• facebook
  • whatsapp
  • telegram

అంతర్యుద్ధం దిశగా మయన్మార్‌!

ఏకమవుతున్న ప్రజాస్వామిక శక్తులు

మయన్మార్‌లో సైనిక పాలనకు, జుంటాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజాస్వామిక శక్తులు ఏకమవుతున్నాయి. ప్రజాస్వామిక అనుకూల నేతలు సాధారణ పౌరులతోపాటు, వివిధ జాతి వర్గాలకు చెందిన ప్రజలను ఒకేతాటిపైకి సమీకరిస్తుండటంతో క్రమంగా దేశంలో అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘యిడాంగ్సు లూట్టా ప్రాతినిధ్య కమిటీ(సీఆర్‌పీహెచ్‌)’ నేతృత్వంలో సాగుతున్న ప్రజాస్వామిక అనుకూల ఉద్యమం- దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి పది నుంచి ఇరవై మంది పురుషులను సైనిక సేవల కోసం ముందుకు రావాల్సిందిగా పిలుపిచ్చింది. ప్రస్తుత మయన్మార్‌ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సమాఖ్య సైన్యాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వీరందరినీ ఆహ్వానించింది. సమాఖ్య సైన్యాన్ని ఏర్పాటు చేసేందుకు 10 నుంచి 20 మంది యువతను సిద్ధం చేయాల్సిందిగా ప్రతి గ్రామానికి సీఆర్‌పీహెచ్‌ నుంచి పిలుపు వెళ్లినట్లు ఈశాన్య భారత్‌లోని మిజోరం రాష్ట్రానికి చెందిన రాజ్యసభ ఎంపీ కె.వన్లల్వెనా వెల్లడించారు. మయన్మార్‌లోని సీఆర్‌పీహెచ్‌కు చెందిన ఉన్నతస్థాయి రాజకీయ నేతలతో మాట్లాడిన అనంతరం ఆయన పొరుగు దేశంలోని పరిస్థితిని విశ్లేషించారు. ‘ఇది అంతర్యుద్ధంలాంటి పరిస్థితికి దారితీస్తోంది. మయన్మార్‌లో ప్రజాస్వామిక ఉద్యమానికి తోడ్పాటు అందించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిధులు పోటెత్తుతున్నాయి. అన్ని రకాల మద్దతూ అందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సైనిక జుంటాకు నెల రోజులకు మించి పోరాడే పరిస్థితి లేదు’ అని వన్లల్వెనా స్పష్టం చేశారు.

మిజోరం, మణిపూర్‌లలోని చాలా ప్రాంతాల్లో మయన్మార్‌ ప్రజాస్వామిక అనుకూల ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు, సానుభూతి దక్కుతున్నాయి. భారత్‌, మయన్మార్‌ల మధ్య సరిహద్దుల్లో మిజోరం, మణిపూర్‌, చిన్‌ రాష్ట్రాలు అటూఇటూగా ఉండటం, బలహీనమైన అంతర్జాతీయ సరిహద్దుల కారణంగా ప్రజల మధ్య బంధుత్వాలతోపాటు సన్నిహిత సంబంధాలూ కొనసాగుతున్నాయి. మయన్మార్‌ ‘స్ప్రింగ్‌ రివల్యూషన్‌’ ప్రధాన నేత డాక్టర్‌ సాస కూడా చిన్‌ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఫిబ్రవరి ఒకటో తేదీన సైనిక నాయకత్వం తిరుగుబాటుకు పాల్పడినప్పుడే- తలెత్తబోయే వేధింపులు, విపరిణామాలకు ఆందోళన చెందిన ప్రభుత్వ అధికారులతో పాటు సాధారణ ప్రజలూ వందల సంఖ్యలో మయన్మార్‌ సరిహద్దులు దాటి మిజోరంలోకి ప్రవేశించారు. మరోవైపు, సీఆర్‌పీహెచ్‌ చేపట్టిన సహాయ నిరాకరణ పిలుపునకు స్పందించిన పలువురు సైనికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర ప్రభుత్వోద్యోగులు తమ విధులు నిర్వర్తించేందుకు ససేమిరా అంటున్నట్లు మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

అధికారికంగా జాతుల సాయుధ సంస్థలు (ఈఏఓ)లుగా పిలిచే సంస్థలు స్వయంపాలన, సంపూర్ణ స్వాతంత్య్రం, స్వయంప్రతిపత్తి వంటి డిమాండ్లతో కార్యకలాపాలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం తొలిసారిగా ఇలాంటి ఈఏఓలన్నీ ఏకతాటిపైకి వచ్చి పౌర ప్రభుత్వానికి మద్దతునిస్తూ, కలిసికట్టుగా సైనిక జుంటాను వ్యతిరేకిస్తున్నాయి. మయన్మార్‌లో రాజకీయపరంగా బర్మార్‌ (బర్మన్లు) అనేది ఆధిపత్య సామాజిక వర్గం. వీరికి సంబంధించిన తిరుగుబాటు వర్గాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. ఇలాంటి వర్గాల్లో షాన్లు, కేయన్లు, కచిన్లు, రఖినేలు, చిన్లు ప్రసిద్ధి పొందాయి. సీఆర్‌పీహెచ్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం సైనిక తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి మార్చి 18 నాటికి 217 మంది పౌర ఉద్యమకారులు సైన్యం చేతుల్లో మరణించారు. 2,191 మంది అరెస్టవడమో, అభియోగాలు, శిక్షలకు గురవడమో జరిగింది. 1,872 మంది హింసకు గురయ్యారు. సీఆర్‌పీహెచ్‌ ఇటీవల ప్రజల ఆత్మరక్షణ హక్కును సమర్థిస్తూ- ప్రస్తుత నేరన్యాయ స్మృతిలోని నాలుగో విభాగం కింద ఆత్మరక్షణలో భాగంగా ప్రజలకు తమను తాము కాపాడుకొనేందుకు సంపూర్ణ హక్కు ఉందని స్పష్టం చేసింది. చట్టప్రకారం వ్యక్తులుగానీ, గ్రామ/వార్డు బృందాలు, టౌన్‌షిప్‌లు ఆత్మరక్షణ నిమిత్తం స్పందించే చర్యలను నేర పూరిత కార్యకలాపాలుగా పరిగణించడానికి వీల్లేదని కమిటీ స్పష్టం చేయడం గమనార్హం. 2020 నాటి ఎన్నికల్లో ఆంగ్‌ శాన్‌ సూచీ  నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామిక లీగ్‌ (ఎన్‌ఎల్‌డీ) విజయంతోనే తిరుగుబాటుకు బీజాలు పడ్డాయి. ఆ ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ మొత్తం 476 స్థానాలకుగాను 396 సీట్లను సాధించింది. సైనిక జుంటా మద్దతు ఇచ్చిన ‘యూనియన్‌ సాలిడారిటీ, డెవలప్‌మెంట్‌ పార్టీ (యూఎస్‌డీపీ)’కి కేవలం 33 స్థానాలే దక్కాయి. అదే సైనిక తిరుగుబాటుకు, ప్రస్తుత మయన్మార్‌లో నెలకొన్న అంతర్యుద్ధ తరహా పరిస్థితులకు కారణమైనట్లు పరిశీలకుల భావన.

- సంజీవ్‌ కె.బారువా
 

Posted Date: 22-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం