• facebook
  • whatsapp
  • telegram

  సాగుకూ వైరస్‌ ‘తెగులు’

* విత్తన సరఫరాపై ఆంక్షలు వద్దు

    ప్రాణాంతకమైన సార్స్‌ సీఓవీ-2 వైరస్‌ ముట్టడితో మానవాళి భయం గుప్పిట్లో చిక్కుకుంది. కొవిడ్‌-19 జబ్బు పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రబలుతున్న తరుణంలో పదిమందిలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా అందరూ అనుమానస్పదంగా చూస్తున్నారు. ఇతర ప్రభుత్వాల మాదిరిగానే భారత ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మహమ్మారిని అరికట్టేందుకు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. కానీ, ముప్పు మన చుట్టూ పొంచి ఉంది. చైనా వంటి ఆర్థిక శక్తి ఈ వ్యాధికి బలవగా, ఇరాన్‌ అతలాకుతలమవుతోంది. కొవిడ్‌-19 తమను గట్టి దెబ్బ కొట్టకముందే భారత్‌తోపాటు, సార్క్‌ దేశాలు పూర్తి శక్తితో సంసిద్ధమయ్యాయి. కొవిడ్‌-19 భయం భారత్‌తోపాటు, ప్రపంచాన్ని కమ్మేసింది. అయితే, ప్రస్తుతం ప్రపంచానికి కరోనా వైరస్‌కన్నా, దానికి సంబంధించిన భయమే పెద్ద ముప్పు కలిగించేదిగా ఉంది. నల్లబజార్లు ఇప్పటికే మాస్కులు, సబ్బులు, కీటకనాశినులు తదితర కొత్తరకం సరకుల్ని చెలామణీలోకి తీసుకొచ్చాయి.

    మానవాళి మనుగడకు వ్యవసాయమే కీలక ఆధారం. ప్రస్తుతం చాలా వరకు మన వ్యవసాయం నాణ్యమైన విత్తనాలపై, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘటిత విత్తన రంగంపై ఆధారపడి ఉంది. మానవ వనరులు, వ్యవసాయ కూలీల లభ్యత, విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ సంబంధ వస్తువులు స్వేచ్ఛగా తరలడంపై ఆహార ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఐరోపా సమాఖ్య తరహాలోనే అమెరికా సైతం తన సరిహద్దుల్ని మూసేసుకుంది. ప్రస్తుతం ప్రపంచమంతా వీసాల్ని రద్దు చేసి, ప్రజల ప్రయాణాలపై ఆంక్షల్ని విధిస్తోంది. పలు దేశాల్లో ప్రజలు బయటికొచ్చేందుకు భయపడుతున్నారు. జనసమ్మర్దంగా ఉండే ప్రదేశాల వైపే వెళ్లడం లేదు. వియత్నాం నుంచి ఇటలీ దాకా విద్యాసంస్థల్ని మూసేశారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే వ్యవసాయ కూలీల అందుబాటు తక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో వ్యవసాయ కూలీల వేతనాలూ పెరిగే అవకాశం ఉంది. ఆహార పదార్థాల ఉత్పత్తి వ్యయాలు పెరగనున్నాయి. కోళ్ల రంగంలో ముప్పు మరింత అధికంగా ఉంది. కోడిమాంసం ధరలు దారుణంగా పడిపోయాయి. భయాందోళనలు పెరిగిన కారణంగా కోళ్ల ఫారాల్లో పని చేసేందుకు శ్రామికులు తిరస్కరిస్తున్నారు.

    ప్రపంచ విత్తన రంగం సరఫరా వ్యవస్థ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్క దేశానికీ విత్తనాల విషయంలో సార్వభౌమత్వం లేదు. ఓడరేవుల్ని, విత్తనాల రవాణాను నిలిపి వేయడం వల్ల ఈ ఏడాదిలో వ్యవసాయ ఉత్పాదకతపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి, ఏప్రిల్‌ నెలలు విత్తనాలు వేసేందుకు అనువైనవి. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌, గోధుమ, బార్లీ, కూరగాయలు వంటివి ఈ సీజన్‌లోనే వేస్తారు. భారత్‌లో సైతం పంటల కాలం మొదలు కానుంది. విత్తనాలు లేకపోవడం, ఆలస్యంగా అందుబాటులోకి రావడం వంటి కారణాలతో రైతులు విత్తడంలో ఆలస్యం చేస్తే ఈ ఏడాది తదనంతర కాలంలో తీవ్రస్థాయిలో ఆహార కొరతతోపాటు, ఆహార ధరల ద్రవ్యోల్బణం సంభవించే అవకాశం ఉంది.

ఐరోపా ఆహార సురక్షిత ప్రాధికార సంస్థ (ఈఎఫ్‌ఎస్‌ఏ), వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) తదితర సంస్థల ప్రకటనల్ని ప్రస్తావిస్తూ ఇటీవల అంతర్జాతీయ విత్తన సమాఖ్య (ఐఎస్‌ఎఫ్‌) చేసిన ప్రకటన ప్రకారం- వైరస్‌ వ్యాప్తికి ఆహార పదార్థాలు లేదా విత్తనాలు కారణమవుతాయని చెప్పేందుకు ఇప్పటికైతే ఆధారాలు లేవని పేర్కొంది. అందుకని విత్తనాల విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ప్రస్తుత సమయంలో అందరూ ధైర్యాన్ని సమకూర్చుకోవాలి. పూర్తిస్థాయిలో సమాచారం పొందుతూ అవగాహన పెంపొందించుకోవాలి. శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే కొవిడ్‌-19ని సమర్థంగా ఎదుర్కోవచ్ఛు ఈ వైరస్‌ మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మన వ్యవసాయ రంగానికీ ముప్పులా పరిణమించింది. అందుకని, కేంద్ర సర్కారుతోపాటు, ప్రపంచంలోని ఇతర ప్రభుత్వాలు విత్తనాలు సహా వ్యవసాయ ఉత్పత్తులపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. విత్తనాల రవాణాకు సంబంధించిన రంగంలో పనిచేసే శ్రామికుల ఆరోగ్యం, క్షేమానికి సంబంధించిన బాధ్యతల్ని విత్తన కంపెనీలు, ఎగుమతి దారులు తలకెత్తుకోవాలి. సరకు రవాణా, శ్రామికుల పరీక్షల కార్యకలాపాలకు సంబంధించి ఓడరేవుల అధికారులు రాబోయే కాలంలో తీవ్రస్థాయిలో శ్రమించాల్సి ఉన్న నేపథ్యంలో వారికి సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. వైరస్‌ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెలువరించిన సూచనలకు ప్రచారం కల్పించాల్సి ఉంది. వైరస్‌ల వ్యాప్తిలో విత్తనాల రవాణా ద్వారా సంభవించే ముప్పు చాలా తక్కువ. అందుకని వీటి రవాణాను ఆపకూడదు. ఆలస్యమూ చేయరాదు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రపంచమంతా ముందుకొచ్చి కరోనా వైరస్‌పై మాత్రమే కాకుండా, దానికి సంబంధించిన భయంపైనా పోరాటం సాగించాలి.

- ఇంద్రశేఖర్‌ సింగ్‌
(రచయిత- భారత జాతీయ విత్తన సంఘం సంచాలకులు)

Posted Date: 25-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం