• facebook
  • whatsapp
  • telegram

రైతుల నెత్తిన ధరల పిడుగు

సాగువ్యయంపై పెట్రో, ఎరువుల భారం

కాంప్లెక్స్‌ ఎరువులు ప్రియమై నెల దాటకుండానే పెట్రో ధరలకు రెక్కలు మొలవడంతో ఖరీఫ్‌ ముంగిట రైతులపై తీవ్ర భారం పడనుంది. ఇప్పటికే పంటలకు మద్దతు ధరలు లభించక అన్నదాతల కష్టానికి నష్టమే ప్రతిఫలమవుతోంది. డై అమ్మోనియం ఫాస్పేట్‌(డీఏపీ)కు భారీ రాయితీని ప్రకటించిన కేంద్రం, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను నియంత్రించకపోవడంతో సాగు ఖర్చులు మరింత పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రసాయన ఎరువుల వాడకం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు అన్నదాతల్ని మరింతగా అప్పుల్లోకి నెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా ప్రస్తుతం దక్కుతున్న మొత్తమూ కోసుకుపోయే పరిస్థితులు ఏర్పడవచ్చని చెబుతున్నారు.

మోతాదుకు మించి వినియోగం

మండుతున్న పెట్రో ధరలకు తోడు కరోనా పరిస్థితులతో అన్ని రకాల ఖర్చులు పెరిగిపోవడం, రబీ ధాన్యం కొనుగోళ్లలో వెతలు, అకాల భారీ వర్షాలతో ధాన్యం తడిసిపోవడం, పంటల బీమా వర్తించకపోవడం, కొన్ని పంటల్లో విత్తన రాయితీలు ప్రకటించకపోవడం వంటి సమస్యలు ఖరీఫ్‌కు ముందు రైతులకు తీవ్ర ప్రతిబంధకాలు కానున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇఫ్కో సహా పలు తయారీ సంస్థలు ఏప్రిల్‌ కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచిన తెల్లారే వాటి అమలును కేంద్రం నిలువరించింది. పాత నిల్వలకు ఈ ధరలు వర్తించవంటూనే తరవాత కొత్త ధరలకు ఆమోదం తెలిపింది. కానీ, అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తవగానే ఫాస్పేటిక్‌ ఎరువుల ధరలను పెంచేసింది! దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో డీఏపీపై 140 శాతం రాయితీని ప్రకటించింది. ముడిపదార్థాలు ప్రియం కావడంతో ఎరువుల ధరల పెంపు అనివార్యమని తయారీదారులు చెబుతున్నారు. ఆయా సంస్థల ఉత్పత్తి కష్టాలు వాస్తవమే అయినా ఆ మేరకు అన్ని రకాల ఎరువులపై కేంద్రం రాయితీలు ప్రకటించకుండా డీఏపీకే పరిమితం కావడంపైనే అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన కాంపెక్స్‌ ఎరువులు, పెట్రో ధరలతో సగటున ఒక్కో రైతుకు ఎకరాకు రూ.అయిదారు వేల రూపాయల మేరకు అదనపు వ్యయం కానుంది.

రైతులు తగిన మోతాదులో ఎరువుల్ని వాడకపోతుండటంతోనూ సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. తెలంగాణలో 2017లో ఖరీఫ్‌, రబీ సీజన్లకు కలిపి 28.39 లక్షల టన్నుల ఎరువులు వాడగా... 2019 నాటికి అది 35 లక్షల టన్నులకు (సగటున ఎకరాకు 185 కిలోలు) చేరింది. దేశీయ సగటు (ఎకరాకు 51.2 కిలోలు), ప్రపంచ సగటు (78.4 కిలోలు) కంటే ఇది చాలా ఎక్కువ! ఎకరాకు రెండేసి బస్తాల డీ…ఏపీ వాడే రైతులు అంతే మొత్తంలో కాంప్లెక్స్‌ ఎరువుల్నీ వాడేస్తున్నారు! తెలంగాణలో 2019-20లో 98 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరాకు రెండు బస్తాల చొప్పున 98 లక్షల ఎకరాలకు 1.96 కోట్ల బస్తాల కాంప్లెక్స్‌ ఎరువులను చల్లుతున్నారనుకుంటే ఇప్పుడు పెరిగిన ధరలతో రైతులు రూ.1372 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు కోటి ఎకరాల్లో వరి సాగు చేస్తున్నవారిపై రూ.1400 కోట్ల భారం పడనుంది. వరే కాకుండా పత్తి, వేరుసెనగ, మిరప, అపరాల పంటల్లోనూ సిఫార్సు కంటే రెట్టింపు ఎరువులు వాడుతున్నారు. నిజానికి కాంప్లెక్స్‌ కంటే విడివిడిగా ఎరువులు వేయడమే మేలు. ఒకప్పుడు రైతులు వీటిని విడిగా కొని, వాడే ముందు కలిపి చల్లేవారు. వాటికి మారుగా ఇప్పుడు కాంప్లెక్స్‌ ఎరువులు వాడేస్తున్నారు. వరికి సిఫార్సు చేసిన భాస్వరం మోతాదు అందాలంటే ఎకరాకు 50 కిలోల డీఏపీ వాడితే సరిపోతుంది. కానీ రైతులు అధిక మోతాదులో వాడుతున్నారు. ఫలితంగా భాస్వరం నిల్వలు పేరుకుపోయి నేలలు చౌడు బారతాయి. ఇలా పేరుకుపోయిన నిల్వలను కరిగించాలంటే ఫాస్పరస్‌ సాల్యుబుల్‌ బ్యాక్టీరియా (పీఎస్‌బీ) వాడాల్సి ఉంటుంది. అయితే పీఎస్‌బీ పనిచేయాలంటే నేలలో సేంద్రియ కర్బన శాతం తగినంత ఉండాలి. పీఎస్‌బీని వాడకుండా రైతులు ఎప్పటిలా భాస్వరాన్నే చల్లేస్తున్నారు. పీఎస్‌బీని చల్లితే డీఏపీ వాడాల్సిన అవసరం ఉండదు.

ప్రత్యామ్నాయాలు మేలు

ధరలు పెరిగిన నేపథ్యంలో ఖరీదైన భాస్వరాన్ని ఈ ఏడాది వాడకపోయినా నష్టం లేదని, తద్వారా రైతుకు కొంత ఖర్చు తగ్గుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చేలు పచ్చగా ఉంటాయని కొందరు యూరియా చల్లుతున్నారని, దానితో మంచి దిగుబడులు వస్తాయనుకోవడం భ్రమేననీ వారంటున్నారు. ఇలా నత్రజని ఎరువుల్ని అధికంగా వాడితే పంటను పలు రకాల తెగుళ్లు ఆశిస్తాయి. వీటిని నియంత్రించాలంటే తిరిగి క్రిమిసంహారకాలను వాడాలి. ఇలా రైతులు రెండు విధాలా నష్టపోవలసి వస్తోంది. నేలలో నత్రజని లోపం ఉంటేనే యూరియా చల్లాలి. సాధారణంగా పచ్చిరొట్టనిచ్చే పిల్లిపెసర, జీలుగ, జనుము వంటి పంటల్ని వరి వేసే ముందు నేలలో కలియదున్నితే వేయబోయే పంటకు నత్రజని సహజంగానే అందుతుంది. ఇవేమీ పాటించకుండా రైతులు యూరియా చల్లేస్తుండటంతో ఉపయోగం లేకపోగా సాగు వ్యయం పెరిగిపోతోంది. భూసార పరీక్షలు చేసుకుని నేలలో ఉన్న పోషకాలకు అనుగుణంగా ఎరువులు వాడటమే రైతులకు సదా శ్రేయస్కరం.

పంటల వారీగా ఎరువులు ఎంత అవసరమో అంత వాడితే సరిపోతుంది. అధికంగా వాడితే అటు నేలలు నిస్సారమై ఇటు రైతుకు డబ్బూ వృథా అవుతుంది. రసాయన ఎరువులను ఎక్కువగా వినియోగిస్తే పంటకు మేలు చేసే నేలలోని సూక్ష్మజీవుల్ని దెబ్బతీస్తాయి. అవి నేలలో జరిపే రసాయన చర్యల వల్ల పెనుమార్పులు సంతరించుకుని భూస్వభావం దెబ్బతింటుంది. కాబట్టి పంటల వారీగా శాస్త్రవేత్తలు ఎంత మేర సిఫార్సు చేశారో అంతకుమించి వాడకుండా జాగ్రత్తలు పాటించాలి. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ, జీవన ఎరువుల వాడకం పెంచేలా ప్రభుత్వం రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని చేపడుతూనే సేంద్రియ ఎరువుల వాడకాన్ని గణనీయంగా పెంచితే భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కలకు పోషకాలను బాగా అందిస్తాయి. దీనితో రసాయన ఎరువుల వాడకం తగ్గి రైతులకు ఖర్చులూ కలిసివస్తాయి. మరోవైపు- పెట్రో, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం పంటల మద్దతు ధరలను పెంచడం తక్షణావసరం! 

- అమిర్నేని హరికృష్ణ
 

Posted Date: 22-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం