• facebook
  • whatsapp
  • telegram

రైతుకు మేలుచేయని చట్టాలెందుకు?

మద్దతు ధరలకు చట్టబద్ధత దక్కాలి
 

క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా లోటుపాట్లపై సమీక్ష జరగకుండానే ఆదరాబాదరా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, కనీస మద్దతు ధరల కొనసాగింపే లక్ష్యంగా రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కమిటీ ఏర్పాటుతో సంఘటిత ఉద్యమాన్ని నీరుగార్చడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు కావాల్సిందేనంటూ ఉద్యమబాట పట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఈ మేరకు జరిగిన తొలి దఫా చర్చలు వాయిదా పడ్డాయి.
 

చిన్నరైతుకు శరాఘాతం
దేశంలోని 86 శాతం చిన్న సన్నకారు రైతులే. వీరిలో ఎక్కువమంది నిరక్షరాస్యులు. పంటను కల్లంలో నోటి మాటపైనే అమ్ముకుంటారు. 80 శాతానికి పైగా ధాన్యం ఇలా మార్కెట్లకు వెళ్లకుండా కల్లాల్లోనే విక్రయమవుతోంది. ధర అధికంగా ఉండే మార్కెట్లకు వెళ్లాలంటే తడిసి మోపెడయ్యే రవాణా ఖర్చులు, చెక్‌పోస్టు నిబంధనలు, లంచాల సమర్పణ... ఇవన్నీ దాటుకుని వెళ్ళినా కొందరు వ్యాపారుల మోసపూరిత చర్యలతో రైతులకు నష్టం తప్పడం లేదు. ఇలాంటి నిబంధనలు తొలగించి దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛనిచ్చేదంటూ ప్రత్యేక చట్టాన్ని కేంద్రం ఇటీవల తీసుకొచ్చింది. అప్పులు ఉరుముతుంటే పంట రాగానే తీర్చడం తప్ప మరో గతిలేని చిన్న రైతులు ధర బాగుండే మరోచోటకు తీసుకెళ్లే సాహసం చేయరు. ముందస్తు ఒప్పందాలున్నా కార్పొరేట్లతో వ్యవహారం తమకు ప్రాణసంకటమనీ రైతులకు అనుభవపూర్వకంగా తెలుసు. ఇలా దేశంలో అత్యధిక శాతం సాగుదారులకు ఉపకరించనప్పుడు చట్టాలు ఉండీ ఏం ఉపయోగమనేదే రైతుల ప్రశ్న. ప్రస్తుతం ప్రభుత్వ నియంత్రణలో నడిచే మార్కెట్‌యార్డుల్లోనూ సమస్యలున్నాయి. అక్కడి వ్యాపారులు ధరల్ని తెగ్గోసినప్పుడు రైతులు సంఘటితంగా పోరాడి అధికారుల మెడలు వంచి న్యాయం పొందిన సందర్భాలున్నాయి. యార్డుల్లో మోసాలను సరిదిద్దితే రైతుల సమస్య తీరుతుందని తెలిసినా, వాటిని సరిదిద్దడం వదిలేసి కార్పొరేట్‌ శక్తులను అన్నదాతల నెత్తిన రుద్దడం సమంజసమేనా? మరోవైపు, భారత పత్తి సంస్థ (సీసీఐ) సైతం ఏటా వ్యాపారులకు తీసిపోని రీతిలో అర్థం లేని నిబంధనలతో రైతుల్ని వంచించిన ఘటనలు ఎన్నో. పత్తిని రైతులు కనిష్ఠ ధరలకు వ్యాపారులకు విక్రయించుకుంటే, నిబంధనలు పక్కనపెట్టి మరీ, వ్యాపారుల నుంచి సీసీఐ కొనుగోలు చేసిన దుష్టాంతాలు చాలా ఉన్నాయి. పంట కొనుగోలులో రైతులను ఒక ప్రభుత్వరంగ సంస్థే మోసగిస్తున్నట్లు ఆరోపణలున్నా కట్టడి చేయలేని ప్రభుత్వం- రైతుల నుంచి సరకు కొనే వ్యాపారుల్ని నియంత్రించగలదంటే విశ్వసించేదెలా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు వాణిజ్య పంటల విత్తనాలు, ఉత్పత్తి సరఫరా, పంపిణీ, ఆహారశుద్ధి వ్యవస్థలు కార్పొరేట్‌ సంస్థల నియంత్రణలోకి వెళ్లిపోయిన సంగతి పాలకులకు తెలియదా? అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశంలో పంటల ధరలు ప్రభావితం అవుతున్న తరుణంలో రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత. నేటి స్వేచ్ఛా వాణిజ్యంలో బహుళజాతి కంపెనీలే లాభపడుతున్న విషయాన్ని, ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా పంట ఉత్పత్తుల్ని పెద్దయెత్తున నిల్వ చేస్తున్న సంగతిని విస్మరించలేమని అంతిమంగా కొత్త చట్టాలతో రైతులకు ముప్పే తప్ప ప్రయోజనం ఉండబోదని తాజాగా ‘గ్రామీణ వ్యవసాయ స్థితిగతుల నివేదిక’ హెచ్చరించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.
 

ఉపకరించని శాసనాలు...
ప్రైవేట్‌ వ్యాపారుల ప్రాబల్యం పెరిగి మార్కెట్‌యార్డులు నామమాత్రమై పోతాయని, కనీస మద్దతు ధరల ప్రకటన నుంచి కేంద్రం తప్పుకుంటుందన్నది రైతుల భయం. అది అర్థం లేనిదంటున్న పాలకులు, చట్టం చేసే ముందు నిబంధనల్ని వివరించే కనీస ప్రయత్నం చేయలేదు. తాము నిజంగా రైతులకు మేలు చేస్తున్నామనే విశ్వాసం కేంద్రానికి ఉంటే, దేశంలోని రైతు సంఘాలను పిలిచి ముసాయిదా రూపొందించినప్పుడే వివరించి ఉండాల్సింది. అవేమీ చేయకుండా తేనెతుట్టెను కదిలించారు. ఇప్పుడది మహోద్యమంగా మారింది. ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్‌’లో పేర్కొన్నట్లు- పంటను విక్రయించాక వ్యాపారులు సొమ్ము చెల్లించని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి నెలలోపు తీర్పును పొందవచ్చు. అయితే వారి మధ్య ముందస్తు ఒప్పందం కుదిరి ఉండాలి. రెండుమూడెకరాలున్న బడుగు రైతులకు, దూరంగా ఉండే వ్యాపారికి అమ్ముకునే విజ్ఞత, తెలివితేటలు ఉంటాయా అనేది ప్రశ్నార్థకమే. ఏటా విక్రయించుకునే స్థానిక వ్యాపారులను కాదనివారా పని చేయలేరు. గ్రామీణ ప్రాంత రైతులు తమ దగ్గరున్న కొద్ది పంటనూ ధర అధికంగా ఉన్నప్పటికీ దూర ప్రాంత వ్యాపారులకు అమ్మబోరు. ఒకటి- వారు మోసగిస్తే తమకు అండగా నిలిచేవారు ఉండబోరని, మరొకటి- కొద్దిపాటి పంటకు రవాణా ఇతరత్రా ఖర్చులు భరించే స్థితిలో వారులేకపోవడమే. అంతకుమించి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులు తీర్చకపోతే నిండా మునిగిపోతామనే భయం కూడా ప్రధాన కారణం. పైగా నమ్మకంగా ఉంటున్న స్థానిక వ్యాపారులు ఒకటి రెండు రోజులు ఆలస్యంగానైనా తమకు సొమ్ములిస్తారన్న ధీమా రైతుల్లో ఉంది. దేశంలో ఎక్కడైనా విక్రయించుకునే స్వేచ్ఛ ఉందని ప్రభుత్వం చెబుతున్నా- పొరుగు రాష్ట్రాల పంటను తమ రాష్ట్రంలో విక్రయించుకునే అవకాశం కల్పించడం లేదన్న సంగతిని గుర్తించాలని రైతులంటున్నారు. సరిహద్దు జిల్లాల కలెక్టర్లు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసిన సందర్భాలను మనం చూశాం. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న అంతరాలు సగటు రైతుకు అర్థం కానివే అయినా దేశవ్యాప్త సమగ్ర వ్యవసాయ సంస్కరణలకు తెరతీయకుండా కేంద్రం ఒంటెత్తు పోకడలు పోవడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం. ఎక్కడైనా అమ్ముకోవచ్చనే బదులు అసలు పంట ఉత్పత్తులను ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయకూడదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దేశంలో ధరలు పతనమై రైతు అమ్ముకోలేని దుస్థితి ఏర్పడితే జోక్యం చేసుకోవాల్సిన ప్రభుత్వాలు శ్రమజీవుల్ని గాలికొదిలేస్తున్నాయన్న సంగతిని అవి గుర్తు చేస్తున్నాయి.
 

నియంత్రించని ప్రభుత్వాలు
సర్కారీ నియంత్రణలోని మార్కెట్లలో వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచుకుంటుంటే ప్రభుత్వాలు నియంత్రించలేకపోతున్నాయి. తాము దేశంలో ఎక్కడో మరో చోట ప్రైవేటు వ్యాపారులకు అధిక ధరలకు అమ్ముకుంటే మాత్రం న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నది రైతుల మాట. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఈ-నామ్‌ మార్కెట్లు విఫలం కావడం, వాటిని చక్కదిద్దే కృషి చేయకపోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. గుడ్డిగా చట్టాలు చేసుకుంటూ పోవడం తప్ప, అసలవి ఎంతమేరకు ఉపయోగకరమన్న అధ్యయనం చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ ఉత్పాదకాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా వారే సమకూర్చుకునేలా, ఉత్పత్తిని సమష్టిగా విక్రయించుకునేలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పాలకులు గుర్తించాలి. దిల్లీలో రైతుల ఆందోళనలోని ధర్మాగ్రహాన్ని గుర్తించి ప్రభుత్వం బేషరతుగా చర్చలు జరపాల్సిన అవసరముంది. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించి, కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసి ప్రభుత్వమే స్వయంగా పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేలా సాగు సంస్కరణలు తీసుకురావాలి.
 

- అమిర్నేని హరికృష్ణ
 

Posted Date: 18-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం