ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈశాన్యంలో మూడు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. వచ్చే సంవత్సరం లోక్సభ సమరమూ జరగనుంది. ఈ తరుణంలో రాబోయే కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతిని ఆకర్షించడంపై ఆర్థిక మంత్రి అధికంగా దృష్టి సారించే అవకాశం ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన వరసగా అయిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా భారీ లెక్కలతో, అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపే కేంద్ర బడ్జెట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. అందులో అధికార పక్షం రాజకీయ ప్రయోజనాలూ ఇమిడి ఉంటాయన్నది కాదనలేని సత్యం. తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లతో కలిపి తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల పోరు కొనసాగనుంది. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో ఈ విషయాన్ని విస్మరించడం ఆర్థిక మంత్రికి వీలు కాని అంశం. రాబోయే కేంద్ర పద్దులో దేశంలో పెద్దసంఖ్యలో ఉన్న మధ్యతరగతికి ఉపశమనం కల్పించడానికి నిర్మల ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
పడిపోయిన ఎగుమతులు
ప్రపంచ దేశాల్లో మాంద్యం పరిస్థితులు, కరోనా విజృంభణ కుదిపేస్తుంటే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలకడగా సాగుతుండటం హర్షణీయం. ఇటీవల ఇండియా వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు గతంలో ప్రకటించిన 6.7శాతం నుంచి 6.9శాతానికి పెంచింది. పూర్తిస్థాయిలో ఏడు శాతం వృద్ధిరేటుపై కేంద్రం భరోసాగా ఉంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) సైతం తాజాగా భారత ఆర్థిక వ్యవస్థ ఏడుశాతం వృద్ధిరేటు సాధిస్తుందని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధిరేటు 6.8శాతం ఉంటుందని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. మరోవైపు పన్ను రాబడి పెరగడమూ సానుకూల పరిణామం. ప్రస్తుతం నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్ల దాకా ఉంటున్నాయి.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో నిరుడు ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల ధరలు అమాంతం ఎగబాకాయి. దాంతో వినియోగదారుల ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన నాలుగు-ఆరు శాతాన్ని మించిపోయింది. ఫలితంగా వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచాల్సి వచ్చింది. ప్రస్తుతం ఐరోపాలో మాంద్యం, చైనాలో ఆర్థిక మందగమనం వల్ల వంట నూనెల ధరలు దిగివచ్చాయి. వినియోగదారుల ద్రవ్యోల్బణం సైతం తగ్గుముఖం పట్టి 5.8శాతానికి చేరింది. కరెంటు ఖాతా లోటు మాత్రం నానాటికీ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ముడి చమురు, ఇతర సరకుల దిగుమతుల బిల్లు పెరిగిపోతుంటే, ఇండియా నుంచి ఎగుమతులు మాత్రం కుంచించుకుపోతున్నాయి. ఐరోపాలో ఆర్థిక మాంద్యం, అమెరికాలో ఆర్థిక మందగమనం భారత ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుంటే, ఆ దేశం నుంచి ఇండియాకు ఎగుమతులు మాత్రం పెద్దమొత్తంలో ఉంటున్నాయి. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థపై సరైన దృష్టి పెడుతూ విభిన్న వర్గాల ఓటర్లను, ముఖ్యంగా మధ్య తరగతిని ఆకట్టుకునేలా బడ్జెట్ రూపకల్పనలో నిర్మల జాగ్రత్తలు తీసుకోవచ్చు.
కీలక మార్గాలు
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ నదుల్ని కాటేస్తున్న వ్యర్థాలు
‣ మానవ తప్పిదం... ప్రకృతి ఆగ్రహం!