• facebook
  • whatsapp
  • telegram

కాల్పుల విరమణ ఉభయ తారకం

పాకిస్థాన్‌ కట్టుబాటు చాటేనా?

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుతున్న తరుణంలో వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితిని అదుపు చేయడంలో భాగంగా- 2003 నవంబరులో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించడం కీలక పరిణామం. ఈ ఒప్పందాన్ని భారత్‌, పాకిస్థాన్‌ రెండు దేశాలూ గౌరవించాల్సిన అవసరం ఉంది. 370వ అధికరణను రద్దు చేస్తూ ఆగస్టు అయిదో తేదీన భారత పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోయిన పాకిస్థాన్‌ సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడటంతో కొంతకాలంగా ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని బతుకీడుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఫిబ్రవరి 24 నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించడంతో తుపాకులు నిశ్శబ్దం పాటిస్తున్నాయి.

కీలక మలుపు

గతంలో సరిహద్దు వెంబడి నిశ్శబ్దం తాండవించిందంటే అది తుపాను ముందు ప్రశాంతత వంటిదేనని స్థానికులు భావించేవారు. సరిహద్దుల్లో మంచు కురవడానికి ముందు ఉండే సీజన్లలో లేదా మంచు కరిగే సమయంలో ఉగ్రవాదుల చొరబాట్లకు అనువైన వాతావరణం ఉంటుంది. సాధారణంగా కాల్పులు సంభవించాయంటే ఆ సమయంలో ఉగ్రవాదుల చొరబాటుకు ప్రయత్నం జరుగుతున్నట్లేనని భావించాలి. సరిహద్దులోని ఇరు సైనిక పోస్టుల సమీపంలో- ఒకవైపు భారత సైన్యంతో తలపడుతూ, దాని దృష్టి మళ్లిస్తూ మరోవైపు నుంచి ఉగ్రవాదులను చాటుమాటుగా సరిహద్దులు దాటించే పాకిస్థాన్‌ వ్యూహం అందరికీ తెలిసిందే. ప్రస్తుత ఒప్పందం ప్రకారం ఈ తరహా చొరబాట్లకు చాలావరకూ దారులు మూసుకుపోతాయి. ఫిబ్రవరి 25వ తేదీన భారత సైనికాధిపతి నరవాణే చేసిన ప్రకటన ప్రకారం ఇరు దేశాలూ ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా లేదా ఉగ్ర కార్యకలాపాల తీవ్రతను గణనీయంగా తగ్గించేలా కృషి చేయాల్సిందే. ఒప్పందం పునరుద్ధరణ జరిగినా ఉగ్రవాద కట్టడి చర్యలను ఆపేది లేదని ఆయన విస్పష్టంగా పేర్కొనడం గమనార్హం. కాల్పుల విరమణ ఒప్పంద పునరుద్ధరణకు పాకిస్థాన్‌ అంగీకరించడం కశ్మీర్‌ పట్ల దాని విధానంలో ప్రధానమైన మలుపుగా భావించాలి. ఎందుకంటే గతంలో పాక్‌ ఎప్పుడూ కశ్మీర్‌ను అతి పెద్ద సమస్యగా చూపేది. ఈ క్రమంలో యూసఫ్‌ షా అలియాస్‌ సయ్యద్‌ సలాఉద్దీన్‌, యునైటెడ్‌ జీహాద్‌ కౌన్సిల్‌ గ్రూపు చీఫ్‌ వంటి ఉగ్రవాదులు ఇక అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే సయ్యద్‌ సలాఉద్దీన్‌ భావజాలానికి మద్దతిచ్చే హురియత్‌ చీఫ్‌ సయ్యద్‌ అలీ షా గిలానీ ఈ ఒప్పందంపై తన అసంతృప్తి వెలిబుచ్చారు. ఈ మేరకు పాకిస్థాన్‌కు ఆయన రాసిన లేఖపై- కశ్మీర్‌పై ఏర్పాటైన పార్లమెంటు ప్రత్యేక కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇరుపక్షాలకు ఉపయుక్తం

ఆర్థిక చర్యల కార్యాచరణ దళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) ‘నిషిద్ధ జాబితా’ కోరల నుంచి బయటపడటం ప్రస్తుతం పాకిస్థాన్‌ ముందున్న తొలి కర్తవ్యం. సరిహద్దు వెంబడి హింసను ప్రేరేపించి, ఉగ్రవాదులకు ఎప్పటిలాగే సాయం కొనసాగిస్తే జాబితా నుంచి బయటపడటం కుదిరే పనికాదు. కశ్మీర్‌లో ఉగ్రవాదం కొనసాగుతూ ఉండటంవల్లే పాకిస్థాన్‌ ఇప్పటికీ ఆ జాబితాలో ఉంది. ఈ క్రమంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ వేటు నుంచి తప్పించుకునేందుకు తాజా ఒప్పందం ఉపకరించే అవకాశం ఉంటుంది. దీనితోపాటు, ఈ ఒప్పందం పాకిస్థాన్‌కు పలు రకాలుగా ఉపయోగపడుతుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా చైనా తలపెట్టిన సీపీఈసీ నడవా పనులు సజావుగా సాగాలంటే సరిహద్దుల్లో ప్రశాంత పరిస్థితులు అవసరం. ఇప్పటికే గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ను పాకిస్థాన్‌లోని అయిదో ప్రావిన్సుగా మారుస్తూ ఇస్లామాబాద్‌ నాయకత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు రాజ్యాంగంలో అవసరమైన మార్పులూ తీసుకొచ్చింది. చైనా చేపట్టిన భారీ ప్రాజెక్టు ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)’ కూడా ఈ ప్రాంతం గుండానే వెళుతుంది. పాకిస్థాన్‌ వ్యూహాలన్నీ సక్రమంగా అమలు కావాలంటే సరిహద్దులో భారత్‌ వైపు ఉండే గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉండాలి. భారత్‌లోకి ఉగ్రమూకల రాకపోకలు ఆగిపోయినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మరోవైపు- భారత్‌ సైతం జమ్మూకశ్మీర్‌లో చేపట్టే అభివృద్ధి పనులు వేగవంతంగా సాగాలని కోరుకొంటోంది. అందుకు ఆ ప్రాంతంలో శాంతి వెల్లివిరియడం అవసరం. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందున్న సమస్య. అదే సమయంలో వేర్పాటువాద భావజాలాన్ని అణువణువునా నింపుకొన్న తమ దేశంలోని నాయకులతో పాకిస్థాన్‌ ఎలా వ్యవహరిస్తుందన్నదీ చూడాల్సి ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం ఇరుదేశాలకూ కీలకమే. ఇరుదేశాలూ ఈ ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. పాక్‌ తనపై ఉన్న ఉగ్రముద్రలను చెరిపేసుకొనేందుకు ఈ వాతావరణం చాలా కీలకం. అందుకే ఆ దేశం తక్షణమే ఒప్పందానికి కట్టుబడుతున్నట్లు అంగీకరించింది. అయితే భారత వ్యతిరేకత, వేర్పాటువాదంతో రగిలిపోయే రాజకీయ పక్షాలు, నాయకుల ఒత్తిడిని తట్టుకొని పాక్‌ ప్రభుత్వం ఎంతకాలం ఈ విధానానికి కట్టుబాటు చాటుతుందన్నదే ప్రశ్న. 

- బిలాల్‌ భట్‌
 

Posted Date: 08-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం