• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌ నోట ప్రేమ మాట!

అంతర్జాతీయ ఖ్యాతి కోసం చైనా యత్నం

‘విశ్వసనీయమైన, గౌరవంతో కూడిన ప్రేమమయమైన దేశంగా మారితే, అంతర్జాతీయంగా మన ఖ్యాతి మరింత పెరుగుతుంది’ అని ఇటీవల చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపిచ్చారు. వాస్తవానికి, డ్రాగన్‌ది దుందుడుకు విదేశాంగ విధానం. దాదాపు 18 దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఆ జాబితాలో చైనాకు అత్యంత సన్నిహిత దేశమైన ఉత్తరకొరియాతో పాటు రష్యా కూడా ఉండటం గమనార్హం. మరోవైపు, చైనా నుంచి వ్యాప్తిచెందిన కరోనా వైరస్‌ ప్రపంచానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా డ్రాగన్‌కు వ్యతిరేకంగా వాదనలు బలపడుతున్న తరుణంలో చైనా మరో కొత్త ఎత్తుగడకు పావులు కదుపుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిన్‌పింగ్‌ ప్రసంగంలో ప్రధానంగా మూడు అంశాలను పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అగ్రభాగాన చైనా నిలిచేందుకు ఒక ప్రచారవేదిక, చైనాలో స్థిరంగా కొనసాగుతున్న సంస్కరణలు, అభివృద్ధిపై ప్రపంచ ప్రజల దృష్టిలో సానుకూల వాతావరణం, భవిష్యత్తు మానవాళికి డ్రాగన్‌ చేయూత తీరుపై అంతర్జాతీయంగా భారీయెత్తున ప్రచార కార్యక్రమాలను రూపొందించాలని కోరారు. తద్వారా ప్రపంచంలోని పలుదేశాల్లో తమకు వ్యతిరేకత బలపడకుండా చూడాలన్నది ఆయన యోచన. అయితే కరోనా విషయంలో చైనాపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ అసంతృప్తి రానున్న కాలంలో దావానలంలా వ్యాపించే ప్రమాదముందని చైనా వర్గాలు అనుమానిస్తున్నాయి. వీటితో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ ప్రయోగశాల నుంచే బయటకు వచ్చిందని కరాఖండీగా చెబుతూ, సమకాలీన ప్రపంచ సమాజానికి నష్టపరిహారం కూడా డిమాండ్‌ చేశారు. వైరస్‌ ప్రయోగశాల నుంచే బయటకు వచ్చిందన్న వాదన క్రమేపీ బలపడుతోంది.

సాధారణంగా ఏదైనా దేశం చైనాపై విమర్శలు చేసిన వెంటనే బీజింగ్‌ దౌత్యవేత్తలు రంగంలోకి దిగుతారు. ఘాటైన పదజాలం, హెచ్చరికలు కలగలపిన ప్రకటనలతో ఎదురుదాడి చేస్తారు. అయితే, ఇటీవల చైనాపై విమర్శలను చేసేవారు, పలు ఆధారాలతో చేయడంతో తిప్పికొట్టడం డ్రాగన్‌కు కష్టమవుతోంది. వీటితో పాటు కరోనా పుట్టినిల్లుగా పేరు తెచ్చుకున్న బీజింగ్‌కు అంతర్జాతీయంగా మంచి పేరు రావాలన్న ఆకాంక్ష మొదలైంది. ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలన్న కోరిక కూడా చైనాలో బలపడుతోంది. చైనా విదేశాంగ విధానం సంక్లిష్టమైనదిగా నిపుణులు పేర్కొంటారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విధానాన్ని డ్రాగన్‌ మార్చుకోదు. కానీ తమ దేశం సుఖ, సంతోషాలతో, ఉజ్జ్వల భవిష్యత్తు దిశగా సాగుతున్నట్లు ప్రపంచానికి చూపుతుంది. వీగర్‌ మైనారిటీలపై దమనకాండ, దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్య ధోరణి, సరిహద్దు దేశాలతో ఘర్షణ, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య వాదులపై ఉక్కుపాదం... తదితర కరడుగట్టిన విధానాలను చైనా మార్చుకుంటుందా అనేది సందేహమే.

అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా బైడెన్‌ పగ్గాలు చేపట్టిన అనంతరం ప్రపంచానికి మరింతగా చేరువవుతున్నారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా ఐరోపా సమాఖ్యకు దూరంగా జరిగింది. కానీ బైడెన్‌ ఆ దూరాన్ని చెరిపివేసేందుకు యత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చైనా విస్తరణను అడ్డుకునేందుకు జి-7 దేశాల కూటమి యత్నిస్తుందని ప్రకటించారు. బైడెన్‌ అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ఠను, అగ్రరాజ్య హోదా నుంచి ఆపన్నహస్తంగా మారేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు, బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ మార్గం దాదాపు 60 దేశాల నుంచి వెళుతుంది. దీనికి ఆయా దేశాల ప్రభుత్వాల మద్దతు, ప్రజల సహకారం చైనాకు చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఇనుప తెరలు కలిగిన దేశంగా పేరు తెచ్చుకున్న చైనా తన స్నేహదేశాల కూటమిని విస్తరించేందుకు ప్రేమమయంగా మారాలని ఆశిస్తోంది. ఆచరణలో అది తేలికైన పనేమీ కాదని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక దేశం ప్రతిష్ఠ అంతర్జాతీయంగా పెరగాలంటే పలు ఉదాత్త మార్గాలను అనుసరించాల్సిన అవసరముంది. ఎలాంటి ఆత్మావలోకనం చేసుకోకుండా కేవలం తమ వాణిజ్య సామ్రాజ్యాన్ని పెంపొందించుకునేందుకు, కరోనా వైరస్‌ సృష్టికర్త అన్న అపవాదు నుంచి ప్రపంచ దృష్టిని మళ్ళించేందుకు, ప్రేమమయ భావనను వ్యాప్తి చేసినా, అంత తేలిగ్గా ఫలితం దక్కే అవకాశం లేదనే అభిప్రాయాలున్నాయి. అధ్యక్షుడి పిలుపు మేరకు చైనా దౌత్యవిధానాన్ని అంతర్జాతీయంగా తీసుకువెళ్లేందుకు ఆ దేశ దౌత్యవేత్తలు సన్నాహాలు చేపట్టారు. పాశ్చాత్యదేశాల దృష్టిలో తమ దేశ విధానాలు దుందుడుకు ధోరణితో ఉన్నట్లు కనిపించినా- దేశ హక్కులు, ప్రయోజనాలు కాపాడుకునేందుకే తాము యత్నిస్తున్నట్లు చెబుతున్న దౌత్యవేత్తలు...మరోవైపు తమ మౌలిక విదేశాంగ విధానం నుంచి తప్పుకొనేది లేదని స్పష్టంచేస్తుండటం గమనార్హం.

- కొలకలూరి శ్రీధర్‌
 

Posted Date: 23-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం