• facebook
  • whatsapp
  • telegram

చెరకు రైతుకు దక్కని తీపి

సంక్షోభంలో మిల్లులు, సాగుదారులు

దేశంలో సుమారు అయిదు కోట్ల కుటుంబాలు చక్కెర రంగంపై ఆధారపడి ఉన్నాయి. బ్రెజిల్‌ తరవాత ప్రపంచంలోనే అత్యధికంగా పంచదార ఉత్పత్తి చేస్తున్న భారత్‌లో రైతులకు ఆ తీపి దక్కడం లేదు. ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారత్‌ వాటా దాదాపు 17శాతం. కొన్నేళ్లుగా అటు చక్కెర మిల్లులు, ఇటు చెరకు సాగుదారులు సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొవడం చూస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోవడం, మిల్లులు ఉత్పత్తి చేసిన చక్కెరకు గిరాకీ లేకపోవడమే ఈ సంక్షోభానికి కారణం. చెరకు సాగుదారులు, మిల్లుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనక పోవడంతో తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఈ పంట సాగునుంచి రైతులు వైదొలగుతున్నారు.  

మనుగడ ప్రశ్నార్థకం...
దేశంలో చక్కెర పరిశ్రమ ఎన్నడూ ఎదుర్కోని సంక్షోభ పరిస్థితులను చవిచూస్తోంది. చెరకు సాగు, పంచదార ఉత్పత్తి, రికవరీ శాతంలో దేశంలో ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చెరకు ఉత్పత్తిలో 80శాతం వాటా ఈ మూడు రాష్ట్రాలదే. 2015-16లో దేశంలో 2.48 కోట్ల టన్నులున్న పంచదార ఉత్పత్తి, 2017-18 నాటికి 3.23 కోట్ల టన్నులకు పెరిగింది. 2019-20 నాటికి ఉత్పత్తి 2.72 కోట్ల టన్నులకు పడిపోయింది. దేశంలో చక్కెర ఏడాది ఆరంభమై రెండు నెలలు దాటినా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎనిమిది మిల్లులు మాత్రమే క్రషింగ్‌ ఆరంభించాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 29 మిల్లులుండగా 17 మిల్లులు పూర్తిగా మూతపడ్డాయి. మిగిలిన 12లో ఈసారి గానుగాడేవి తొమ్మిదే. తెలంగాణలో ఈసారి ఏడు మిల్లులే నడవనున్నాయి. దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన చక్కెర మిల్లులు సైతం నష్టాలను భరించలేక మూతపడ్డాయి. పలు చక్కెర మిల్లులు ఆధునికీకరణకు నోచుకోలేదు. నిర్వహణ సామర్థ్యం కొరవడి నష్టాల పాలయ్యాయి. ఒక టన్ను చెరకు నుంచి 10శాతం రికవరీతో 100 కిలోల పంచదార ఉత్పత్తవుతుంది. చక్కెర రికవరీలో ఉత్తర్‌ ప్రదేశ్‌(13శాతం), మహారాష్ట్ర (12శాతం), కర్ణాటక (11శాతం) ముందంజలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇది 9-9.5శాతం మించడం లేదు. మరోవైపు, కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరలు కూడా చెరకు రైతుల్ని నష్టపరుస్తున్నాయి. చెరకుకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 10శాతం రికవరీపై క్వింటాకు రూ.285. ఇది 2018-19 నుంచి రూ.275గా ఉంది. జడకట్టే, చెరకు నరికే కూలీల అవసరంతో రైతుకు ఖర్చు పెరిగింది. ప్రభుత్వం ఏటా క్వింటాకు రూ.10 చొప్పున పెంచుతుండటం దారుణం. గతంలో 9.5శాతం రికవరీపై నిర్ణయించే ఈ ధరను మూడేళ్లుగా 10శాతం రికవరీపై ప్రకటిస్తుండటం- పైగా 9.5శాతం కంటే రికవరీ తగ్గితే ధరను క్వింటాకు రూ.270.75గా స్థిరపరచడం వల్ల రైతులకు మరింత నష్టం కలుగుతోంది. కూలీల కొరత ఏర్పడి అదనులో పంటను మిల్లుకు చేర్చకపోతే చెరకులో సుక్రోజ్‌శాతం దిగుబడి తగ్గి రైతులకు నష్టం వాటిల్లుతోంది. మన మిల్లులకు చక్కెర ఉత్పత్తి ఖర్చులు కిలోకి రూ.37-38 అవుతుంటే- అమ్మకం ధర కిలోకు రూ.31-32గా ఉంటోంది. ఈ నష్టాలన్నీ మిల్లుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నష్టాలను పూడ్చుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీలూ ఇవ్వడం లేదని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో, చక్కెర ఉత్పత్తి కంటే ఇథనాల్‌ తయారీని ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు గతేడాది చక్కెర పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.8,000 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచునేందుకు రూ.5,732 కోట్లను కేంద్రం చక్కెర మిల్లులకు రుణంగా అందించింది. వచ్చే పదేళ్లలో 20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపాలన్న లక్ష్యంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. తద్వారా ముడిచమురు దిగుమతుల భారాన్ని కాస్తయినా తగ్గించాలనేది కేంద్రం యోచన.

అస్థిరంగా సాగు విస్తీర్ణం
పంటను ఫ్యాక్టరీకి తరలించాక తమకు సొమ్ములు సకాలంలో చేతికందక- చెరకు సాగంటేనే రైతులు భయపడిపోతున్నారు. వీటి పర్యవసానంగానే తెలుగు రాష్ట్రాల్లో చెరకుసాగు విస్తీర్ణం, చక్కెర ఉత్పత్తిలో స్థిరత్వం ఉండటం లేదు. 2006-07లో లక్ష హెక్టార్లలో పండించిన చెరకు సాగు ఆంధ్రప్రదేశ్‌లో నేడు సుమారు 49వేల హెక్టార్లకు పడిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముడి చక్కెరను శుద్ధి చేయడంతో పాటు మొలాసిస్‌, పిప్పి, ఇథనాల్‌ తయారీ, కో జనరేషన్‌ విద్యుదుత్పత్తి ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశముంది. కానీ రైతుకు మరో మార్గం లేదు. అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చక్కెర ఉత్పత్తి, మొలాసిస్‌ దిగుబడి, ఇథనాల్‌ తయారీ, ఆల్కహాల్‌ ద్వారా జీఎస్‌టీ రూపేణా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. అయినా పెరుగుతున్న రైతుల ఖర్చులకు తగ్గట్లు చెరకు మద్దతు ధరలను నిర్ణయించడం లేదన్నది రైతు సంఘాల ఆరోపణ. చెరకుకు పంటల బీమా అమలు చేయాలి. ఉత్తర్‌ ప్రదేశ్‌లాగా అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలను రైతులకు అందిస్తూ- గిట్టుబాటు ధర కల్పించాలి.  తమ పరిధిలోని రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటించడంవంటి చర్యల ద్వారా సాగు నుంచి వైదొలగకుండా వారిని నిలువరిస్తేనే మిల్లులకు మనుగడ ఉంటుంది. సకాలంలో కటింగ్‌ ఆర్డర్లు ఇవ్వడంతోపాటు కూలీల కొరత దృష్ట్యా, చెరకు నరికే యంత్రాలను ఆయా మిల్లులే సమకూర్చాలని రైతులోకం కోరుతోంది. రైతుల్లో ఉత్సాహం పాదుగొల్పే చర్యలు చేపట్టాలంటే మిల్లుల ఆధునికీకరణకు ఇతోధికంగా సాయపడేలా ఆర్థిక భరోసా ఇవ్వాలనేది పరిశ్రమ వర్గాల వినతి. ఇటు మిల్లులు, అటు రైతులు బాగుండాలంటే కేంద్ర ప్రభుత్వ చొరవే కీలకం కానుంది!

ఆర్థిక భరోసా అవసరం
దేశంలో ప్రస్తుతం మనుగడలో ఉన్న 500కు పైగా చక్కెర మిల్లుల్లో 201 కర్మాగారాలకు డిస్టిలేషన్‌ సామర్థ్యం ఉంది. వీటిలో 121 మిల్లులు ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 380 కోట్ల లీటర్లు. దేశంలో చక్కెర మిల్లులకు ప్రధానంగా- పంచదార ఉత్పత్తి, ముడి పంచదారను తెచ్చి ప్రాసెస్‌ చేసి తిరిగి పంపించడం, చెరకు గానుగ ఆడగా వచ్చే మొలాసిస్‌, చెరకు పిప్పి తదితరాల ద్వారా ఆదాయం వస్తోంది. ఆధునిక పరిస్థితులకు తగ్గట్టు పరిశ్రమలను నవీకరించుకోవాలని చక్కెర మిల్లులు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో కేంద్రం తమను ఇతోధికంగా ఆదుకోవాలనేది వాటి అభ్యర్ధన. చమురు సంస్థలు బకాయిలు వెంటనే చెల్లిస్తూ ఉండటంతో- చక్కెర ఉత్పత్తి కంటే ఇథనాల్‌ తయారీ వైపు మొగ్గు చూపితేనే తాము లాభపడతామని మిల్లులు భావిస్తున్నాయి. దేశంలోని చాలా మిల్లులు చక్కెర అమ్మకం ద్వారా సకాలంలో సొమ్ము రాబట్టుకోలేక మరోవైపు రైతులకు బకాయిలు చెల్లించలేక నలిగిపోతున్నాయి. ఈ కారణంతోనే గడచిన అయిదేళ్లలో ఎన్నో మిల్లులు మూతపడ్డాయి.

- అమిర్నేని హరికృష్ణ
 

Posted Date: 25-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం