• facebook
  • whatsapp
  • telegram

  సాగునీరు వృథా... వ్యవసాయం వ్యధ

* అధునాతన విధానాలతోనే ఆదా

    వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు అవసరమైన విద్యుత్‌ సరఫరాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీల వ్యయం అక్షరాలా లక్ష కోట్ల రూపాయలకు చేరింది. దేశంలో సాగునీటిని పొదుపుగా వాడేందుకు గట్టి ప్రయత్నాలేవీ జరగకపోవడంతో నీరే కాకుండా అనేక విలువైన వనరులూ హరించుకుపోతున్నాయి. పెరుగుతున్న దేశ జనాభాకు ఆహార భద్రత కల్పించడానికి పంటల సాగు, దిగుబడులు, ఉత్పాదకత పెంపు తథ్యం. నీటి సరఫరాకు ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనమైనా అలవోకగా ధారపోస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వనరుల నుంచి సాగునీటిని ఆధునాతన విధానాల ద్వారా సరఫరా చేస్తే 30 శాతం ఆదా అవుతుంది. ఇలా ఆదా అయ్యే నీటినే ఇతర పంటలకు అదనంగా వాడుకోవచ్చు. అవసరానికి మించి నీటిని వాడటం వల్ల అనేక అనర్థాలు తప్పడం లేదు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో సాగునీటి పొదుపుపై చర్చలే కాకుండా కార్యాచరణా చాలా అవసరం.


పొదుపుపై అవగాహనేదీ?
    మనదేశంలో పంటల సాగుకు నీరు ఎక్కువగా వృథా అవుతోంది. నీటి పంపిణీ వ్యవస్థలు సక్రమంగా లేకపోవడం, పొదుపుగా వాడే పరిజ్ఞానం కొరవడటంతోపాటు పురాతన పద్ధతులనే పాటిస్తూ ఉండటం ఇందుకు ప్రధాన కారణాలు. అతి తక్కువ నీటివనరులతో ఇజ్రాయెల్‌లో అద్భుత పంట దిగుబడులు సాధిస్తూ పండ్లు, కూరగాయలను ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మనదేశంలో మొత్తం 36 రకాల వాతావరణ ప్రాంతాలున్నాయి. ప్రాంతాలను బట్టి కిలో వరి ధాన్యం పండించడానికి గరిష్ఠంగా 5,263 లీటర్ల నీటిని కొన్ని రాష్ట్రాల్లో వరదలా పారిస్తున్నారు. భారతదేశ జాతీయ సగటు వినియోగం 3,032 లీటర్లు. చైనాలో వాడే సగటు 1,321 లీటర్లకన్నా మనదేశంలో కొన్ని ప్రాంతాల రైతులు 298 శాతం అధికంగా వాడుతున్నారు. ఆఖరికి ప్రపంచ సగటు నీటి వినియోగం 2,300 లీటర్లతో పోల్చినా- మనదేశ రైతులు 128 శాతం దాకా అధికంగా వాడుతున్నారు. ఇజ్రాయెల్‌లో వార్షిక సగటు వర్షపాతం 145 మిల్లీమీటర్లు(మి.మీ.). మనదేశంలో 650 మి.మీ.లు. గత జూన్‌-సెప్టెంబరు మధ్య 968 మి.మీ.లు వర్షపాతం నమోదైంది. ఇంత భారీ వర్షాలు కురుస్తున్నా కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులతో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి. అపార జలవనరులున్నా పొదుపుగా వాడుకునే విధానాల కొరత అధికంగా ఉంది. తక్కువ నీటి వినియోగంతో అధిక పంటల సాగు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కృషి సించయి యోజన’(పీఎమ్‌కేఎస్‌వై) పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకాన్ని రాష్ట్రాలు సరిగ్గా వాడుకోక పోవడంవల్ల వేల కోట్ల రూపాయల నిధులు మిగిలిపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ఈ పథకానికి రూ.9,682 కోట్లు కేటాయిస్తే అందులో రూ.7,896 కోట్లే వినియోగించినట్లు కేంద్రం తాజా బడ్జెట్లో వెల్లడించింది. ఈ పథకం సద్వినియోగం కావాలంటే వ్యయంలో 40శాతం రాష్ట్రాలు భరించాలి. కొన్ని రాష్ట్రాలు ముందుకు రాకపోవడంతో పథకం నీరుగారుతోంది. సాగునీటి పొదుపు కార్యక్రమాలకు కేంద్రం భారీగా నిధులు ఖర్చు చేస్తున్న ఏకైక పథకం ఇదొక్కటే. వచ్చే ఏడాదికి రూ.11,127 కోట్లు కేటాయించారు. ఒక్కో రైతు పొలంలో బిందు, తుంపర్ల సేద్యం పరికరాలు అమర్చుకుంటే సాధారణ పద్ధతుల్లోకన్నా 50శాతం తక్కువ నీటితో ఎక్కువ పంటను పండించడానికి ఎన్నో అధునాతన విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పలు దేశాలు అధిక దిగుబడులు సాధిస్తున్నాయి. ఉదాహరణకు బ్రెజిల్‌లో సాగునీటిని తుంపర్లుగా వెదజల్లే విధానంలో వరి పండిస్తూ హెక్టారుకు 60 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి సాధిస్తున్నారు. మనదేశంలో అంతకన్నా 70శాతం ఎక్కువ నీటిని వరదలా పారించే పొలాల్లో సైతం అంతకుమించి దిగుబడులు రావడంలేదు. వరి సాగు అధికంగా ఉన్న పంజాబ్‌లో కిలో ధాన్యం పండించడానికి అత్యధికంగా 5,263 లీటర్ల మేర నీటిని వాడుతున్నారు. బిందు, తుంపర్ల సేద్యంతో నీటిని పొదుపుగా పైర్లకు సరఫరా చేసే పరికరాలను పీఎమ్‌కేఎస్‌వైతో పాటు రాష్ట్రాల సొంత పథకాల కింద వందశాతం రాయితీలతో ఇస్తున్నారు. ఉదాహరణకు ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఒక రైతు పొలంలో బిందు లేదా తుంపర్ల సేద్యం పరికరాల ఏర్పాటుకు గరిష్ఠంగా రూ.5.16 లక్షలు, తెలంగాణలో రూ.4.49 లక్షలు, ఏపీలో రూ.4.00 లక్షలను రాయితీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఒక్క తెలంగాణలోనే గత 15 ఏళ్ల(2003-20)లో 18.16 లక్షల ఎకరాల్లో ఈ పరికరాల ఏర్పాటుకు ఇప్పటికే రూ.3,900 కోట్లను రైతులకు రాయితీల రూపంలో పంచిపెట్టారు. ఈ నిధుల వ్యయంతో పంట దిగుబడి పెరగడమే కాకుండా 30శాతం వరకూ నీటి ఆదా లక్ష్యాన్ని సాధించినట్లు ఉద్యానశాఖ అధ్యయనంలో గుర్తించారు. కొన్ని పంటల సాగులో నీటి ఆదా 50శాతం వరకూ ఉంది. దేశవ్యాప్తంగా 14.50కోట్ల మంది రైతుల భూములన్నింటికీ ఇదేతీరున ఏర్పాటుచేస్తే దేశవ్యాప్తంగా ఎంతో సాగునీరు ఆదా అవుతుంది. భారత్‌లో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరొందిన పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వరిసాగుకు అధికంగా నీటిని వాడుతుండగా బాగా వెనకబడిన బిహార్‌లో రైతులు చాలా తక్కువగా వినియోగిస్తున్నారు. వేల కోట్ల రూపాయలతో భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఏటా లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి కరెంటు ఇచ్చి విలువైన నీటిని అవసరానికి మించి పొలాలకు పారించడం వల్ల పంట దిగుబడులు పెరగవు.


సాంకేతికత రైతుకు చేరాలి
    చైనా, ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాల్లో భారత్‌కన్నా పంటల ఉత్పాదకత చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు నెదర్లాండ్స్‌లో ఎకరానికి 200 టన్నుల టమోటాలను ఏడాదిలో పండిస్తున్నారు. అదే ఎకరానికి అధికంగా సాగునీరు ఇచ్చినా అందులో సగం దిగుబడైనా మనరైతులకు దక్కడం లేదు. తెలంగాణలో బిందుసేద్యం విధానంలో నీరు అందిస్తే కిలో ధాన్యం పండించడానికి సగటున 1,118.8 లీటర్లు చాలని పరిశోధనల్లో తేలింది. సాధారణ పద్ధతిలో కాల్వల ద్వారా నీరు అందిస్తున్న రైతులు అదే కిలో ధాన్యం పండించడానికి 2,558 లీటర్లు వాడుతున్నట్లు జయశంకర్‌ వర్శిటీ అధ్యయనంలో గుర్తించారు. కేవలం అధునాతన పరిజ్ఞానం వాడకపోవడం వల్ల కిలో ధాన్యానికి వృథా చేస్తున్న నీరు 1,439 లీటర్లని గుర్తించారు. మనదేశంలో అనేక రంగాలకు రాయితీల రూపంలో ఏటా వేల కోట్ల రూపాయలు ధారపోస్తున్నారు. వాటిని మిగుల్చుకునే పరిజ్ఞానాన్ని రైతులకందించే కార్యక్రమాలకు నిధులు ఉండటం లేదు. ఆసియా ఖండంలో మరో అయిదేళ్లకల్లా 5.50కోట్ల ఎకరాల వరి పొలాలకు సాగునీటి కొరత తీవ్రంగా ఉంటుందని అంచనా. ఇప్పటికే 118 దేశాల్లో సాగవుతున్న వరి పంట వల్ల నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంది. 2050నాటికి ప్రపంచ ఆహార భద్రత కోసం ఇప్పటికన్నా మరో 70 శాతం అదనపు పంట దిగుబడులు పెరగాలి. అది జరగాలంటే నీటి వనరులనే పొదుపుగా వాడుకుంటూ అదనపు విస్తీర్ణానికి అందించాలి. సాగునీటి ప్రాజెక్టులు కట్టే సమయంలోనే వాటినుంచి బిందు, తుంపర్ల రూపంలో ఆయకట్టుకు నీటి సరఫరా చేసే పథకాలకూ నిధుల కేటాయింపులు ఉండాలి. అప్పుడే ప్రాజెక్టులకు వెచ్చించే వేల కోట్ల రూపాయలు, వాటి నుంచి నీటిని తీసుకునేందుకు సరఫరా చేసే కరెంటుకు వెచ్చించే సొమ్ము, బయటికి వచ్చే నీరు సద్వినియోగమవుతాయి. ఇప్పటికే నీటి కొరతతో అనేక దేశాలు కరవు కాటకాల్లో అల్లాడుతున్నాయి. జీవనదులున్న మనదేశంలోనూ ప్రతి పంట సీజన్‌లో మూడోవంతు భారతావని సాగునీటి కొరతతో అవస్థలు పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే జలసంరక్షణ, నీటి పొదుపు పథకాలే శరణ్యం!


ప్రత్యామ్నాయాలే కీలకం
    దేశవ్యాప్తంగా బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను అన్ని కమతాల్లో వినియోగిస్తే, ఇప్పుడు వాడుతున్న నీటిలో సగటున 40శాతం పొదుపు అవుతుంది. దీంతోనే అదనంగా మరో 71.8శాతం భూ విస్తీర్ణానికి సాగునీరు అందించవచ్చు. భారతదేశంలో వ్యవసాయానికి అందుబాటులో ఉన్న మొత్తం సాగునీటిలో 60శాతం కేవలం రెండు పంటలు వరి, చెరకు సాగుకే వినియోగమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పంటలకు వాడుతున్న నీటి శాతం 45. మనదేశంలో అంతకన్నా మరో 15శాతం ఎక్కువ ఉంది. పైగా మొత్తం దేశ పంటల సాగు విస్తీర్ణంలో ఈ రెండింటి సాగు విస్తీర్ణం 24 శాతమే. ఇంత తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంటలకే అత్యధిక నీటిని వినియోగిస్తున్న దేశం మరొకటి లేదు. సాగునీటి లభ్యతపైనే దృష్టి పెడుతూ ఏటా వేల కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్న ప్రభుత్వాలు, అదే నీటిని పొదుపుగా, ప్రతి నీటిబొట్టు సద్వినియోగమయ్యేలా పదోవంతైనా వెచ్చించడం లేదు. ఉదాహరణకు ప్రస్తుత ఏడాది(2019-20)లో వ్యవసాయ, సాగునీటి పారుదల రంగాలకు పాతిక వేలకోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం నీటి పొదుపు కోసం అమలు చేస్తున్న బిందుసేద్యం పథకానికి నిధులు లేవంటూ, ఈ ఏడాది అమలును ఆపేసింది. ఉచితంగా ఇస్తున్న వ్యవసాయ విద్యుత్‌కు ఏటా లక్ష కోట్ల రూపాయలు రాయితీ రూపంలో ఈ ఏడాది ఖర్చుచేస్తున్నారు. కానీ బిందుసేద్యం ద్వారా సాగునీటిని అందిస్తే వ్యవసాయ విద్యుత్‌లో 33.6శాతం ఆదా అవుతుందని అంచనా. అంటే అన్నీ కమతాలకు బిందుసేద్యం అమలైతే లక్ష కోట్ల రూపాయల్లో రూ.33,600 కోట్లు మిగిలేవి. ఇలాగే ఈ ఏడాది ఎరువులకు రూ.70 వేల కోట్లు రాయితీలిచ్చారు. బిందుసేద్యం గొట్టాల ద్వారా ఎరువులు పంపితే కనీసం 30శాతం వినియోగం తగ్గి రూ.20 వేల కోట్లు మిగిలేవి.
 

- మంగమూరి శ్రీనివాస్‌

Posted Date: 25-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం