• facebook
  • whatsapp
  • telegram

లక్ష్యంలేని సాగు పద్దు

కర్షకులను నిరాశ పరచిన కేటాయింపులు

సేద్య సంస్కరణల గురించి భారత రైతులు పరితపిస్తుంటే- ఆ ఊసే లేని కేంద్రబడ్జెట్‌ దేశ రైతుల్ని తీవ్రంగా నిరాశ పరచింది. తాము తెచ్చిన మూడు సాగు చట్టాలతోనే సమూల మార్పులు వచ్చేస్తాయని, ఇప్పటికే ఉత్పత్తి ఖర్చుకు ఒకటిన్నర రెట్లు అధిక ధరలు అందిస్తున్నామని కేంద్రం నమ్మబలుకుతోంది. దేశ ఆర్థికానికి ఇరుసువంటి సేద్యరంగాన్ని బలోపేతం చేయడం మాని- రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడం నిజంగా ఆత్మవంచనే. ఒక దిశ లోపించి నిర్దిష్ట లక్ష్యాలు లేకుండా సాగురంగానికి కేటాయింపులు చేయడం బడ్జెట్లో పెద్ద లోపం. 

కొరవడిన మద్దతు 

అన్నదాతల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం గతంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఉత్పత్తి ఖర్చుకు అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధరలు అందించాలనేది డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫార్సు. కొన్నేళ్లుగా మద్దతు ధరలు అందించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లలో అరకొరగా కేటాయిస్తున్నప్పటికీ వాటిని కనీసం ఖర్చు చేయలేని దుస్థితి నెలకొంది. సవరించిన అంచనాలను చూస్తే- కేటాయింపుల్లో సగమైనా వ్యయం చేయకుండా రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నామని చెబుతున్నట్లు స్పష్టమవుతుంది. ఓ వైపు దేశంలో మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలంటూ దేశ రాజధాని శివార్లలో వణికించే చలిలోనూ రైతులు ఉద్యమిస్తుంటే... వారిని సంతృప్తి పరచేలా నిర్ణయాలు ఉంటాయని అందరూ ఆశించారు. సాగురంగంపై వరాలు కురిపిస్తుందని ఆశించిన దేశ రైతులకు తాజా కేంద్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశే మిగిల్చింది. కర్షకులకు ఎంతో చేసినట్లు విత్తమంత్రి చెబుతున్నారు. రైతులు లాభపడితే దేశంలో ఆత్మహత్యలు ఎందుకు ఆగడం లేదు? ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో రైతుల సాలుసరి సగటు ఆదాయం అయిదు వేల రూపాయలకు మించకపోవడాన్ని ఏ రీతిన అర్థం చేసుకోవాలి? 

ఈసారి బడ్జెట్లో సాగురంగానికి రూ.1.31లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో పీఎం కిసాన్‌ నిధులదే సింహభాగం. వ్యవసాయ రుణపంపిణీ లక్ష్యాన్ని రూ.16లక్షల కోట్లకు పెంచామని బడ్జెట్లో పేర్కొన్నారు. దేశంలో సంస్థాగత పరపతిని అందుకుంటున్న రైతులు 30 శాతంలోపే. ఇటువంటప్పుడు ఎన్ని లక్షల కోట్లు పంపిణీ చేశామన్నా నికర ప్రయోజనం ఏపాటి? అలా ఇస్తున్న రుణాల్లోనూ అధిక భాగం పుస్తక సర్దుబాట్లే తప్ప నిజంగా రైతులకు అందిస్తున్నవి కావన్నది నిష్ఠుర సత్యం. దేశంలోని పలు రాష్ట్రాల్లో దాదాపు 50 శాతానికి మించి- సొంత భూమి ఉన్న సాగుదారులు సేద్యం చేయడం లేదు. వీటిని సాగు చేస్తున్న కౌలుదారులకు పంట రుణాలు అందడం లేదు. ప్రకటిత లక్షల కోట్ల పరపతిలోనూ చిన్న సన్నకారు రైతులకు అందుతున్న శాతాన్ని పరిగణన లోకి తీసుకుంటే ఏటా బడ్జెట్లో పెంచుకుంటూ పోతున్న ఈ మొత్తం ఎటు పోతున్నదో ఏలికలకే తెలియాలి. దేశంలో బ్యాంకులు అందించే మొత్తం రుణాల్లో 18 శాతం సాగు రంగానికి ఇవ్వాలని రెండు దశాబ్దాల నాడే రిజర్వుబ్యాంకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఏ బ్యాంకూ అందుకోలేకపోవడం ఇక్కడ ప్రస్తావనార్హం. అప్పుల కోసం వడ్డీవ్యాపారుల్ని ఆశ్రయించి- కల్లంలోని పంటను అప్పుడున్న ధరకే విక్రయించాల్సి వస్తోంది. ఇలా అరకొర ధరతో ఆదాయం కోల్పోతున్న 70శాతం బడుగు రైతులకు పంట రుణమే అందని దుస్థితి నేటికీ కొనసాగుతోంది. 

వ్యవసాయం, అనుబంధ రంగాల్లో క్లస్టర్‌ ఆధారిత విధానాల ద్వారా అన్నదాతలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం మూడేళ్ల నాడు ‘ఆపరేషన్‌ గ్రీన్‌ ప్రాజెక్ట్‌’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆహారశుద్ధి మంత్రిత్వ, వాణిజ్యశాఖలతో సంయుక్తంగా వ్యవసాయోత్పత్తుల క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా దేశంలోని వివిధ జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్‌ తదితర వసతుల కల్పనకు మార్గం సుగమమవుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులు ఊపందుకుంటాయి. గతంలో ఈ ప్రాజెక్టు కింద కేవలం ఉల్లి, టొమాటో, బంగాళదుంపలను మాత్రమే చేర్చిన కేంద్రం తాజాగా బడ్జెట్లో మరో 22 రకాల ఉత్పత్తులను చేర్చనున్నట్లు ప్రకటించడం హర్షణీయం. ఇదే ప్రాజెక్టు కింద ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహిస్తున్న కేంద్రం, ఆశించిన నిధులు కేటాయించలేకపోవడం శోచనీయం. ఈ-నామ్‌ మార్కెట్లతో మరో వెయ్యి మండీలను అనుసంధిస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. దళారులను రూపుమాపుతామంటూ తీసుకొచ్చిన ఈ-నామ్‌ మార్కెట్‌ వ్యవస్థలో నయా దళారులు పుట్టుకొచ్చి ధర విషయంలో సిండికేటుగా మారుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నా వాటిని పట్టించుకొనకపోవడం విచారకరం. రాష్ట్రాల నియంత్రణలో ఉండే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను అభివృద్ధి చేస్తామని, వీటిలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఆత్మనిర్భర్‌ పథకం కింద గతంలో ప్రకటించిన లక్ష కోట్ల రూపాయల నిధులను రాష్ట్రాలు వాడుకోవచ్చని బడ్జెట్లో సూచించారు. వాటిని ఎప్పటిలోగా ఇస్తారనే విషయంలో ఎలాంటి స్పష్టతా లేదు! పంటలు నష్టపోతే రైతుల్ని ఆదుకునేవి అనుబంధ రంగాలే. వీటికి సముచిత కేటాయింపులు దక్కలేదు. దేశ వ్యవసాయ రంగానికి కీలకం కానున్న ఆహార శుద్ధి రంగానికి కేంద్రం మొండిచేయి చూపింది. గతేడాది బడ్జెట్లో కేటాయించిన రూ.1,247 కోట్లకు బదులు ఈసారి రూ.1,308 కోట్లు మాత్రమే ప్రకటించింది. రైతులకు భరోసా కల్పించే దిశగా కేంద్ర బడ్జెట్లో నిర్దిష్ట ప్రతిపాదనలు లోపించాయి. 

భరోసా పెంచేలా...

సాగుదారులకు మేలు చేయడం అంటే బడ్జెట్లో భారీ కేటాయింపులు చేయడం ఒక్కటే కాదు. వారు సేద్యంలో నిలదొక్కుకునేలా సంస్కరణలు తేవడం. అసలు సేద్యం కొనసాగించే పరిస్థితులు లేనప్పుడు సాగుదారులకు ఎంత చేశామన్నా తక్కువే. మేలైన వంగడం, పంట రుణాలు, సాగు సలహాలు, గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు స్థిరమైన ఆదాయాలు వారికి అందించాలి. అవి అందించే క్రమంలో తలెత్తే ఎన్నో మోసాలను నిరోధించేలా వ్యవసాయ యంత్రాంగాన్ని బలంగా నిర్మించడం, రైతు ఆదాయాలు ద్విగుణీకృతం అయ్యేలా సంక్షేమ పథకాలను అమలు చేయగలిగితే సేద్యం నుంచి వలసలు తగ్గుతాయి. ఉత్పత్తిని ఇతోధికంగా పెంచే దిశగా వ్యవసాయ పరిశోధన, విస్తరణ సేవలు పెంపొందించే వ్యూహాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. ఆహారశుద్ధి రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పంట కోత అనంతర సాంకేతిక అవసరాలైన నిల్వ, ప్యాకింగ్, గ్రేడింగ్, రవాణా, పంపిణీ సరఫరా వ్యవస్ధలను మెరుగుపరచాలి. ఏటా బడ్జెట్లు వచ్చిపోతున్నా కీలకాంశాల్ని స్పృశించకుండా సాగురంగ బలోపేతానికి అవసరమయ్యే సంస్కరణలకు ఊతం ఇవ్వకుండా ప్రవేశపెట్టే ఆర్థిక పద్దులు ఇలా నిస్సారంగానే ఉంటాయి. తాజా కేంద్ర బడ్జెట్‌ ఆ ఒరవడికి కొనసాగింపే!

- అమిర్నేని హరికృష్ణ 

Posted Date: 16-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం