• facebook
  • whatsapp
  • telegram

గాలిలో దీపం... పంటల విధానం!

కొత్త ఖరీఫ్‌ సీజన్‌కు సూచనలు కరవు

కొత్త పంటల ఖరీఫ్‌ సీజన్‌ వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతోంది. మరోవైపు సాగు చేయాల్సిన పంటలపై రైతులకు దిశానిర్దేశం కరవైంది. మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలనే అధిక విస్తీర్ణంలో సాగుచేసే పంటలకాలనీల ఏర్పాటు ప్రణాళికలు ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో లేవు. పంటలకాలనీల ప్రణాళికలు అమలు చేస్తేనే రైతులకు ఆదాయం పెంచవచ్చని అయిదేళ్లుగా కేంద్రం అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు సూచిస్తోంది. కానీ చాలా రాష్ట్రాలు ఈ సూచనను పట్టించుకోవడం లేదు. గతేడాది మాదిరిగానే యథావిధిగా మళ్ళీ పత్తినే అధిక విస్తీర్ణంలో సాగు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ ఇప్పటికే రైతులకు సూచించింది. ఈ పంటతో రైతులకు ఆదాయం పెద్దగా పెరగకున్నా దానినే ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం గమనార్హం.

సుస్థిర సేద్యానికి దారేది?

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని 2022 కల్లా సాధించాలని కేంద్రం 2016లో ప్రకటించింది. ఇప్పటికే అయిదేళ్లవుతున్నా ఆదాయం పెరుగుతున్న దాఖలాలే లేవు. పలు ప్రతిష్ఠాత్మక పథకాలను ఈ లక్ష్యసాధన కోసమే అమలు చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. పలు రాష్ట్రాలు ఆ పథకాలనే సరిగ్గా అమలు చేయనప్పుడు ఆదాయం పెంపు లక్ష్యసాధన ఎలా సాధ్యమనేది కీలక ప్రశ్నగా మారింది. ఉదాహరణకు ఒక్కో జిల్లా వాతావరణం, భూములకు అనువైన ఒక్కో పంటను ఎంపిక చేసి దానినే అక్కడ అధికంగా సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తూ ‘పంటల కాలనీ’ పథకం అమలు చేయాలని కేంద్రం చెప్పింది. దీనివల్ల ఆ జిల్లా నుంచి ఆయా పంట ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు ఆదాయం పెంచాలని లక్ష్యం. అసలు పంటల కాలనీలే ఏర్పాటు చేయనప్పుడు ఇక ఎగుమతులు, ఆదాయం పెరగడం ఎలా సాధ్యం? సీజన్‌ ఆరంభంలో విత్తనం వేసే ముందే ఆ పంటకు మార్కెటింగ్‌ సదుపాయాలెలా ఉంటాయి, నాలుగైదు నెలల తరవాత దాన్ని కోసి మార్కెట్లలో అమ్మితే రైతులకు ఎంత ధర వస్తుందనే విషయంలో స్పష్టమైన అంచనాలు ఉండాలి.

ఇతర రాష్ట్రాలపై ఆధారం

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తృణధాన్యాల పంటలకు గిరాకీ ఉన్నా తెలుగు రైతులు వాటి సాగుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహకాలు లేకపోవడం, మద్దతు ధరపై హామీ లేకపోవడంతో రైతులు ముందుకు రావడం లేదు. గతేడాది ఖరీఫ్‌లో తెలంగాణలో కోటీ 34 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే పత్తి 60, వరి 53 లక్షల ఎకరాల్లో వేశారు. దీనివల్ల రాష్ట్రానికి అవసరమైన ఇతర పంట ఉత్పత్తులన్నీ వేరే రాష్ట్రాల నుంచే కొనాల్సి వస్తోంది. ప్రస్తుత రబీ సీజన్‌లో దేశంలోనే అత్యధికంగా 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు- ప్రజలకు నిత్యం అవసరమయ్యే టమాటాలు, ఉల్లిగడ్డలు, పాలు వంటి సాధారణ ఆహారోత్పత్తుల కోసం పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌లాంటి సుదూర రాష్ట్రాల నుంచి తెప్పించాల్సి వస్తోంది. ఐసీఏఆర్‌ లోతైన పరిశోధనలు చేసి చెప్పిన సమగ్ర సేద్య విధానాలను అనుసరించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

ఇందులో భాగంగా ‘రాష్ట్రస్థాయి మార్కెటింగ్‌ పరిశోధన, విశ్లేషణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తున్నా ఇంత వరకూ ఏర్పాటుకాలేదు. ప్రతి పంట సాగును ‘సమగ్ర సేద్య విధానం’ (ఐఎఫ్‌ఎస్‌)లో చేపట్టాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) సూచించింది. ప్రతి రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ కలిసి అక్కడి భూములు, వాతావరణానికి అనుగుణంగా ఐఎఫ్‌ఎస్‌లు రూపొందించి రైతులతో అమలు చేయాలని ఐసీఏఆర్‌ పేర్కొంది. పంటల ఉత్పాదకత పెరిగేలా సాగు ప్రణాళికలు లేకపోతే రైతుల ఆదాయం పెంచడం అసాధ్యమని కేంద్రం ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ సైతం స్పష్టం చేసింది.

2020-21 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 26.28 శాతం అదనంగా పెరిగాయి. ఇవి లక్షా 30 వేల కోట్ల రూపాయలను దాటాయని ‘వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల మండలి’(అపెడా) తాజా నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే కాలవ్యవధిలో లక్షా మూడు వేల కోట్ల రూపాయల ఎగుమతులు నమోదయ్యాయి. ఈ ఏడాది  రూ.27 వేల కోట్లు అదనంగా పెరగడం భారత వ్యవసాయ, ఆహారోత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న గిరాకీని చాటుతోంది. కానీ ఈ మేర అన్ని పంటల సాగు, ఎగుమతులు పెంచడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అన్ని రాష్ట్రాల్లో సక్రమంగా ఉండటం లేదు.

ఎగుమతులుంటేనే ఆదాయం

కొన్ని రాష్ట్రాలే ఎగుమతుల్లో పోటీ పడుతున్నాయి. ఉదాహరణకు గుజరాత్‌ నుంచి గత 11 నెలల్లో రూ.31 వేల కోట్ల వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేస్తే తెలంగాణ నుంచి అందులో కేవలం నాలుగు శాతం (రూ.1243 కోట్లు) మాత్రమే ఉంది. హరియాణా వంటి అతి చిన్నరాష్ట్రం కూడా తెలంగాణకన్నా ఎనిమిది రెట్లు ఎక్కువ ఆదాయాన్ని వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులపై పొందింది. గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో ఎంతో ముందున్నాయి. దీనివల్ల అక్కడి రైతులకు ఆదాయం పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లు ఉపయోగపడుతున్నాయి. పంజాబ్‌ నుంచి కమలా(సంత్రా) పండ్లు నేరుగా విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేకంగా పంటలకాలనీలు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ వంటి చిన్నదేశాలు మొదలుకుని అమెరికా వంటి పెద్దదేశం వరకు ఎగుమతి డిమాండు ఉన్న పంటలను పండించే రైతులకే అధిక ఆదాయం వస్తోంది. కేవలం వరి, పత్తి వంటి ఒకటీ రెండు పంటలనే మూడొంతులకు పైగా విస్తీర్ణంలో సాగుచేసే ఏ దేశంలోనూ రైతులకు ఆదాయం పెరగడం లేదు. ఐసీఏఆర్‌ సిఫార్సుల ప్రకారం చిన్న కమతాల రైతులను మిశ్రమసేద్యం వైపు మళ్ళించాలి. ఒకటీ, రెండు అంతర పంటలు, పాడి, నాటుకోళ్ల పెంపకం, కూరగాయల సాగు వంటివన్నీ కలిపి చేపట్టిన రైతుకు నష్టం రాదని వ్యవసాయ వర్సిటీలు ప్రయోగాత్మకంగా నిరూపించాయి. తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో రైతులు ఈ తరహా మిశ్రమ సేద్యం పద్ధతులతోనే అప్పులబారిన పడకుండా జీవనోపాధి పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల రైతులకు సైతం సీజన్‌ ఆరంభానికి ముందే సమగ్ర అవగాహన కల్పించి ఖరీఫ్‌లో ఏరువాక సాగేలా చూడాలి.

- మంగమూరి శ్రీనివాస్‌
 

Posted Date: 29-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం