• facebook
  • whatsapp
  • telegram

వెనీలా దీవులతో దోస్తీ

హిందూ సంద్రంపై పట్టుకు అవకాశం

హిందూ మహాసముద్రంలో బలమైన నౌకాదళ శక్తిగా అవతరించాలంటే సముద్ర తీర దేశాలు, ద్వీపదేశాలతో భారత్‌ సన్నిహిత సంబంధాలను కొనసాగించాలి. ఆసియా-ఆఫ్రికాల మధ్య ఉన్న ఈ సముద్రమార్గం ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైనది. అందుకే చైనా చాపకింద నీరులా ఇక్కడ తిష్ఠవేస్తోంది. ప్రత్యేకించి ఆఫ్రికా తూర్పు తీరం, మడగాస్కర్‌లను విడదీస్తున్న మొజాంబిక్‌ ఛానల్‌తో పాటు మడగాస్కర్‌ పశ్చిమ తీరమూ అంతర్జాతీయ సముద్ర మార్గాలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఆసియా నుంచి భారీ రవాణానౌకలు హిందూ మహాసముద్రం నుంచి కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌ ద్వారా అట్లాంటిక్‌ సముద్రం మీదుగా ఐరోపా, ఉభయ అమెరికా ఖండాలకు వెళ్లి వస్తుంటాయి. వీటి రాకపోకలు వెనీలా దీవుల సమీపంలోని మొజాంబిక్‌ ఛానల్‌ ద్వారా సాగుతాయి. హిందూ మహాసముద్ర నైరుతి ప్రాంతంలోని సార్వభౌమ దేశాలైన కమరొజ్‌, మడగాస్కర్‌, మారిషస్‌, సీషెల్స్‌; ఫ్రాన్స్‌ పాలనలోని మెయెటె, రీయూనియన్‌లను వెనీలా ద్వీపాలుగా వ్యవహరిస్తారు. వెనీలాను ఎక్కువగా ఉత్పత్తి చేయడంతో వాటికి ఆ పేరు వచ్చింది. హిందూ మహాసముద్రంలోని కీలక ప్రాంతంలో ఉన్న ఈ దీవుల్లో ఎలాంటి అలజడి ఏర్పడినా అంతర్జాతీయ వాణిజ్యం ప్రభావితమవుతుంది.

ఆధునిక యుద్ధతంత్రంలో విమాన వాహక నౌకలతో పాటు దీవుల్లో నౌకాదళ స్థావరాల ఏర్పాటు ముఖ్యమైనది. భారత్‌ సైతం మారిషస్‌, సీషెల్స్‌తో ఆ దిశగా ఒప్పందాలు కుదుర్చుకొంది. ఇటీవలే సీషెల్స్‌కు పీఎస్‌ జొరాస్టర్‌ అనే గస్తీనౌకను కానుకగా ఇచ్చింది. 2005 నుంచి ఇప్పటి వరకు భారత్‌ ఇలాంటి నాలుగు నౌకలను ఆ దేశానికి బహూకరించింది. 2018లో భారత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ మడగాస్కర్‌, మారిషస్‌ దేశాల్లో పర్యటించారు. ఆ సమయంలో పలు ఒప్పందాలు కుదిరాయి. అంతకు మూడేళ్ల ముందు ప్రధాని మోదీ సీషెల్స్‌, మారిషస్‌లతో కీలకమైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. 2014లో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార వేడుకలో ఇరుగు పొరుగుదేశాల అధినేతలతో పాటు మారిషస్‌ అప్పటి సారథి నవీన్‌ రాంగులామ్‌ పాల్గొన్నారు. మారిషస్‌లో భారత సంతతి ప్రజలు లక్షల్లో ఉన్నారు. ఆ దేశంతో వాణిజ్య, సైనిక సంబంధాలను మెరుగుపరిచేందుకు అనాడు మోదీ వేసిన మొదటి అడుగు మంచి ఫలితాలనే ఇచ్చింది. నిరుడు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేతృత్వంలో అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం కమరోజ్‌లో పర్యటించింది.

భారతీయ వ్యూహకర్తల్లో ఒకరైన కేఎం పాణిక్కర్‌ వెనీలా దీవుల ప్రాముఖ్యాన్ని గుర్తించి, భారత నౌకాదళ ప్రాబల్యం కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌ వరకు ఉండాలని సూచించారు. హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా ఉండటం భారత్‌కు చాలా అవసరం. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఇప్పటికే కృత్రిమ దీవిని నిర్మించింది. ఇక్కడి నుంచే చైనా నౌకాదళం, సైన్యం దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి వచ్చే ఫిలిప్సీన్స్‌, ఇండొనేసియా, వియత్నాం తదితర దేశాల నౌకలకు ఆటంకం కలిగిస్తున్నాయి. మరో వైపు ఆఫ్రికా కొమ్ముగా పిలిచే జిబౌటిలో చైనా నౌకాదళ స్థావరాన్ని నెలకొల్పింది. దీని ద్వారా భవిష్యత్తులో ఇతర దేశాల నౌకా రవాణాను ఇబ్బంది పెట్టే ప్రమాదముంది. చైనా సవాల్‌కు సమాధానంగా భారత్‌ సీషెల్స్‌కు చెందిన అజంప్షన్‌, మారిషస్‌లోని అగలెగ దీవుల్లో నౌకా స్థావరాల నిర్మాణానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటిలో అగలెగలో నిర్మాణం పూర్తయ్యింది. అసంప్షన్‌ స్థావరానికి సంబంధించి సీషెల్స్‌ నూతన సారథి రాంకలవన్‌ లేవలెత్తిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ అంశంపై ఆ దేశ విదేశాంగ మంత్రి రడెగొండెతో మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ చర్చలు జరిపారు. సీషెల్స్‌కు 50 వేల డోసుల కరోనా టీకాలనూ భారత్‌ వితరణగా ఇచ్చింది. మరోవైపు, ఫ్రాన్స్‌ సూచనతో నిరుడు భారత్‌కు హిందూ మహాసముద్ర సంఘంలో (ఇండియన్‌ ఓషన్‌ కమిషన్‌- వెనీలా ద్వీపాలు ఇందులో సభ్యదేశాలు) పరిశీలక హోదాలో సభ్యత్వం కల్పించారు. అయితే, చైనా అయిదేళ్ల క్రితమే ఈ హోదాను పొందడం గమనార్హం! సమీకృత భద్రత, ఆర్థిక ప్రగతి అంశాల్లో వెనీలా దేశాలు భారత సహాయ సహకారాలను ఆశిస్తున్నాయి. చైనా రాకను దృష్టిలో ఉంచుకొని ఈ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను భారత్‌ ఇంకా బలోపేతం చేసుకోవాలి.

- కొలకలూరి శ్రీధర్‌
 

Posted Date: 31-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం