• facebook
  • whatsapp
  • telegram

సాగు చట్టాలతో మేలెంత?

రైతుకు ఆదాయం చూపని నిర్ణయాలు
 

దేశ వ్యవసాయ రంగంపై మధ్య, దీర్ఘకాలిక ప్రభావాలు కనబరచే కీలక సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం కొవిడ్‌ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంది. సెప్టెంబరులో చట్టాలుగా మారిన మూడు వ్యవసాయ సంస్కరణలు రైతులపై చూపనున్న ప్రభావం గురించి పలు రకాల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాటిలో ఒకటి ‘కొత్త వాణిజ్య చట్టం’. ఇది అంతర్‌ రాష్ట్ర వాణిజ్య అవరోధాలు తొలగిస్తుంది. ఇ-ట్రేడింగ్‌ను అనుమతిస్తుంది. తద్వారా రైతులు తమ ఉత్పత్తులను లోగడ అనుమతించిన మండీ(అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీస్‌-ఏపీఎంసీ)లలోనే కాకుండా- ఎక్కడైనా సరే మంచి ధరలను ఆశించి విక్రయించుకోగలరు. మరొకటి ‘ఒప్పంద సేద్యానికి న్యాయపరమైన చట్రం ఏర్పాటు’. రైతులు తాము పంటలు వేయడానికి ముందే నిశ్చయమైన ఆదాయాలు పొందేందుకు వీలుగా... పంట ధర, పరిమాణం పేర్కొంటూ, కొనుగోలుదారులతో దీని ఆధారంగా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. మూడో సంస్కరణ- తృణధాన్యాలు, నూనెగింజలు, ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు, పప్పుధాన్యాలు వంటి ముఖ్యమైన ఉత్పత్తులను నిత్యావసర వస్తువుల చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ చేసిన సవరణ.
 

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సొంత అజెండా!
కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు కేంద్రచట్టాల ప్రభావాన్ని నిర్వీర్యం చేసేందుకు ఇప్పటికే తమ సొంత వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చాయి. రాష్ట్రప్రభుత్వాల ఈ బిల్లులు వాస్తవంగా రైతులకు మేలు చేకూరుస్తాయని చెప్పడం కష్టం. కేంద్ర చట్టాల ప్రభావాన్ని నీరుగార్చేందుకు మూడు బిల్లులను ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం- పంజాబ్‌. ప్రత్యేక నిబంధనలు, పంజాబ్‌ సవరణ అనే పదాల చేర్పు తప్ప, వీటి పేర్లు అచ్చం కేంద్ర చట్టాల్లో మాదిరిగానే ఉన్నాయి. పంజాబ్‌ నిర్ద్వంద్వంగా కేంద్ర చట్టాలను తిరస్కరించడం లేదు. తన అవసరాలకు అనుగుణంగా కొత్త నిబంధనలు చేర్చింది. పంజాబ్‌ తరవాత ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లు వ్యవసాయ బిల్లులు తెచ్చాయి. పంజాబ్‌ బిల్లు గోధుమ, వరి ధాన్యాలకు మద్దతు ధర కల్పిస్తోంది. దీన్ని రెండు పంటలకే వర్తింపజేయడం గమనించాలి. పత్తి, నూనె గింజల వంటి పంటల సాగుదారులకు, ఆఖరుకు మొక్కజొన్న రైతులకు ఈ బిల్లులో ఎలాంటి రక్షణా లేదు. కేంద్రం ఇప్పుడు వీటన్నింటికీ మద్దతు ధరలు ప్రకటిస్తోంది. దీనికి కారణం కనిపెట్టడం కష్టమేమీ కాదు. కేంద్ర ఆహార ధాన్యాల నిల్వలకు ప్రధాన ఆధారం పంజాబే. కేంద్రం ఈ ఒక్క రాష్ట్రం నుంచే భారత ఆహార ధాన్యాల సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా 95 శాతం నిల్వలను కొనుగోలు చేస్తోంది. కాబట్టి, పంజాబ్‌ రైతుకు దీని ద్వారా ప్రత్యేకించి అదనంగా ఒరిగేదేమీ లేదు. ధాన్యం కొనుగోళ్లపై పన్నులు లెవీల రూపేణా కేంద్రం నుంచి ఏటా రాష్ట్రప్రభుత్వానికి సమకూరే రూ.4,000 కోట్ల ఆదాయం వీసమెత్తు తగ్గకుండా బిల్లు పూచీపడుతోంది. గోధుమ, వరి ధాన్యాలకు మద్దతు ధర కంటే తక్కువ ధర చెల్లించే ఎలాంటి కొనుగోలు లేదా అమ్మకం ఒప్పందం చెల్లబోదని... కేంద్ర ఒప్పంద సేద్య చట్టానికి పంజాబ్‌ ప్రతిపాదించిన సవరణ స్పష్టం చేస్తోంది. వాస్తవానికి ఈ నిబంధన ఉపయోగపడేదేమీ కాదు. మొత్తంమీద పంజాబ్‌ వ్యవసాయ బిల్లులు- కేవలం గోధుమ వరిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని మద్దతు ధర విషయంలో చాలా సంకుచిత వైఖరి కనబరచాయి. ఎఫ్‌సీఐ వార్షిక ధాన్య సేకరణ విధానాన్ని, పన్నులు, లెవీల రూపంలోని రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను కాపాడటమే వ్యూహంగా ఇవి రూపొందినట్లు స్పష్టంగా వెల్లడవుతోంది.
 

ఛత్తీస్‌గఢ్‌ రాజస్థాన్‌ల విషయానికి వస్తే- వారి సమస్యలు భిన్నమైనవి. కేంద్ర వాటాకు ప్రధాన బియ్యం సరఫరాదారుగా ఛత్తీస్‌గఢ్‌ ఆవిర్భవించింది. ఏటా 5.5 - 6 మిలియన్‌ టన్నుల బియ్యం సమకూరుస్తున్న ఈ రాష్ట్రం తన సొంత వ్యవసాయ బిల్లుల్లో కేంద్ర చట్టాల ఊసే ఎత్తలేదు. అసలు ఇవి కేంద్ర చట్టాల నిబంధనలకు ఏ విధంగానూ వ్యతిరేకం కావని స్వయంగా ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి బిల్లులపై చర్చలో పాల్గొంటూ తేల్చిచెప్పారు. రాజస్థాన్‌ బిల్లులూ పంజాబ్‌ తరహాలోనే కేంద్ర చట్టాలకు సవరణలు చేశాయి. సేద్య ఒప్పందాల విషయంలో తప్ప ఇతరత్రా కనీస మద్దతు ధరల అమలుపై ఇవి కూడా మౌనం పాటించాయి. ఒప్పంద సేద్యం చట్ట సవరణ బిల్లులో- అన్ని పంటలకూ వర్తించేలా కనీస మద్దతు ధర నిబంధన చేర్చారు. కేవలం రెంటికే పరిమితమైన పంజాబ్‌ సవరణ బిల్లు కంటే ఇది మెరుగు. రైతుల వేధింపును శిక్షార్హం చేశారు. సెస్సుల ఆదాయాన్ని కూడా పంజాబ్‌ మాదిరిగానే ఆయా మార్కెట్‌ కమిటీల నిర్వహణకు, రైతుల సంక్షేమానికి, వ్యవసాయ కార్యకలాపాల ప్రోత్సాహానికి, మార్కెట్‌ సదుపాయాల కల్పనకు రాజస్థాన్‌ ప్రభుత్వం వినియోగించదలచింది.
 

కలిసికట్టుగా పనిచేస్తేనే...
ఈ రాష్ట్రస్థాయి బిల్లులు చట్టాలుగా మారాలంటే తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదం పొందాలి. ఏమైనప్పటికీ, పంజాబ్‌ ఛత్తీస్‌గఢ్‌ రాజస్థాన్‌ వ్యవసాయ బిల్లులు ఒక విషయం స్పష్టం చేశాయి. రాష్ట్రాల సమాఖ్య హక్కులను నొక్కి చెప్పడానికి ఇవి ఉపకరించాయి. కేంద్రం తమ వ్యవహారాల్లో తలదూరుస్తోందని, తమ రాజ్యాంగ హక్కులను కించపరుస్తోందని రాష్ట్రాలు వ్యక్తం చేసిన నిరసనగా వీటిని పరిగణించాలి. అంతే తప్ప వీటి ద్వారా రైతులకు చేకూరేది అంతగా ఏమీ ఉండదు. వారి ఆదాయాలను పెంచే దిశగా రైతులకు గణనీయమైన ప్రయోజనాలు రాష్ట్రాల వ్యవసాయ బిల్లుల్లో ఉన్నాయా అనేది అనుమానమే. రైతుల జీవితాలు మెరుగు పడాలంటే అంతర్రాష్ట్ర వాణిజ్యాన్ని నియంత్రించే కేంద్రం, వ్యవసాయ విపణులను శాసించే రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలి. దేశంలో మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాలను అబివృద్ధి చేయడం అన్నింటికంటే ముఖ్యమైన అంశం. ఇది వాస్తవరూపం దాల్చకుండా, కేంద్ర రాష్ట్రాలు చేపట్టే ఎలాంటి వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణలూ ఫలప్రదం కావు.
 

కేంద్రం తీరుపై ఆందోళన
కేంద్రం రూపొందించిన చట్టాలవల్ల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), సేకరణ వ్యవస్థలు రద్దు అవుతాయని రైతాంగం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. కేంద్రం తెచ్చిన మార్పులు- ముఖ్యంగా ఒప్పంద సేద్యానికి సంబంధించినవి కార్పొరేటీకరణకు దారితీస్తాయని, వ్యవసాయదారుల భవితవ్యాన్ని బడా వ్యవసాయ కంపెనీలు, రిటైల్‌ వ్యాపార సంస్థల చేతిలో పెట్టారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మార్పుల ఫలితంగా మండీ వ్యవస్థ బలహీనపడి, స్వతంత్ర కొనుగోలుదారులు వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గించి వేస్తారన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయదారుల ప్రయోజనాలకు కేంద్రప్రభుత్వ చట్టాలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని కొన్ని రాష్ట్రప్రభుత్వాలు భావిస్తున్నాయి.

 

Posted Date: 23-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం