శాతం వడ్డీని కేంద్రం భరిస్తోంది. రైతు పంటరుణం తీసుకున్న తేదీ నుంచి సరిగ్గా ఏడాదిలోగా తిరిగి బ్యాంకుకు చెల్లిస్తే, వడ్డీలో మూడు శాతాన్ని కేంద్రం తరపున రిజర్వుబ్యాంకు విడుదల చేస్తుంది. ఈ మూడు శాతం రాయితీ సొమ్ము చెల్లించేందుకు ఈ ఏడాది రూ.17,863.43 కోట్లను ఇవ్వగా వచ్చే ఏడాది రూ.21,175 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. వచ్చే ఏడాది రూ.15 లక్షల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టినందున వడ్డీ రాయితీ కూడా పెరుగుతుందని కేంద్రం నిధులు పెంచింది. కానీ, మొత్తం రైతుల్లో మూడో వంతు మందికి పంట రుణాలే అందడం లేదు. కౌలుకు సేద్యం చేసే వారిలో కనీసం పది శాతానికీ బ్యాంకులు రుణాలివ్వడం లేదు. సేద్యం చేయకుండా ఇతర వ్యాపకాల్లో భూముల యజమానులు తీసుకునే వ్యవసాయ రుణాలకు సైతం ఈ రాయితీ మళ్లుతోంది. కేంద్ర బడ్జెట్‌లో అత్యధిక ం4నిధులు దక్కిన మూడో అతిపెద్ద పథకం ప్రధానమంత్రి పంటల బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై). దీనికి రూ.15,695 కోట్లు కేటాయించారు. సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్య పెరగాలని సూచిస్తూనే బడ్జెట్‌లో కేటాయింపులు పరిమితంగానే పెంచింది. గతేడాది(2018-19)లో మొత్తం 5.64 కోట్ల మంది రైతులు పంటలకు బీమా చేయించగా వీరిలో 28 శాతం మందికే పరిహారం అందింది.

ప్రతి రైతుకూ ప్రయోజనం
వ్యవసాయ విద్య, పరిశోధనలకు నిధుల కేటాయింపులు స్వల్పంగా పెంచారు. సాగునీటిని పొదుపుగా వాడి పంటల దిగుబడి పెంచేందుకు ‘బిందుసేద్యం’ పథకం కింద రూ.4 వేల కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ ఏడాది రూ.2,032 కోట్లే ఇవ్వగా వచ్చే ఏడాదికి దాదాపు 100 శాతం అదనంగా పెంచింది. తెలంగాణలో బిందుసేద్యం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులేమీ రాకపోవడంతో ఈ ఏడాది నిలిచిపోయింది. కేంద్రం ఇచ్చే నిధులు వాడుకోవాలంటే రాష్ట్రం వాటాగా 40 శాతం అదనంగా కలిపి ఇవ్వాలి. అయితే, రాష్ట్రాలు తమ వాటాను ఇవ్వకపోతే కేంద్రం ఇచ్చిన కేటాయింపులు మిగుల్చుకునే ప్రస్తుత విధానానికి స్వస్తి పలకాలి. రాష్ట్రంతో ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో వేసే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు, నిధుల కొరత ఎదుర్కొంటున్న కొన్ని రాష్ట్రాల్లో పలు కేంద్ర పథకాల నిధులు రైతులకు అందడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి కేంద్రం తక్షణం ప్రత్యామ్నాయ మార్గం చూపాలి. రాష్ట్రాల చొరవ లేదని రైతులకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం మిగుల్చుకోవడం సరికాదు. వచ్చే ఏడాది 23.34 లక్షల మంది రైతులకు పంటల సాగులో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామీణ యువతకు తప్పనిసరిగా అవకాశం కల్పించాలి. కూలీల కొరత సమస్యను తీర్చడానికి దేశవ్యాప్తంగా 6,500 ‘వ్యవసాయ యంత్రాల సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇవే కాకుండా మరో వెయ్యి ‘హైటెక్‌ హబ్‌’ల పేరుతో వ్యవసాయ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. 37.50 లక్షల ఎకరాలకు సరిపోయే యంత్రాలను రాయితీలపై అందజేసేందుకు నిధులు సిద్ధం చేశారు. ఇవి రైతులకు అందుతాయా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణపై ఆధారపడి ఉంటుంది.


దిగుబడులే ధ్యేయం కావాలి
దేశంలో గత నాలుగేళ్లుగా ఆహార ధాన్యాల దిగుబడులు పెరుగుతున్నా తలసరి లభ్యత పెరగడం లేదు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా పంటల దిగుబడులు పెంచే పథకాలకు ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన అవసరముంది. పొలాల్లోనే వర్షపు నీటి నిల్వకు పెద్ద గుంతలు నిర్మించడం, వాగులు, వంకల్లో అడ్డుకట్టల నిర్మాణం తదితర పనుల ద్వారా వాననీటిని నిలువరించడం వంటి పనులకు రాయితీలు ఇవ్వాలని బడ్జెట్‌లో సంకల్పించడం మంచి పరిణామం. ఇలా కొత్త సాగునీటి వనరులను సృష్టించడం ద్వారా అదనంగా 75 వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయలు వంటి ఉద్యాన పంటల సాగును పెంచాలని నిర్ణయించారు. దీనిద్వారా అదనంగా మరో లక్షా 30 వేల టన్నుల ఉద్యాన పంటల దిగుబడి సాధించాలనేది లక్ష్యం. ఉద్యాన తోటల సాగుకు అవసరమైన నారు కోసం కొత్తగా వంద చోట్ల నర్సరీలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వీటిలో 26 లక్షల మొక్కలు పెంచి ఉద్యాన పంటల సాగుకు రైతులకు అందించాలి.

- మంగమూరి శ్రీనివాస్‌

Posted Date: 27-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం