• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

వ్యూహం మార్చిన అమెరికా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై చిర్రుబుర్రులాడుతూ, ఆర్థిక ఆంక్షలతో తన పదవీ కాలం గడిపేశారు. చివరికి ఆయన ఒంటెత్తు పోకడలతో నష్టపోయింది చైనా కాదు- అమెరికాయేనని విమర్శలు మిన్నంటాయి. జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి పంథా మార్చారు. చైనా బలాన్ని, అమెరికా బలహీనతను కచ్చితంగా బేరీజు వేసుకొని వాటిని అధిగమించడానికి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అమెరికా ఎగువ సభ సెనేట్‌ ఇటీవల ఆమోదించిన నవీకరణ, పోటీ సామర్థ్య పెంపు బిల్లు ఈ దిశగా ఓ కీలకమైన ముందడుగు. దీంతోపాటు చైనాపై పోటీకి సాటి సంపన్న దేశాల కూటమి గ్రూప్‌ ఆఫ్‌ 7 (జీ7)ను బైడెన్‌ కలుపుకొని పోతున్నారు. జెనీవాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశమై అమెరికా-రష్యాల మధ్య బద్ధ వైరాన్ని తగ్గించడానికి   కృషి చేశారు. చైనాను దారికి తీసుకురావడానికి మిగతా ప్రపంచాన్ని కలుపుకొని పోవడమే బైడెన్‌ ఉద్దేశమని స్పష్టమవుతోంది.  

చైనా మిడిసిపాటు

వర్ధమాన దేశాల్లో మౌలిక వసతుల విస్తరణకు చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం(బీఆర్‌ఐ)లో 100 దేశాల భాగస్వామ్యం- నానాటికీ విస్తరిస్తున్న బీజింగ్‌ ప్రాబల్యానికి నిదర్శనం. అయితే, ఈ పథకం వర్ధమాన దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. ఆ దేశాల్లో మౌలిక వసతుల నిర్మాణ, విస్తరణలకు 40 లక్షల కోట్ల డాలర్లు కావలసి ఉన్నందువల్ల, వాటికి చైనాయే దిక్కవుతోంది. బీఆర్‌ఐ కింద 3.7 లక్షల కోట్ల డాలర్ల విలువైన 2,600 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఆర్థిక బలిమిని చూసుకునే చైనా ఏవో కొన్ని సంపన్న దేశాలు ప్రపంచాన్ని ఏలే రోజులు గతించాయని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించడానికి అమెరికా నాయకత్వంలో జీ7 దేశాలు అడుగు ముందుకేశాయి. ఇంగ్లాండ్‌లో ఈ నెల 11-13 తేదీల్లో జరిగిన జీ7 శిఖరాగ్ర సభలో వర్ధమాన దేశాల అభ్యున్నతితో మెరుగైన ప్రపంచ నిర్మాణానికి బీ3డబ్ల్యు పేరిట కొత్త పథకాన్ని ప్రకటించారు. దీని కింద వర్ధమాన దేశాల్లో మౌలిక వసతుల విస్తరణకు నిధులు సమీకరించడానికి పలు మార్గాలను అనుసరించబోతున్నారు. జీ7 సభకు ముందు జూన్‌ ఏడో తేదీన ప్యారిస్‌లో జరిగిన బ్లూ డాట్‌ నెట్‌వర్క్‌ (బీడీఎన్‌) సలహా బృంద సమావేశాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఇండో-పసిఫిక్‌ దేశాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు, సాంకేతిక సహాయం అందించే విషయాన్ని ఈ సమావేశంలో పరిశీలించారు. 38 సంవన్న దేశాల సంఘమైన ఓఈసీడీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 150 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులూ పాల్గొన్నారు. ఆ కంపెనీలు 12 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తున్నాయి. ఓఈసీడీ దేశాల పింఛన్‌ సంస్థల వద్ద 32 లక్షల కోట్ల డాలర్ల ఆస్తులు ఉన్నాయి. బీడీఎన్‌ హామీ ఇస్తే మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడానికి ఈ నిధులను వినియోగించే అవకాశం ఉంది.

అస్త్రాలకు పదును పెడుతున్న బైడెన్‌

శాస్త్రసాంకేతిక రంగాల్లో చైనా పోటీని చిత్తు చేయడానికీ బైడెన్‌ ప్రభుత్వం నడుంకట్టింది. ఇందుకు ఉద్దేశించిన 19,000 కోట్ల డాలర్ల (14లక్షల కోట్ల రూపాయలకు పైగా) నవీకరణ, పోటీ సామర్థ్య పెంపు బిల్లును అమెరికా సెనేట్‌ ఆమోదించింది. దీనికింద 5,400 కోట్ల డాలర్లను సెమీ కండక్టర్లు, టెలికమ్యూనికేషన్‌ పరికరాల ఉత్పత్తికి కేటాయిస్తారు. అమెరికాలో కార్ల ఉత్పత్తిని దెబ్బతీస్తున్న చిప్‌ల కొరతను తీర్చడానికి బిల్లులో 200 కోట్ల డాలర్లు కేటాయించారు. ఈ నిధులతో అమెరికాలో ఏడు నుంచి 10 వరకు కొత్త సెమీకండక్టర్‌ (చిప్‌) తయారీ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచం వినియోగిస్తున్న చిప్‌లలో 75 శాతం తైవాన్‌, దక్షిణ కొరియా, చైనా తదితర ఆసియా దేశాల నుంచే సరఫరా అవుతున్నాయి. ఈ రంగంలో అమెరికా ఆధిక్యాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా బిల్లులో కేటాయింపులు పెంచారు. చైనా సామాజిక మాధ్యమ యాప్‌ టిక్‌టాక్‌ను అమెరికా ప్రభుత్వ ఫోన్లలో, ఇతర పరికరాల్లో వాడకూడదని, చైనా ప్రభుత్వ అండతో నడిచే కంపెనీల నుంచి డ్రోన్లు కొనకూడదని ఈ బిల్లు నిషేధిస్తోంది. అమెరికాపై సైబర్‌ దాడులకు దిగుతూ, అమెరికా కంపెనీల మేధా హక్కులను దొంగిలిస్తున్న చైనా కంపెనీలపై తప్పనిసరిగా ఆంక్షలు విధించాలని నిర్దేశిస్తోంది. సాంకేతిక రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న చైనా ఆధిక్యాన్ని అడ్డుకోకపోతే, అమెరికా త్వరలోనే అగ్ర రాజ్య హోదా కోల్పోక తప్పదని సెనేట్‌లో పాలక డెమోక్రటిక్‌ పార్టీ నాయకుడు చక్‌ షూమర్‌ వ్యాఖ్యానించారు. సెనేట్‌లో డెమోక్రాట్లకు ఒకే ఒక్క ఓటు ఆధిక్యత ఉన్నా కొత్త బిల్లుకు ప్రతిపక్ష   రిపబ్లికన్లు సైతం వత్తాసు ఇవ్వడంతో 68-32 ఓట్ల ఆధిక్యంతో బిల్లు నెగ్గింది. 21వ శతాబ్దిలో విజేతగా, అగ్ర నేతగా నిలవడానికి చైనాతో పోటీపడుతున్నామని, అందులో అమెరికా వెనకబడకూడదని బైడెన్‌ ఉద్ఘాటించారు. మేడిన్‌ చైనా 2025 ప్రణాళికతో బీజింగ్‌ ఇప్పటికే కృత్రిమ మేధ (ఏఐ), 5జి, 6జి, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి హైటెక్‌ రంగాల్లో పట్టు పెంచుకోవడాన్ని ఉద్దేశించి ఆయన అలా వ్యాఖ్యానించారు. నవీకరణ బిల్లులో కేటాయించిన 10,000 కోట్ల డాలర్లతో ఏఐ, రోబోటిక్స్‌, సెమీకండక్టర్లు, హైపవర్‌ కంప్యూటింగ్‌లలో ముందంజ వేసే బాధ్యతను ఒక కొత్త విభాగానికి అప్పగించారు. జాతీయ సైన్స్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌) పరిశోధనలకు 2022-2026 మధ్యకాలంలో 8,100 కోట్ల డాలర్లు కేటాయించాలని బిల్లు తీర్మానించింది. దీంతోపాటు సాంకేతిక విద్యాభివృద్ధికి హెచ్చు నిధులు కేటాయించింది. ఇలా సమస్త అస్త్రశస్త్రాలకు పదునుపెడుతూ చైనాకు చెక్‌పెట్టడానికి బైడెన్‌ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ సఫలమవుతాయో కాలమే తేల్చాలి.

నిధుల సమీకరణలో అగ్రరాజ్యం

సెనేట్‌లో భారీ మెజారిటీతో నెగ్గిన అమెరికా నవీకరణ బిల్లు త్వరలోనే దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభ ఆమోదం కోసం వెళ్ళబోతున్నది. అయితే, ఇప్పటికే ఇటువంటి బిల్లు ఒకటి సభ ఆమోదం కోసం వేచి ఉంది. బహుశా రెండు బిల్లులను సమన్వయపరచే అవకాశం ఉంది. ఈ బిల్లుతోపాటు బైడెన్‌ సర్కారు ప్రతిపాదిస్తున్న ఉపాధి కల్పన, మౌలిక వసతుల నిర్మాణ పథకాలకూ భూరి నిధులు కావాలి. గత నెలలో బైడెన్‌ చేసిన బడ్జెట్‌ ప్రతిపాదనలు- కొత్త పథకాలపై రానున్న పదేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్లు వ్యయీకరించాలని ఉద్దేశిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు సున్నా వడ్డీకి రుణాలు తీసుకునే వెసులుబాటు అమెరికాకు ఉంది. దీంతోపాటు కంపెనీలు, అధికాదాయ వర్గాలపై పన్నులు పెంచడం ద్వారా అదనపు నిధులు సమీకరించాలని బైెడెన్‌ సర్కారు ప్రతిపాదిస్తోంది. బహుళజాతి కంపెనీలపై అంతర్జాతీయ కనీస పన్నును విధించాలన్న ప్రతిపాదనకు జీ7 దేశాల సదస్సులో సానుకూలత వ్యక్తం కావడం ఇక్కడ గమనార్హం.

- ఏఏవీ ప్రసాద్‌
 

Posted Date: 21-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం