• facebook
  • whatsapp
  • telegram

జలనిధి... అభివృద్ధికి పెన్నిధి

నౌకా రవాణాతో ప్రగతి తీరాలకు...

అంతర్జాతీయ వాణిజ్య వృద్ధికి ప్రాధాన్యమిచ్చే దేశాలు ఎగుమతులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోగలుగుతాయి. అమూల్య విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జించి తమ దేశ ప్రజలను సంపన్నమార్గంలో వేగంగా పరుగు తీయించగలుగుతాయి. చైనాయే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా 17 శాతం; భారత్‌ది 2.6 శాతం మాత్రమే. భారత్‌ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే, మన వాటా కనీసం ఎనిమిది నుంచి పది శాతానికి పెరగాలని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేయడం గమనార్హం. ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యం ప్రధానంగా సాగర జలాలగుండానే జరుగుతోంది. భారత సరకుల వాణిజ్యంలోనూ 95 శాతం సముద్ర మార్గాల ద్వారా సాగుతోంది. మొత్తం వాణిజ్య విలువలో 75 శాతానికి సముద్రాలే ఆలవాలం. మన చమురు, సహజ వాయువు దిగుమతుల్లో 80 శాతం సముద్ర ట్యాంకర్ల ద్వారా జరుగుతోంది. 2025కల్లా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకొంటున్న భారత్‌, ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రస్తుతమున్న 12 ప్రధాన ఓడరేవులు, 205 చిన్న రేవులు ఏ మాత్రం సరిపోవు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్డీయే ప్రభుత్వం 2016నాటి సాగర శిఖరాగ్ర సభలో సాగరమాల పథకాన్ని ప్రకటించింది. అంతకుముందు 2010-20 సాగర అజెండా కింద తూర్పు, పశ్చిమ తీరాల్లో కొత్తగా రెండు పెద్ద రేవులను నిర్మించాలని తలపెట్టినా, 2020 ముగిసేసరికి కనీసం ఒక్క కొత్త రేవునూ నిర్మించలేకపోయారు. 2016లో చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు కింద మొదట మూడు పెద్ద రేవులను నిర్మించాలని ప్రతిపాదించారు. తరవాత 2020-30 దార్శనిక పత్రంలో ప్రతిపాదిత పెద్ద రేవుల సంఖ్యను ఏకంగా ఆరుకు పెంచారు. నిరుడు కొవిడ్‌ వల్ల భారత ఆర్థికాభివృద్ధి రేటు, సముద్ర వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, ఇటీవలి నెలల్లో వృద్ధిరేటు మళ్లీ పుంజుకోసాగింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా ప్రకారం ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు 11.5 శాతంగా ఉండవచ్చు. కొవిడ్‌ తరవాత ప్రపంచ ఆర్థిక రంగం విజృంభిస్తే, రానున్న నాలుగేళ్లలో భారత్‌ వృద్ధిరేటు ఇప్పుడున్న దానికన్నా 45 శాతం మేర పెరిగినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే అంతకంతకూ పెరిగే సముద్ర వాణిజ్య అవసరాలను తీర్చడానికి ఇప్పుడున్న రేవులు ఏమాత్రం సరిపోవు.

ప్రైవేటీకరణకు పెద్ద పీట

సాగరమాల ప్రాజెక్టు లక్ష్యాల సాధనకు 574 కార్యక్రమాలను ప్రకటించినా, ఇంతవరకు కేవలం 121 మాత్రమే పూర్తి చేయగలిగారు. సాగరమాలకు కేటాయింపులు ఏటా కేంద్ర బడ్జెట్లలో రూ.300-600 కోట్లకు మించకపోవడమే ఇందుకు కారణం. సాగరమాల కింద తలపెట్టిన ప్రాజెక్టులన్నింటినీ స్వయంగా పూర్తి చేసే ఆర్థిక స్థోమత ప్రభుత్వానికి లేకపోవడంతో, అవి ఆలస్యమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ప్రైవేట్‌ రంగాన్ని, ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తోంది. 2021-22లో ఏడు ప్రధాన రేవుల్లో నౌకా రవాణా కార్యకలాపాలను ప్రైవేటీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రభుత్వం సైతం తన వంతుగా 2035కల్లా 574 సాగరమాల కార్యక్రమాల పూర్తికి 8,200 కోట్ల డాలర్లను వెచ్చించబోతున్నట్లు ఇటీవలి సాగర శిఖరాగ్ర సభలో ప్రకటించింది. వీటిలో 92 కార్యక్రమాలను ఏపీకి కేటాయించామని, అందులో 40 ప్రాజెక్టులను మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చేపట్టనున్నట్లు కేంద్ర ఓడరేవుల మంత్రి మన్సుఖ్‌ మాండవ్య ప్రకటించారు. సాగర శిఖరాగ్ర సభలో మొత్తం 424 అవగాహన ఒప్పందాలను (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు వివరించారు. ప్రపంచంలో అగ్రగామి సముద్ర వ్యాపార కంపెనీలు భారత్‌లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు వెల్లడించడం స్వాగతించదగ్గ పరిణామం.

కాలువలూ కీలకమే

రేవుల ఆధారిత అభివృద్ధిని సాధించేందుకు దేశంలో అంతర్గతంగా  కాలువలనూ మెరుగు పరచాలి. వీటిద్వారా సరకు రవాణా చవకైన మార్గం. ఎన్టీపీసీ 2014 జూన్‌లో పశ్చిమ్‌ బంగలోని ఫరక్కా విద్యుదుత్పాదన కేంద్రానికి గంగా కాలువ ద్వారా బొగ్గు రవాణా చేసి టన్నుకు రూ.450 ఆదా చేసుకుంది. అప్పటి నుంచి ఏటా 30 లక్షల టన్నులను గంగా కాలువ ద్వారానే రవాణా చేస్తోంది. సరకులను రోడ్డు ద్వారా కిలోమీటరు దూరం రవాణా చేయడానికి రూ.2.50 ఖర్చయితే, రైలు ద్వారా రూ.1.40 ఖర్చవుతుంది. అదే కాలువ మార్గంలో రూపాయి లోపే వ్యయమవుతుంది. రోడ్డు, రైలు రవాణాలో డీజిల్‌ కారణంగా తలెత్తే వాయు కాలుష్యం సమస్యనూ జలరవాణాలో పరిహరించవచ్చు. కేంద్రం అయిదు జాతీయ జలమార్గాలతో సహా మొత్తం 111 అంతర్గత కాలువలను గుర్తించి, వాటిని రేవులతో అనుసంధానించేందుకు సన్నద్ధమవుతోంది. దేశమంతా కాలువలతో అనుసంధానమైతే, ఈ వ్యవస్థను పొరుగు దేశాలైన నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లకూ విస్తరించి, వాణిజ్యాన్ని మరింత వృద్ధి చేసుకోవచ్చు. ముఖ్యంగా సాగర తీరమే లేని నేపాల్‌, భూటాన్‌లకు భారత రేవులగుండా ఎగుమతి, దిగుమతులు చేసేందుకు కాలువలు తోడ్పడతాయి. దక్షిణాసియాను ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానించే బహువిధ రవాణా యంత్రాంగంలో రోడ్లు, రైలు, నౌకా మార్గాలకు తోడు కాలువలూ అంతర్భాగంగా ఉంటాయి. ఈశాన్య భారత రాష్ట్రాలను ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానించే బహుళవిధ రవాణా ప్రాజెక్టులను ఇప్పటికే చేపట్టారు. మన సాగర తీరంలో మత్స్యకారులతో సహా మొత్తం 20 కోట్లమంది నివసిస్తున్నారు. వీరికి నైపుణ్య శిక్షణ ఇచ్చి సాగరమాల కింద రేవుల ఆధారిత అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాముల్ని చేస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి.

పెరగాల్సిన సామర్థ్యం

సాగరమాల పథకం కింద రేవుల ఆధునికీకరణ, లోతట్టు ప్రాంతాలను వాటితో అనుసంధానించడం, ఓడరేవులే కేంద్రంగా పారిశ్రామికీకరణ సాధించడం, సముద్ర తీరం వెంబడి, నౌకాయానం ద్వారా అభివృద్ధి సాధించాలని భారత్‌ సంకల్పించింది. యాంత్రీకరణ, డిజిటలీకరణ ద్వారా రేవుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఓడరేవుల్లో పునరుత్పాదక ఇంధనాలతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వాడటం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం కూడా సాగరమాల లక్ష్యాల్లో భాగమే. భారత్‌లోని ప్రధాన ఓడరేవుల్లో సౌర, పవన విద్యుత్కేంద్రాలను నిర్మిస్తున్నామని, 2030కల్లా ఈ రేవులకు కావలసిన విద్యుత్‌లో 60 శాతం పునరుత్పాదక వనరుల నుంచే లభ్యమవుతుందని ఇటీవలి సాగర శిఖరాగ్ర వర్చువల్‌ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు.

- వరప్రసాద్‌
 

Posted Date: 20-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం