• facebook
  • whatsapp
  • telegram

మయన్మార్‌... మరో సవాలు!

మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో... భారత విదేశాంగ విధానానికి సరికొత్త సవాలు ఎదురైంది. ఈశాన్యంలో సాయుధ తీవ్రవాదులతో పోరాడుతూ ఇటీవలి కాలంలో గణనీయ విజయాలు సాధించిన భారత్‌కు తాజా పరిణామం మరో సమస్యగా మారే అవకాశం ఉంది.

గత ఏడాది నవంబర్‌లో మయన్మార్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌ సాన్‌ సూకి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామిక లీగ్‌ (ఎన్‌ఎల్‌డీ)కు దక్కిన భారీ విజయాన్ని ఆ దేశ సైన్యం జీర్ణించుకోలేదన్న సంగతి ఊహించినదే. మొత్తం 476 స్థానాలకుగాను ఎన్‌ఎల్‌డీ 396 సీట్లు గెలిచింది. సైనిక జుంటా మద్దతు ఉన్న యూనియన్‌ సాలిడారిటీ, డెవలప్‌మెంట్‌ పార్టీ (యూఎస్‌డీపీ) కేవలం 33 సీట్లతో సరిపెట్టుకుంది. అధికారం దక్కే అవకాశాలు కనిపించకపోవడంతో సోమవారం తెల్లవారుజామున సైన్యం తిరుగుబాటు జరిపింది. జనరల్‌ మిన్‌ ఆంగ్‌ నేతృత్వంలో 11 మంది బృందంతో అధికారాన్ని కైవసం చేసుకొంది. మయన్మార్‌లో పాలన పగ్గాలు సైన్యం చేతికి వెళ్లడం- భారత్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపడంతోపాటు, కొత్త చిక్కుల్నీ తెచ్చిపెట్టింది.

తూర్పువైపు అడుగు...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ‘యాక్ట్‌ ఈస్ట్‌’ విధానాన్ని అనుసరిస్తోంది. ‘యాక్ట్‌ఈస్ట్‌ పాలసీ’, ‘నైబర్‌హుడ్‌ ఫస్ట్‌’ భారత విదేశాంగ విధానంలో రెండు కీలక అంశాలు. ఈ రెండు విధానాలనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమ్మిళిత పరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం (ఆసియాన్‌) పేరిట జట్టుగా ఏర్పడిన దేశాలతో ఆర్థిక, రాజకీయ, సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై యాక్ట్‌ఈస్ట్‌ పాలసీ ప్రధానంగా దృష్టి సారిస్తూ తోడ్పడుతుంది. ‘నైబర్‌హుడ్‌ ఫస్ట్‌ పాలసీ’ భారత పొరుగు దేశాలకు ప్రాధాన్యం ఇస్తుంది. కొవిడ్‌పై పోరాటంలో పొరుగు దేశాలకు భారత్‌ అందించిన సహాయ సహకారాలు, ముఖ్యంగా టీకాల పంపిణీలో ఇచ్చిన తోడ్పాటుతోనే ఈ విధానం సుస్పష్టమవుతోంది. భారత విదేశాంగ విధానానికి సంబంధించి ‘బిమ్స్‌టెక్‌’ అనేది మరో కీలక వేదిక. బంగ్లాదేశ్‌, మయన్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, నేపాల్‌, భూటాన్‌లతో ఏర్పడిన సమూహమిది. ఈ విధానాల్లోగానీ, వేదికలోగానీ కీలకంగా  కనిపిస్తున్నది మయన్మారే.

మయన్మార్‌ సైనిక జుంటా నేతల బృందం చైనాతో సన్నిహిత, సహృదయ సంబంధాలను నెరపుతోంది. ఒకవైపు భారత్‌తో, మరోవైపు చైనాతో సమదూరం పాటిస్తూ వస్తున్న పరిస్థితి ఇకపై ఉండకపోవచ్చు. ‘డ్రాగన్‌’ అండదండలున్న యునైటెడ్‌ వా స్టేట్‌ ఆర్మీ (యూడబ్ల్యూఎస్‌ఏ) చైనా, మయన్మార్‌ ద్వైపాక్షిక సంబంధాలను ఇబ్బంది పెడుతున్నా మయన్మార్‌లోని గనులు, మౌలిక సదుపాయాల రంగాలతోపాటు చమురు, సహజ వాయువు రంగంలో చైనా భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టింది. మరోవైపు, జుంటాపైనా, దాని చర్యలపైనా విమర్శల దాడి పెరిగితే, అది మరింతగా చైనా కబంద హస్తాల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా మయన్మార్‌పై భారత్‌ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఇది భారత్‌కు విపత్కర పరిస్థితే.

ఎన్డీయే 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత మయన్మార్‌తో సైనిక, దౌత్యపరమైన సంబంధాల్ని బలోపేతం చేసుకొనే దిశగా కృషి చేసింది. వాయవ్య మయన్మార్‌, ఈశాన్య భారత్‌లోని మారుమూల అటవీ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్న తీవ్రవాదులను ఏరివేయాలన్నదే భారత్‌ లక్ష్యం. ఈ ప్రాంతంలో ఎన్‌ఎస్‌సీఎన్‌, ఉల్ఫా, పీఎల్‌ఏ, యూఎన్‌ఎల్‌ఎఫ్‌ వంటి తీవ్రవాద సంస్థలకు చెందిన సాయుధులు కార్యకలాపాలు సాగిస్తుంటారు. వీరంతా ఇండియా, మయన్మార్‌, థాయ్‌లాండ్‌ (ఐఎంటీ) త్రైపాక్షిక హైవేను, రహదారి-నది-ఓడరేవు సరకు రవాణాకు సంబంధించిన ప్రాజెక్టు అభివృద్ధి పనులకు ఆటంకంగా పరిణమించారు. ఈ నేపథ్యంలో మయన్మార్‌ విషయంలో భారత్‌ తీవ్రస్థాయిలో దృష్టిసారించింది. మన దేశానికి చెందిన పలువురు అత్యున్నతస్థాయి అధికారులు ఆ దేశంలో పర్యటనలు చేపట్టారు. రక్షణ కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శి, సైనికాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవానే, సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌తోపాటు పలువురు ఇతర ఉన్నతస్థాయి సైనికాధికారులు మయన్మార్‌కు వెళ్లొచ్చారు.

తీవ్రవాద నిరోధక ఆపరేషన్లు

భారతీయ ఉన్నతాధికారుల చొరవ కారణంగా ఈశాన్య భారత్‌లోని తీవ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన సంయుక్త ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. ఈ క్రమంలో 2019 జనవరి 29న టాగాలోని ఈశాన్య భారత్‌ తీవ్రవాదుల ప్రధాన స్థావరంపై మయన్మార్‌ సైన్యం చేపట్టిన దాడి కీలకమైనది. 2019 మే 16వ తేదీన లాహే, నాన్యున్‌ల సమీపంలో చేపట్టిన మరో దాడి కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తరహా ఆపరేషన్ల ఫలితంగా ఈశాన్య భారత్‌లోని తీవ్రవాద సంస్థల నేతలు పునరాలోచనలో పడ్డారు. ఎన్‌ఎస్‌సీఎన్‌ (కె) సంస్థ అగ్రనేత నిక్కి సుమి చర్చల దారికి రావడం దాడుల ఫలితమేనని భావించవచ్చు. మయన్మార్‌లో ప్రజాస్వామిక పరివర్తన ప్రక్రియకు భారత్‌ గట్టి మద్దతునిస్తోంది, తాజా పరిణామాల తరవాత సైతం- న్యాయపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొనడం గమనార్హం. ‘చైనాకు మయన్మార్‌ స్నేహపూర్వక పొరుగుదేశం. ఆ దేశంలోని అన్ని పార్టీలు తమలోని విభేదాలను రాజ్యాంగం, న్యాయం పరిధిలో పరిష్కారించుకుంటాయని, రాజకీయ, సామాజిక సుస్థిరతను కొనసాగిస్తాయని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెంబిన్‌ పేర్కొన్నారు. ఇప్పటికైతే, మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆసియా దిగ్గజ దేశాలు వేచి చూసే వైఖరినే ప్రదర్శిస్తున్నాయి.

- సంజీవ్‌ కె.బారువా
 

Posted Date: 16-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం